త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల‌ ముందే తెలిసుంటే ఐపీఎస్‌లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌

G

Telangana | Published On Jul 8, 2026, 11.36 am IST

RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల‌ ముందే తెలిసుంటే ఐపీఎస్‌లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌
Advertisement

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: డీజీపీ ఓ నిర్ణ‌యం తీసుకునేవ‌ర‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాన్ని కొన‌సాగించాల్సిందేన‌న్న హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) స్పందించారు. త‌న‌లాగే దేశ భ‌ద్ర‌త కోసం ఎదురొడ్డి పోరాడిన పోలీసు అధికారుల బాధ‌ను అర్ధం చేసుకున్న రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానానికి ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న‌లా కోర్టును ఆశ్ర‌యించ‌లేక లోలోప‌ల కుండిపోతున్న పోలీసులు ఎంద‌రో ఉన్నార‌ని చెప్పారు. భ‌ద్ర‌త విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కులకు, పోలీసుల‌కు మ‌రో న్యాయ‌మా అని ప్ర‌శ్నించారు. మాకు ఎలాంటి ముప్పు వాటిల్లినా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డీజీపీ బాధ్యత వహించాల‌న్నారు. మీ లాంటి సంకుచిత మనస్తత్వం ఉన్నవారు ముఖ్యమంత్రులవడం ఈ రాష్ట్రం దురదృష్టం అంటూ ఎక్స్‌వేదిక‌గా విమ‌ర్శించారు.

ఆర్‌ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌తోపాటు మాజీ పోలీసు అధికారుల‌కు ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌ను తొల‌గించింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాన్ని (Bulletproof Vehicle) ఉప‌సంహ‌రించుకోవ‌డంపై హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై వాద‌న‌లు విన్న జ‌స్టిస్ టీ.మాధ‌విదేవి ధ‌ర్మాస‌నం.. ప్ర‌వీణ్‌ కుమార్ విన‌తిప‌త్రంపై డీజీపీ ఓ నిర్ణ‌యం తీసుకునే వ‌ర‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాన్ని ఆయ‌న వ‌ద్దే ఉంటాల‌ని హోంశాఖ‌ను ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌వీణ్ కుమార్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఏమ‌న్నారంటే..

`నా లాగా దేశ భద్రత కోసం ఎదురొడ్డి పోరాడిన పోలీసు అధికారుల బాధను అర్థం చేసుకున్న గౌరవ తెలంగాణ హైకోర్టు కు హృదయపూర్వక ధన్యవాదాలు. నా లాగా కోర్టును ఆశ్రయించలేక లోలోపల కృంగిపోతున్న పోలీసులు ఎందరో..!. విధి నిర్వహణలో అత్యున్నత సాహసాలు ప్రదర్శించిన అధికారులకు రక్షణ కవచం అన్నది ఒక హోదానో లేదా ఆభరణమో కాదు, కారాదు. రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా మాకు కల్పించిన ప్రాథమిక హక్కు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు తమ భుజాలపై వేసుకోవలసిన బాధ్యత.

వాన జోరుగా కురుస్తున్నప్పుడు గొడుగు కావాలనిపిస్తుంది. వాన వెలిసి ఎండ వచ్చిన వెంటనే అదే గొడుగు భారంగా అనిపిస్తుంది. ఇప్పుడు సీయం రేవంత్ గారికి, డీజీపీ గారికి మేము ఎండలో గొడుగు లాగా కనిపిస్తున్నాం! కేవలం నా మీద అక్కసుతో వందల మంది పోలీసు అధికారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశారు. మీరు మీ హంగులు, ఆర్భాటాలు, మహాసభలు,మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు కల్పిస్తున్న అధికారిక రక్షణకు అయ్యే ఖర్చుల ముందు మా భద్రత ఖర్చు ఏ పాటిది కాంగ్రెస్ నాయకులారా? మీకొక న్యాయం, పోలీసులకు మరొక న్యాయమా?

గండిపేట గ్రేహౌండ్స్ భూములను కబ్జా చేసినంత ఈజీ కాదు కీకారణ్యంలో కోంబింగ్ సీయం గారు. ఆ రోజుల్లో ఇంటి నుండి బయటికెళ్తే మళ్లీ క్షేమంగా ఎప్పుడు తిరిగొస్తామో తెలియని పరిస్థితి. ఎండాకాలంలో దట్టమైన అడవుల్లో నీళ్లు దొరక్క మూత్రం తాగిన రోజులున్నవి. బలిమెలలో 40 మంది కమాండోలు చనిపోయిన రోజున వారి కుటుంబాలను ఓదార్చడానికి ముఖ్యమంత్రులు రాలేక మమ్మల్ని పంపించారు! ఈ పరిస్థితులు మీ కర్థం కావు. మీ చుట్టూ ఉన్న అధికారులు కొందరు వాళ్ల స్వార్థం కోసం మీకసలు విషయం చెప్పరు. మీరేం వినాలనుకుంటే వాళ్లు అదే చెబుతారు.

మీ లాంటి రాజకీయ నాయకుల రక్షణ కోసం, ప్రభుత్వ ఆస్తులు కాపాడటం కోసం భార్య పిల్లల్ని వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేశాం. మొదటి 15 సంవత్సరాల్లో ఏ నాడు కుటుంబాలతో సినిమాలకు కానీ, షాపింగుకు కానీ, పిక్నిక్ లకు కానీ, చివరికి అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను పరామర్శించడానికి కూడా ఊర్లకు వెళ్లలేదు. రాష్ట్రంలో శాంతి కోసం, మారణహోమం ఆగాలి అనే లక్ష్యంతో చచ్చిపోతాం అని తెలిసినా సాయుధులైన నక్సలైట్లతో చర్చలు జరపడానికి దండకారణ్యంలో రాత్రింబవళ్లు తిరిగాం. ఈ విధంగా డ్యూటీ చేయడం వల్ల మాకు ఒక పైసా జీతం పెరగలేదు, ఒక గజం భూమి కూడా ఎవరూ ఇవ్వలేదు.

ఈ రోజు మీ ఆదేశాల మేరకు మీ తరపు న్యాయవాదులు మా అభ్యర్థనకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో వాదిస్తున్న తీరు చూస్తుంటే మీకు మా పట్ల ఎంత పగ, వివక్ష, ద్వేషం, చులకనభావం ఉందో సులభంగానే అర్థమవుతున్న‌ది. మాకు ఎలాంటి ముప్పు వాటిల్లినా ముమ్మాటికీ బాధ్యత వహించాల్సింది తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి-డీజీపీలే. మీ లాంటి సంకుచిత మనస్తత్వం ఉన్నవారు ముఖ్యమంత్రులవడం ఈ రాష్ట్రం దురదృష్టం. ఈ విషయం ముప్పై సంవత్సరాల ముందే తెలిసుంటే ఐపీఎస్‌లో చేరే వాన్ని కాదేమో!` అని ప్ర‌వీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement