త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranya Rao Gold Smuggling Case | దుబాయ్ మీదుగా ఆఫ్రికా టూ ఇండియా.. కన్నడ నటి రన్యా రావ్ రూ.100 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ గుట్టురట్టు!

కన్నడ నటి రన్యా రావ్ రూ. 100 కోట్ల బంగారు స్మగ్లింగ్ దందా వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా భారత్‌కు బంగారాన్ని ఎలా తరలించారో, కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి ఎలా తప్పించుకున్నారో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

J

National | Published On Mar 22, 2026, 4.09 pm IST

Ranya Rao Gold Smuggling Case | దుబాయ్ మీదుగా ఆఫ్రికా టూ ఇండియా.. కన్నడ నటి రన్యా రావ్ రూ.100 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ గుట్టురట్టు!
Advertisement

Ranya Rao Gold Smuggling Case | త్రినేత్ర.న్యూస్ : కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న నటి రన్యా రావ్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఆఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ఏకంగా వందల కోట్ల రూపాయల బంగారాన్ని భారత్‌కు అత్యంత చాకచక్యంగా స్మగ్లింగ్ చేసిన ఈ ముఠా బాగోతాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బట్టబయలు చేసింది. మొదట రూ.2 కోట్లు నష్టపోయిన ఈ గ్యాంగ్, ఆ తర్వాత ఏడాది కాలంలోనే రూ.100 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేసి జేబులు నింపుకుంది.

తాజాగా బుధవారం నాడు బెంగళూరులో ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో నటి రన్యా రావ్‌తో పాటు ఆమె అనుచరుడు తరుణ్ కొండూరు, బళ్లారికి చెందిన బంగారు వ్యాపారి సాహిల్ సకారియా జైన్ పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది. దుబాయ్ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రన్యా రావ్‌ను అధికారులు పక్కా సమాచారంతో అరెస్టు చేయడంతో ఈ భారీ ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఆమె వద్ద నుంచి రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మొదట ఉగాండాలో రూ.2 కోట్ల మోసం

ఈడీ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రన్యా, తరుణ్ కలిసి ఆఫ్రికా నుంచి నేరుగా బంగారాన్ని సేకరించేందుకు ఒక అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దుబాయ్ మార్కెట్‌లోని చాలా వరకు బంగారం ఆఫ్రికన్ గనుల నుంచే వస్తుందని తెలుసుకొని, దుబాయ్ కేంద్రంగా 'వీరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్‌ఎల్‌సీ' (Veera Diamonds Trading LLC) అనే కంపెనీని స్థాపించారు. అనంతరం ఉగాండా, కెన్యా, టాంజానియాలలో ఏజెంట్ల కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఈ క్రమంలో ఉగాండాకు చెందిన 'బెన్' అనే ఏజెంట్‌తో 5 కిలోల బంగారానికి మొదట డీల్ కుదుర్చుకున్నారు. ఇది సక్సెస్ అయితే 50 కిలోల కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పారు. దీనికోసం బెన్‌కు అడ్వాన్స్‌గా 25,000 డాలర్లు (సుమారు రూ.23.5 లక్షలు), అలాగే పన్నులు, ఫీజుల కోసం చెరో రూ.9.4 లక్షలు చెల్లించారు. కానీ, బంగారం రాలేదు. దీంతో 2024 జనవరిలో తరుణ్ స్వయంగా ఉగాండా రాజధాని కంపాలాకు వెళ్లాడు. అక్కడ ఒక రిఫైనరీలో బంగారాన్ని చూపించిన ఏజెంట్లు, దానిని రిలీజ్ చేయడానికి మరో రూ.1.7 కోట్లు అడిగారు. అప్పుడే తాము మోసపోయామని, సుమారు రూ.2 కోట్లకు పైగా బురిడీ కొట్టారని వారికి అర్థమైంది.

దుబాయ్ 'డేరా గోల్డ్ సౌక్' నుంచి అసలు దందా

ఆఫ్రికాలో ఎదురుదెబ్బ తగలడంతో రన్యా, తరుణ్ తమ ప్లాన్ మార్చారు. దుబాయ్ లోని ప్రసిద్ధ 'డేరా గోల్డ్ సౌక్'లో ఆఫ్రికన్ డీలర్ల నుంచి నగదు చెల్లించి బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించారు. రన్యా పెద్ద ఎత్తున నగదును మార్కెట్‌కు తీసుకెళ్లి బంగారాన్ని కొనుగోలు చేసేది. మరోవైపు, ఈ బంగారం దుబాయ్ నుంచి స్విట్జర్లాండ్ లేదా థాయ్‌లాండ్ వంటి మూడో దేశానికి ఎగుమతి అవుతున్నట్లు తరుణ్ కొండూరు నకిలీ కస్టమ్స్ డిక్లరేషన్లు సృష్టించేవాడు.

కానీ వాస్తవానికి, రన్యా ఆ బంగారాన్ని దుబాయ్ విమానాశ్రయంలో తీసుకుని, తన దుస్తుల్లో దాచుకుని రహస్యంగా భారత్‌లోకి స్మగ్లింగ్ చేసేది. మార్చి 2024 నుంచి మార్చి 2025 మధ్య కాలంలో రన్యా దుబాయ్ నుంచి భారత్‌కు సుమారు 15 సార్లు ప్రయాణించింది. ఈ కాలంలో ఏకంగా రూ.102 కోట్ల విలువైన 127.87 కిలోల బంగారాన్ని భారత్‌లోకి తీసుకొచ్చింది. ఇలా తీసుకొచ్చిన బంగారాన్ని ఇండియాలోని పలువురు నగల వ్యాపారులకు విక్రయించారు.

వీఐపీ ప్రోటోకాల్.. కస్టమ్స్ ఎస్కేప్

ఇన్నిసార్లు ఇన్ని కిలోల బంగారాన్ని తీసుకొచ్చినా విమానాశ్రయంలో రన్యా రావ్ దొరకకపోవడానికి ప్రధాన కారణం ఆమె బ్యాక్‌గ్రౌండ్. ఆమె ఒక సీనియర్ పోలీసు అధికారికి సవతి కూతురు. ఈ హోదాను ఉపయోగించుకుని, వీఐపీ ప్రోటోకాల్ ద్వారా బెంగళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి, తనిఖీల నుంచి చాలా సులభంగా తప్పించుకునేది.

ఈ భారీ స్కామ్‌పై లోతైన విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇప్పటికే రన్యా రావ్‌కు చెందిన రూ.34 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో ఇంకెవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు సంస్థ మరింత లోతుగా ఆరా తీస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement