త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Civic Polls | ముంబై మున్సిపల్ పోరు: మహాయుతి మేనిఫెస్టో విడుదల.. మహిళలు, యువతకు పెద్దపీట

ముంబై మున్సిపల్ ఎన్నికల కోసం మహాయుతి కూటమి భారీ హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలకు బస్సు ప్రయాణంలో 50 శాతం రాయితీ, వడ్డీ లేని రుణాలు మరియు కృత్రిమ మేధ (AI) సాయంతో అక్రమ చొరబాటుదారులను ఏరివేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది.

J

National | Published On Jan 11, 2026, 6.06 pm IST

Mumbai Civic Polls | ముంబై మున్సిపల్ పోరు: మహాయుతి మేనిఫెస్టో విడుదల.. మహిళలు, యువతకు పెద్దపీట

సంక్షిప్త సారాంశం

ముంబై మున్సిపల్ ఎన్నికల కోసం మహాయుతి కూటమి ఆదివారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలకు 50 శాతం బస్సు రాయితీ, రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, యువతకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు వంటి ఆకర్షణీయమైన హామీలను ప్రకటించింది. కృత్రిమ మేధ (AI) సాయంతో బంగ్లాదేశీ అక్రమ వలసదారులను గుర్తించి బహిష్కరిస్తామని దేవేంద్ర ఫడణవీస్ స్పష్టం చేశారు. ముంబైని గుంతలు లేని నగరంగా మారుస్తామని, పేదలకు సరసమైన ధరలకే గృహాలు నిర్మిస్తామని ఏక్‌నాథ్ షిండే హామీ ఇచ్చారు.

Advertisement

Mumbai Civic Polls | మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తుది దశకు చేరుకున్న వేళ, అధికార మహాయుతి (Mahayuti) కూటమి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్‌సీపీ) ముంబై మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మహిళా సాధికారత, యువతకు ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ముంబై భద్రతే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు.

మహిళలకు భారీ తాయిలాలు

మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మహాయుతి కూటమి కీలక హామీలను ప్రకటించింది. ముంబైలోని బస్సుల్లో మహిళలకు 50 శాతం టికెట్ రాయితీ కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా, 'లడ్కీ బహిన్(Ladki Bahin)' పథకం కింద మహిళలకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని వెల్లడించింది. 'ముంబై డిజిటల్ సఖి(Mumbai Digital Sakhi)' ప్రోగ్రామ్ ద్వారా మహిళలకు కృత్రిమ మేధ (AI), కోడింగ్ వంటి ఆధునిక కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొంది.

ఏఐ టెక్నాలజీతో అక్రమ చొరబాటుదారుల గుర్తింపు

ఈ మేనిఫెస్టోలో అత్యంత చర్చనీయాంశమైన అంశం కృత్రిమ మేధ (AI) వినియోగం. ముంబైలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి, వారిని బహిష్కరించేందుకు ప్రత్యేక ఏఐ టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. "గత మూడు నెలలుగా ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాం, ఇప్పటికే 60 శాతం ఖచ్చితత్వాన్ని సాధించాం. త్వరలోనే అక్రమ చొరబాటుదారులను గుర్తించి వెనక్కి పంపిస్తాం," అని ఆయన స్పష్టం చేశారు. అలాగే ముంబై మున్సిపల్ సర్వీసుల్లో పారదర్శకత కోసం ఏఐని అనుసంధానిస్తామని చెప్పారు.

ముడున్నరేళ్లలో ఏం చేశామో ఈ మేనిఫెస్టో చెబుతుంది

గత మూడున్నరేళ్లలో ముంబైలో ఎలాంటి అభివృద్ధి చేశామో ఈ మేనిఫెస్టో చెబుతుందని డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు. అభివృద్ధి పనులు ఇంకా వేగవంతం చేస్తాం. ముంబైని వదిలి వెళ్లిన మరాఠీలను తిరిగి ముంబైకి రప్పిస్తాం. స్లమ్ లేని నగరంగా ముంబైని తీర్చిదిద్దుతాం. అద్దె ఇండ్లలో ఉన్న పగ్డీ బిల్డింగ్స్‌ను అభివృద్ధి చేస్తాం. బీఎంసీలో అధికారం ఉండి కూడా ఇప్పటి వరకు కొందరు ఏం చేయలేకపోయారు.. అంటూ ఏక్‌నాథ్ షిండే చెప్పుకొచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement