త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jhiram Ghati Case | ఝీరం ఘాటి ఊచ‌కోత కేసు.. ప‌ది మందిని దోషులుగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు..!

Jhiram Ghati Case | ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన ఝీరామ్ ఘాటి నక్సల్‌ దాడి కేసులో దాదాపు 13 ఏళ్ల తర్వాత కీలక తీర్పు వెలువ‌డింది. జగదల్‌పూర్‌ ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు శనివారం కేసులోని ప‌ది మంది నిందితులను దోషులుగా తేల్చింది. ఇందులో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్నారు. దోషులకు విధించ‌నున్న‌పై శిక్షపై ఈ నెల 16న కోర్టు తీర్పు వెలువ‌రించ‌నుంది.

P

National | Published On Sep 5, 2026, 3.47 pm IST

Jhiram Ghati Case | ఝీరం ఘాటి ఊచ‌కోత కేసు.. ప‌ది మందిని దోషులుగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు..!
Advertisement

Jhiram Ghati Case | ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన ఝీరం ఘాటి నక్సల్‌ దాడి కేసులో దాదాపు 13 ఏళ్ల తర్వాత కీలక తీర్పు వెలువ‌డింది. జగదల్‌పూర్‌ ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు శనివారం కేసులోని ప‌ది మంది నిందితులను దోషులుగా తేల్చింది. ఇందులో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్నారు. దోషులకు విధించ‌నున్న‌పై శిక్షపై ఈ నెల 16న కోర్టు తీర్పు వెలువ‌రించ‌నుంది. ఈ కేసులో ఆగస్టు 12న ఈ కేసులో ఇరుపక్షాల తుది వాదనలు పూర్తయ్యాయి. అనంతరం తీర్పును రిజర్వ్‌ చేసిన కోర్టు.. తొలుత ఆగస్టు 31న తీర్పు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే తేదీ మారడంతో శనివారం తీర్పును వెలువ‌రించింది.

11 మందిలో 10 మందికి శిక్ష ఖరారు

ఈ కేసులో అరెస్టయిన 11 మంది నిందితులపై సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. విచారణ సమయంలో ఒక నిందితుడు మృతి చెందాడు. మిగిలిన 10 మందిని కోర్టు ఇప్పుడు దోషులుగా తేల్చింది. ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జిషీట్‌లో మరో 33 మందిని పరారీలో ఉన్న నిందితులుగా పేర్కొంది. వీరిలో కొందరు తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, తీర్పును పైకోర్టులో సవాల్‌ చేస్తామని నిందితుల తరఫు న్యాయవాది అరవింద్‌ చౌదరి తెలిపారు. తీర్పు కాపీ ఇంకా అంద‌లేద‌ని, దాని ఆధారంగా అప్పీలు చేస్తామ‌న్నారు.

2013 మే 25న ఏం జరిగింది?

2013 మే 25న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా దర్భా ప్రాంతంలో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘పరివర్తన్‌ ర్యాలీ’పై మావోయిస్టులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఝీరం ఘాటిలో జాతీయ రహదారిపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో కాంగ్రెస్‌ నేతలుతో పాటు జ‌నం, భద్రతా సిబ్బంది సహా కనీసం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. అప్ప‌టి దాడిలో ఛత్తీస్‌గఢ్‌ పీసీసీ అధ్యక్షుడు నంద్‌కుమార్‌ పటేల్‌, ఆయన కుమారుడు దినేశ్‌ పటేల్‌, అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత మహేంద్ర కర్మ, మాజీ కేంద్ర మంత్రి విద్యాచరణ్‌ శుక్లా, సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఉదయ్‌ ముదలియార్‌ తదితరులు మృతి చెందారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా మహేంద్ర కర్మ ‘సల్వా జుడుం’ ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే ఏడాది జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఈ పరివర్తన్‌ ర్యాలీని నిర్వహించింది.

రెండు రోజుల్లోనే ఎన్‌ఐఏకు దర్యాప్తు

ఈ ఘ‌ట‌న త‌ర్వాత రాష్ట్ర పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు. అప్పటి రమణ్‌సింగ్‌ ప్రభుత్వం రెండు రోజుల్లోనే దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించింది. ఘటనపై విచారణకు అప్పటి హైకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ 40 మంది ప్రధాన నిందితులు సహా 150 మందికిపైగా వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. వారిలో 11 మందిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా ఒకరు మృతి చెందగా.. మిగిలిన 10 మందిపై కేసు కొనసాగింది. ప్రాసిక్యూషన్‌ 101 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. దాదాపు 13 ఏళ్ల విచారణ అనంతరం మిగిలిన 10 మంది నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారికి ఎలాంటి శిక్ష విధించాలన్నది సెప్టెంబర్‌ 16న తేలనుంది.

Advertisement
Advertisement