త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Marco Rubio in India | భారత్‌పై ట్రంప్ ‘హెల్‌హోల్’ వ్యాఖ్యలు.. రిపోర్టర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మార్కో రూబియో!

భారత్‌ను ట్రంప్ 'హెల్‌హోల్' అన్నారంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కౌంటర్ ఇచ్చారు. ట్రంప్‌నకు ఇండియా అంటే ఇష్టమన్నారు.

J

National | Published On May 25, 2026, 10.00 pm IST

Marco Rubio in India | భారత్‌పై ట్రంప్ ‘హెల్‌హోల్’ వ్యాఖ్యలు.. రిపోర్టర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మార్కో రూబియో!
Advertisement

Marco Rubio in India | త్రినేత్ర.న్యూస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో భారత్‌ను ఉద్దేశించి 'హెల్‌హోల్' (నరకకూపం లాంటిది) అన్నారంటూ వచ్చిన ఆరోపణలపై యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో (Marco Rubio) ఘాటుగా స్పందించారు. న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి మీడియా ప్రెస్ బ్రీఫింగ్‌లో (Press briefing) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అమెరికన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రూబియో దీటుగా బదులిచ్చారు.

అసలేం జరిగిందంటే?

ఏప్రిల్ నెలలో ఓ పాడ్‌క్యాస్టర్ భారత్‌ను 'హెల్‌హోల్' అంటూ కించపరుస్తూ చేసిన పోస్ట్‌ను ట్రంప్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీని గురించి ఓ రిపోర్టర్ ప్రస్తావిస్తూ.. ఆన్‌లైన్‌లో భారతీయులు ఎదుర్కొంటున్న జాత్యహంకారం (Racism) పై రూబియోను ప్రశ్నించారు.

దీనిపై రూబియో సమాధానమిస్తూ.. "మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఆన్‌లైన్‌లో ఎవరో ఏదో పోస్ట్ చేశారని నేను అనుకున్నా.. అది ట్రోల్ (Troll) లేదా బాట్ (Bot) అకౌంట్ అయి ఉండొచ్చు. అందుకే ఆ వ్యక్తి పేరేంటో స్పష్టంగా చెప్పాలని నేను రిపోర్టర్‌ను అడిగాను. కానీ ఆయన చెప్పలేకపోయారు" అని అన్నారు.

ట్రంప్‌కు ఇండియా అంటే ఇష్టం.. మోదీకి ఫ్యాన్!

వెంటనే ఆ రిపోర్టర్ కల్పించుకుని, ఆ పోస్ట్ చేసింది సాక్షాత్తూ ట్రంప్ (Donald Trump) అని చెప్పారు. దీనికి రూబియో బదులిస్తూ.. "ఆయన అలా అనలేదు. ట్రంప్‌నకు ఇండియా (India) అంటే చాలా ఇష్టం. ప్రధాని మోదీ (PM Modi) కి ఆయన పెద్ద ఫ్యాన్. నిన్నటి ఈవెంట్‌లో కూడా ట్రంప్ ఈ విషయం చెప్పారు. ఒకవేళ ట్రంప్‌కు భారత్ పట్ల ఇష్టం లేకపోతే నన్ను ఇక్కడికి పంపేవారు కాదు. తనకు అత్యంత ఆప్తుడైన సెర్గియోను ఇక్కడికి అంబాసిడర్‌గా (Ambassador) పంపేవారు కాదు" అని స్పష్టం చేశారు.

"ప్రపంచంలో ప్రతి దేశంలోనూ కొందరు పనికిమాలిన వాళ్లు ఉంటారు. సోషల్ మీడియాలో (Social media) పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతుంటారు. అమెరికాలో కూడా ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ఎంతో మంది ప్రజలు అమెరికన్లుగా మారి మన దేశాన్ని సుసంపన్నం చేశారు" అని రూబియో కౌంటర్ ఇచ్చారు.

పాకిస్థాన్ ఉగ్రవాదంపై భారత్ ఆందోళన

ఇదే ప్రెస్ బ్రీఫింగ్‌లో పాకిస్థాన్ (Pakistan) అంశం కూడా చర్చకు వచ్చింది. అమెరికా-ఇరాన్ వివాదంలో పాక్ మధ్యవర్తిత్వం వహించడంపై భారత్ ఏమైనా ఆందోళన వ్యక్తం చేసిందా? అని అడగ్గా.. మార్కో రూబియో స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

"పాకిస్థాన్ గడ్డపై నుంచి ఆపరేట్ అవుతున్న ఉగ్రవాద (Terrorist) సంస్థలు భారత్‌ను టార్గెట్ చేయడంపై ఇక్కడ ఎప్పుడూ ఆందోళన ఉంటుంది. అయితే ఇరాన్ విషయంలో పాక్ పాత్ర గురించి ఇక్కడ ప్రస్తావనకు రాలేదు. ఆ విషయంలో వారు ఫిర్యాదు చేస్తారని నేను అనుకోను. భారత్‌కు పాకిస్థాన్‌తో ఉన్న ఇబ్బంది వేరు" అని రూబియో కుండబద్దలు కొట్టారు.

నాలుగు రోజుల పర్యటనలో..

మార్కో రూబియో ప్రస్తుతం భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్నారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ఆయన.. పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement