త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonia Gandhi | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ

Sonia Gandhi | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh)పై ఉన్న రాజకీయ కుట్రలు ముగిశాయని, ఆయన వ్యక్తిగత నిజాయితీకి సుప్రీంకోర్టు తీర్పుతో క్లీన్ చిట్ లభించిందని కాంగ్రెస్ అగ్రనాయ‌కురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) అన్నారు. అత్యంత ప్ర‌తిభావంతుడైన ప్ర‌ధానిగా చ‌రిత్ర ఆయ‌న్ని కచ్చితంగా గుర్తుంచుకుంటుందని కొనియాడారు. ఈ మేర‌కు ప్ర‌ముఖ జాతీయ ప‌త్రిక ది ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన ఎడిటోరియ‌ల్ వ్యాసంలో సోనియా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

D

National | Published On Aug 11, 2026, 11.22 am IST

Sonia Gandhi | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ
Advertisement

Sonia Gandhi | త్రినేత్ర‌.న్యూస్ : బొగ్గు బ్లాకుల కేటాయింపునకు (Coal Case Verdict) సంబంధించిన కుంభకోణం కేసులో మన్మోహన్ సింగ్ (Manmohan Singh)కు సుప్రీంకోర్టు (Supreme Court ) క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ చైర్‌ప‌ర్స‌న్ సోనియా గాంధీ (Sonia Gandhi) హర్షం వ్యక్తం చేశారు. దీన్ని ఒక చారిత్రాత్మ‌క ఘ‌ట్టంగా అభివ‌ర్ణించారు. ఈ నిర్ణయం ప్రముఖ ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడిపై సుదీర్ఘకాలంగా సాగుతున్న తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపుకు ముగింపు ప‌లికింద‌ని వ్యాఖ్యానించారు.

ఈ తీర్పు మ‌న్మోహ‌న్ సింగ్‌ వ్యక్తిగత నిజాయితీ, జవాబుదారీతనం విషయంలో ఆయనకున్న పేరును నిలబెట్టిందని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ‘దివంగత నేత మన్మోహన్ సింగ్‌కు వ్యతిరేకంగా ఒక లాబీ పూర్తిసన్నద్ధతతో, సమన్వయంతో పనిచేసింది. ఇందులో అధికార గణం మొదలు న్యాయవ్యవస్థకు చెందిన వారు, పౌర సమాజం, ఆర్ఎస్ఎస్, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. నాటి ఆరోపణలన్నీ బోగస్ అని నేడు రుజువైంది. మన్మోహన్ సింగ్ నిర్దోషి అన్న విషయం స్పష్టంగా తేలింది’ అని సోనియా గాంధీ రాసుకొచ్చారు

ప్ర‌జా సేవ‌కు నిద‌ర్శ‌నం..

ఈ సంద‌ర్భంగా మ‌న్మోహ‌న్ సింగ్ పాల‌న‌పై సోనియా ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న ప్ర‌భుత్వం ప్ర‌ధాన ఆర్థిక‌, సామాజిక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చింద‌ని తెలిపారు. యూపీఏ ప్ర‌భుత్వం బ‌ల‌మైన ఆర్థిక వృద్ధిని న‌మోదు చేసింద‌ని గుర్తు చేశారు. పేద‌రికాన్ని నిర్మూళించింద‌ని, సామాజిక సంక్షేమ‌ కార్య‌క్ర‌మాల‌ను విస్త‌రించింద‌ని, భార‌దేశ ప్ర‌జాస్వామ్య సంస్థ‌ల‌ను బోల‌పేతం చేసింద‌ని చెప్పుకొచ్చారు. సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA), జాతీయ ఆహార భద్రతా చట్టం వంటి చట్టాలు ఆయన హయాంలోనే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు.

ఇవి పౌరులకు పారదర్శకతను, జీవనోపాధిని, విద్యను, ఆహారాన్ని, చ‌ట్టపరమైన హక్కులను క‌ల్పించాయ‌ని చెప్పుకొచ్చారు. చారిత్రాత్మక ఇండో-అమెరికా పౌర అణు ఒప్పందం చర్చల్లో మాజీ ప్రధాని పాత్రను సోనియా గాంధీ ప్ర‌త్యేకంగా ప్రశంసించారు. ఇది ఆయన రాజకీయ ధైర్యాన్ని ప్రతిబింబిస్తుందని, ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేయడానికి సహాయపడిందని పేర్కొన్నారు. ఆయన జీవితం నిజాయితీకి, వినయానికి, ప్రజా సేవకు నిదర్శనమని కొనియాడారు.

మోదీ త‌న‌ను తాను క్ష‌మించుకోవాలి

ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుత ఎన్డీయే ప్ర‌భుత్వంపై సోనియా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ ప్ర‌భుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం దుర్వినియోగం చేస్తోంద‌ని ఆరోపించారు. అధికారంలో ఉన్న నేత‌ల‌పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సంస్థ‌ల‌ను బీజేపీ పెద్ద‌లు వాడుకుంటున్నార‌ని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ నిజాయితీ, బాధ్యతాయుతమైన పాలన.. ప్ర‌స్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని సోనియా త‌న వ్యాసంలో పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ దేశ పార్లమెంటు చరిత్రలో అత్యంత దిగజారిన క్షణంగా నిలిచిపోతాయని అన్నారు. ఇటీవల కాలంలో విద్యార్థులను క్షమిస్తున్న ప్రధాని మోదీ ఈ విషయంలో తనని తాను క్షమించుకోవాలని చురకలంటించారు.

Prime Minister Narendra Modi with former PM Manmohan Singh. File Photo

మ‌న్మోహ‌న్‌కు సుప్రీం క్లీన్ చిట్‌..

యూపీఏ హయాంలో సంచలనం సృష్టించిన ఒడిశా తలబీరా-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుల కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆయన మరణించిన రెండేళ్ల తర్వాత, 2026 జూలై 29న అత్యున్నత న్యాయస్థానం సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌ను ఆమోదిస్తూ ఆయనపై ఉన్న కేసును కొట్టివేసింది. 2024 డిసెంబర్‌లో మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విష‌యం తెలిసిందే.

"సమకాలీన మీడియా, పార్లమెంట్‌లోని ప్రతిపక్షాల కంటే చరిత్రే నా పట్ల మరింత దయతో ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జనవరి 2014లో పదవీకాలంలో ఉన్న స‌మ‌యంలో చివరి విలేకరుల సమావేశంలో ప్రముఖంగా అన్నారు. అప్పట్లో ప్రతిపక్షాలు, మీడియా నుండి తన ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జూలై 29న సుప్రీంకోర్టు తీర్పుతో.. మన్మోహన్ సింగ్ అప్పట్లో చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యాయ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Also Read..

సింగ‌ర్ రాహుల్ సింప్లిగంజ్‌పై కేసు న‌మోదు - బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడంటూ యువ‌తి ఫిర్యాదు

బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లు.. ఒక్క రోజులోనే రూ.31వేలు జంప్‌..

కొలంబియాలో భారీ భూకంపం.. 132 మంది మృతి

Advertisement
Advertisement