త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Monsoon Deficit | ముఖం చాటేసిన వరుణుడు

Monsoon Deficit | ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు యావత్ రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 9 నాటికి దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో పరిస్థితి గాడిన పడుతోందనే ఆశలు చిరుగించాయి. అయితే, ఆ తర్వాత ఒక్కసారిగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. జూన్‌లో 30 శాతానికి పైగా నమోదైన వర్షలోటు క్రమంగా తగ్గుతుందనుకున్న సమయంలో మళ్లీ వర్షాలు ముఖం చాటేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

P

National | Published On Jul 17, 2026, 10.05 am IST

Monsoon Deficit | ముఖం చాటేసిన వరుణుడు
Advertisement
  • కనిపించని నైరుతి ప్రభావం
  • దేశవ్యాప్తంగా 24శాతం లోటు
  • 2002 నాటి కరువు తప్పదా?
  • ప్రాజెక్టుల్లోనూ తగ్గుతున్న నీటి నిల్వలు
  • ఆందోళనలో దేశ రైతాంగం

Monsoon Deficit | ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు యావత్ రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 9 నాటికి దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో పరిస్థితి గాడిన పడుతోందనే ఆశలు చిరుగించాయి. అయితే, ఆ తర్వాత ఒక్కసారిగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. జూన్‌లో 30 శాతానికి పైగా నమోదైన వర్షలోటు క్రమంగా తగ్గుతుందనుకున్న సమయంలో మళ్లీ వర్షాలు ముఖం చాటేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా గణాంకాల ప్రకారం జూన్ 1 నుంచి జూలై 16 వరకు దేశంలో 295.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, కేవలం 224.8 మిల్లీమీటర్లే రికార్డయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా 24 శాతం వర్షలోటు నమోదైంది. ఈ గణాంకాలు 1971-2020 మధ్య నమోదైన సగటు వర్షపాతం (లాంగ్ పీరియడ్ యావరేజ్-ఎల్‌పీఏ) ఆధారంగా లెక్కిస్తారు. దేశంలో రుతుపవనాల పనితీరును అంచనా వేయడంలో ఇదే ప్రామాణిక కొలమానం.

2002 కరువును తలపిస్తున్న పరిస్థితి

వాతావరణ నిపుణుల ఆందోళనకు కారణం ఈ ఏడాది నమోదవుతున్న వర్షలోటే. 2002లో దేశం తీవ్ర కరువును ఎదుర్కొంది. ఆ ఏడాది మొత్తం రుతుపవనాల సీజన్ ముగిసే నాటికి 19 శాతం వర్షలోటు నమోదైంది. అయితే ఈసారి జూలై మధ్య నాటికే వర్షలోటు 24 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ వరకు ఇంకా రుతుపవనాల సీజన్ కొనసాగనున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి మాత్రం గత రెండు దశాబ్దాల్లో అత్యంత బలహీనమైన రుతుపవనాల ప్రారంభాల్లో ఒకటిగా నిలిచింది. అయితే, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఒకేలా లేదు. తూర్పు, ఈశాన్య భారతదేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ 36 శాతం వర్షలోటు నమోదైంది. దక్షిణ ద్వీపకల్పంలో 26 శాతం, వాయువ్య భారతంలో 19 శాతం, మధ్య భారతంలో 13 శాతం లోటు ఉంది. ముఖ్యంగా జూలై 9 నుంచి 15 వరకు వారంలో సాధారణంతో పోలిస్తే 51 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే 1901 తర్వాత నమోదైన అత్యంత పొడి జూన్ నెలల్లో ఈ ఏడాది జూన్ ఐదో స్థానంలో నిలిచింది.

ఎల్‌నినో ప్రభావమే ప్రధాన కారణం

ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఎల్‌నినో ప్రభావమేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ఎల్‌నినోగా పిలుస్తారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా భారత్‌కు తేమను మోసుకొచ్చే గాలులు బలహీనపడి రుతుపవనాలపై ప్రభావం పడుతుంది. 2002లో తీవ్ర కరువుకు కూడా ఇదే ప్రధాన కారణం కాగా, ఈ ఏడాది కూడా ఎల్‌నినో ప్రభావం మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా భారత మహాసముద్ర డైపోల్ (ఐఓడీ) అనుకూల దశలో ఉంటే ఎల్‌నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించి రుతుపవనాలకు బలం చేకూరుస్తుంది. కానీ ప్రస్తుతం ఐఓడీ తటస్థ స్థితిలో ఉండటంతో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ప్రతి 30 నుంచి 60 రోజులకు భూమధ్యరేఖ చుట్టూ సంచరించే మాడెన్–జూలియన్ ఆసిలేషన్ (ఎంజేఓ) కూడా ప్రస్తుతం భారత్‌కు అనుకూల దశలో లేకపోవడంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు.

వచ్చే వారం ఎక్కడ వర్షాలు?

ఐఎండీ అంచనాల ప్రకారం.. వచ్చే ఏడు రోజుల్లో తూర్పు, ఈశాన్య భారతదేశంతో పాటు తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అయితే, పశ్చిమ-మధ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్పంలోని చాలా ప్రాంతాల్లో వచ్చే వారం కూడా వర్షాలు పెద్దగా కురిసే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం జూలై నెలలో సాధారణ వర్షపాతంలో 94 శాతం కంటే తక్కువే నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కరువు ముప్పు ఉందా?

ప్రస్తుత పరిస్థితిని బట్టి దేశం కరవు బారిన పడిందని ఇప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. సాధారణంగా ఒక ప్రాంతంలో సీజన్ మొత్తం వర్షపాతం సాధారణ స్థాయిలో 75 శాతం కంటే తక్కువగా నమోదైతేనే దాన్ని అధికారికంగా కరువు ప్రాంతంగా ప్రకటిస్తారు. అయితే, జూలై మధ్య నాటికే 24 శాతం వర్షలోటు నమోదవడం ఖరీఫ్ పంటలకు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా వరి, పత్తి, పప్పుధాన్యాల సాగుపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విత్తనాలు వేసిన రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే వచ్చే వేసవి వరకు అవసరమయ్యే జలాశయాల్లో నీటి నిల్వలు కూడా ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మిగిలిన రుతుపవనాల కాలంలోనూ వర్షాలు సాధారణం కంటే తక్కువగా నమోదైతే 2026 రుతుపవనాల సీజన్ 2002 కరువుతో పోల్చదగ్గ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. రుతుపవనాలు పూర్తిగా ప్రభావం చూపడం లేదని చెప్పలేం. కానీ అత్యవసరంగా వర్షాలు అవసరమైన ప్రాంతాల్లోనే కురవకపోవడమే ప్రస్తుతం రైతులను, వ్యవసాయ రంగాన్ని ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement
Advertisement