త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Encounter | 11 ఏళ్ల బాలిక‌పై హ‌త్యాచారం.. ఎన్‌కౌంట‌ర్‌లో ప్ర‌ధాన నిందితుడు హ‌తం

Encounter | బెంగాల్‌లో 11 ఏళ్ల చిన్నారిపై హ‌త్యాచారం చేసిన కేసులో ప్ర‌ధాన నిందితుడు పోలీసు ఎన్‌కౌంట‌ర్ (Encounter)లో మ‌ర‌ణించాడు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ స‌మ‌యంలో పారిపోయేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. పోలీసులు కాల్పులు జ‌రిపారు.

D

National | Published On Jul 8, 2026, 12.02 pm IST

Encounter | 11 ఏళ్ల బాలిక‌పై హ‌త్యాచారం.. ఎన్‌కౌంట‌ర్‌లో ప్ర‌ధాన నిందితుడు హ‌తం
Advertisement

Encounter | త్రినేత్ర‌.న్యూస్ : ప‌శ్చిమ బెంగాల్‌ (West Bengal)లో 11 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హ‌త్య కేసు సంచ‌ల‌నం రేపిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుల్లో ఒక‌రు బుధ‌వారం ఉద‌యం జ‌రిగిన పోలీసు ఎన్‌కౌంట‌ర్‌లో (Encounter) మ‌ర‌ణించాడు. ద‌క్షిణ 24 ప‌ర‌గ‌ణాల జిల్లా బారుయ్‌పూర్ (Baruipur)లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం ప్ర‌ధాన నిందితుడు ప్ర‌వాష్ మోండ‌ల్‌ను పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి తీసుకెళ్లారు. ఆ స‌మ‌యంలో అత‌డు పోలీసు సిబ్బంది వ‌ద్ద ఉన్న తుపాకీని లాక్కొని పారిపోయేందుకు ప్ర‌య‌త్నించాడు. అంత‌టితో ఆగ‌ని నిందితుడు ఒక రౌండ్ కాల్పులు కూడా జ‌రిపాడు. దీంతో ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం ఎదురు కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో నిందితుడికి బుల్లెట్ గాయాలైన‌ట్లు చెప్పారు. అత‌డిని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

హింసాత్మక నిరసనలు.. 20 మంది అరెస్టు

ఇక ఈ దారుణ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ‌నివారం నాడు ఇంటి నుంచి బ‌య‌టకు వెళ్లిన బాలిక‌ను నిందితులు నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు. అనంత‌రం బ‌తికుండ‌గానే చిన్నారిని గోనె సంచిలో కుక్కి బారుయ్‌పూర్‌లోని ఒక చెరువులో ప‌డేశారు. ఊపిరాడ‌క ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

రాత్రైనా బాలిక ఇంటికి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందారు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌గా కేసు న‌మోదు చేసిన పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఆదివారం బాలిక మృత‌దేహం ల‌భించింది. దీనిపై స్థానికంగా తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ఘ‌ట‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స్థానికులు పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. రైల్వే ట్రాక్‌ల‌ను, పోలీసు వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. బాలిక మృతదేహం లభించిన కొద్ది గంటల్లోనే అనుమానంతో ఇంద్రజిత్ మోండల్ అనే వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించి కనీసం 20 మంది స్థానికుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సీఎం కీల‌క ఆదేశాలు..

ఇక ఈ ఘ‌ట‌న అనంత‌రం ముఖ్య‌మంత్రి సువేందు అధికారి (CM Suvendu Adhikari) బాధితురాలి కుటుంబంతోపాటూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇంద్ర‌జిత్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. హింసాత్మక నిర‌స‌న‌ల‌ను రెచ్చ‌గొట్టిన 200 మందిని గుర్తించిన‌ట్లు సీఎం తెలిపారు. వారిని విడిచిపెట్టేది లేద‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు, రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న ఆకృత్యాల‌ను అరిక‌ట్టేందుకు క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్ని జిల్లాల్లోని పోలీస్ స్టేష‌న్ల‌ను సీఎం ఆదేశించారు. ఇక జ‌రిగిన ఘ‌ట‌న‌, ద‌ర్యాప్తు పురోగ‌తికి సంబంధించిన వివ‌రాల‌తో కూడిన నివేదిక‌ను 72 గంట‌ల్లోగా స‌మ‌ర్పించాల‌ని డీజీపీని సీఎం ఆదేశించారు.

Also Read..

ర‌న్‌వేపైకి ఎదురెదురుగా వ‌చ్చిన విమానాలు.. ముంబైలో షాకింగ్ ఘ‌ట‌న‌

ఈ విషయం 30 ఏండ్ల‌ ముందే తెలిసుంటే ఐపీఎస్‌లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌

370 మిలియన్ ఏళ్ల నాటి విపత్తు రహస్యం వీడింది..!

Advertisement
Advertisement