త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ITR | ఐటీఆర్‌లో కొత్త సెక్షన్.. పన్ను చెల్లింపుదారులకు కీలక మార్పు..

ITR | ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించిన అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 కోసం ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులకు కొత్త మార్పు అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్ ఐటీఆర్ ఫైలింగ్ పోర్టల్‌తోపాటు జేసన్ యుటిలిటీలో కూడా కొత్త ఫీల్డ్‌ను చేర్చారు.

S

Business | Published On Jul 8, 2026, 12.19 pm IST

ITR | ఐటీఆర్‌లో కొత్త సెక్షన్.. పన్ను చెల్లింపుదారులకు కీలక మార్పు..
Advertisement

ITR | ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించిన అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 కోసం ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులకు కొత్త మార్పు అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్ ఐటీఆర్ ఫైలింగ్ పోర్టల్‌తోపాటు జేసన్ యుటిలిటీలో కూడా కొత్త ఫీల్డ్‌ను చేర్చారు. ఈ కొత్త ఫీల్డ్ ద్వారా పన్ను పరిధిలోకి రాని కొన్ని రశీదులను ప్రత్యేకంగా వెల్లడించే అవకాశం కల్పించారు. ఈ కొత్త ఫీల్డ్‌కు రీసిపెంట్స్ నాట్ ఇన్ ది నేచ‌ర్ ఆఫ్ ఇన్‌క‌మ్ అనే పేరు ఇచ్చారు. అయితే ఈ మార్పుతో పన్ను చెల్లింపుదారులపై ఎలాంటి అదనపు పన్ను భారం పడదని స్పష్టంగా పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆదాయంగా పరిగణించని మొత్తాలను ప్రత్యేక విభాగంలో చూపించేందుకు మాత్రమే ఈ ఫీల్డ్‌ను తీసుకొచ్చారు. దీంతో ఐటీఆర్ దాఖలు ప్రక్రియను మరింత సులభతరం చేసి, పన్ను చెల్లింపుదారుల్లో గందరగోళాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ఏయే స‌మాచారం వెల్ల‌డించాలి..

ఈ కొత్త విభాగంలో ప్రధానంగా కొన్ని రకాల బహుమతులు, రుణాల రూపంలో అందిన డబ్బు, అలాగే గ్రామీణ వ్యవసాయ భూమి విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను నమోదు చేయవచ్చు. గతంలో ఈ కొత్త ఫీల్డ్ అధికారికంగా ప్రకటించిన ఐటీఆర్ ఫామ్‌లలో లేదా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోని పీడీఎఫ్ ఫామ్‌లలో కనిపించలేదు. ప్రస్తుతం ఇది ఆన్‌లైన్ ఫైలింగ్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీల్డ్ అదనపు సమాచారాన్ని వెల్లడించేందుకు ఉద్దేశించింది. ఆర్థిక సంవత్సరంలో అందినప్పటికీ ఆదాయంగా పరిగణించని మొత్తాలను ఇందులో నమోదు చేయవచ్చు. లేకపోతే అలాంటి మొత్తాలను ఆదాయంగా అపార్థం చేసుకునే అవకాశం ఉండటంతో వాటిని స్పష్టంగా వేరు చేసి చూపించేందుకు ఈ మార్పు ఉపయోగపడుతుంది. పన్ను శాఖ అవసరమైనప్పుడు నిధుల మూలాన్ని వివరించేందుకు కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు రుణాల రూపంలో అందిన డబ్బు, వారసత్వంగా వచ్చిన ఆస్తులు లేదా నగదు, కొన్ని వ్యక్తిగత ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాల‌ను ఈ విభాగంలో చూపించవచ్చు.

త‌ప్ప‌నిస‌రి కాదు..

సింఘానియా అండ్ కో సంస్థలో భాగస్వామి రితికా నయ్యర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త ఫీల్డ్‌ను చేర్చినంత మాత్రాన చట్టపరంగా కొత్తగా ఏదైనా తప్పనిసరి వెల్లడింపు బాధ్యత ఏర్పడదు. నిర్దిష్ట బంధువుల నుంచి అందిన బహుమతులు, వివాహ సందర్భంలో అందిన బహుమతులు వంటి వాటిపై ఇప్పటికీ పన్ను వర్తించదు. అదేవిధంగా గ్రామీణ వ్యవసాయ భూమి విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలపై కూడా పన్ను ఉండదు. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అలాంటి భూమిని క్యాపిటల్ అసెట్ గా పరిగణించరు. అందువల్ల ఈ ప్రయోజనాలను కొత్త ఫీల్డ్ అందుబాటులోకి వచ్చిందనే కారణంతో తప్పనిసరిగా వెల్లడించాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement
Advertisement