Hindu Temple Demolition | పాక్లో మదర్సా కోసం వందేండ్లనాటి గుడి కూల్చివేత.. ఖండించిన భారత్
Hindu Temple Demolition | పాకిస్థాన్లోని (Pakistan) పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న శతాబ్దాల నాటి చారిత్రక హిందూ దేవాలయం కూల్చివేయడాన్ని (Hindu Temple Demolition) భారత్ తీవ్రంగా ఖండించింది. ఆలయ విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించింది.
Hindu Temple Demolition | త్రినేత్ర.న్యూస్: పాకిస్థాన్లోని (Pakistan) పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న శతాబ్దాల నాటి చారిత్రక హిందూ దేవాలయం కూల్చివేయడాన్ని (Hindu Temple Demolition) భారత్ తీవ్రంగా ఖండించింది. ఆలయ విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించింది. చారిత్రక కట్టడాన్ని రక్షించడంలో పాక్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. ఆలయ ధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. పాకిస్థాన్లోని నరోవల్ జిల్లా సిరాజ్ గ్రామంలో శతాబ్దాల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసినట్లు వచ్చిన నివేదికలను గమనించామన్నారు. మైనారిటీల ఆరాధనా స్థలమైన ఈ శతాబ్దపు పురాతన ఆలయంపై జరిగిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అక్కడి అధికారుల ఉదాసీనత, వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు.
ఆలయ కూల్చివేతపై తక్షణమే, పారదర్శకంగా విచారణ జరిపించాలని, ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూల్చేసినవారే పూర్తి బాధ్యత వహించేలా చూడాలని పాక్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. మైనారిటీ వర్గాల రక్షణ, భద్రత, శ్రేయస్సుతో పాటు వారి మతపరమైన, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం పాక్ ప్రభుత్వ ప్రాథమిక విధి అని, దానిని వెంటనే నెరవేర్చాలని స్పష్టం చేశారు.

మదర్సా విస్తరణ కోసం..
తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో (Punjab province) సుమారు 125 ఏండ్ల నాటి పురాతన హిందూ ఆలయాన్ని ఆగస్టు 21న కూల్చివేశారు. నారోవాల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో దాదాపు 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చారిత్రకల దేవాలయాన్ని.. పక్కనే ఉన్న మదర్సాను విస్తరించేందుకు ధ్వంసం చేశారని (Temple Demolition)స్థానిక హిందువులు, మైనార్టీలు ఆరోపిస్తున్నారు. ఆలయ స్థలాన్ని ఆక్రమించుకునే కుట్రలో భాగంగానే నిషేధిత మత తీవ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్థాన్’ (TLP)కి చెందిన వ్యక్తులు ఈ ఆకృత్యానికి పాల్పడ్డారని వెల్లడించారు. కూల్చివేత అనంతరం ఆలయ శిఖరానికి ఉన్న లోహబు భాగాలు, ఇటుకలు, ఇతర నిర్మాణ సామాగ్రిని కూడా మాయం చేశారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, ఆలయాన్ని యథాస్థానంలో పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే..
ఆలయ కూల్చివేతపై పాకిస్థాన్ మసీహా మిల్లత్ పార్టీ (PMMP) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా దాని గోపురంపై ఉన్న లోహపు అమరికలు, ఇటుకలు, ఇతర పురాతన సామాగ్రిని కూడా అక్కడి నుంచి మాయం చేశారని పీఎంఎంపీ చైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత్రా ఆరోపించారు. గతంలో ఈ స్థలాన్ని ఇవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ETPB) మదర్సాకు లీజుకు ఇచ్చినప్పటికీ.. అద్దె చెల్లించకపోవడంతో లీజు రద్దయిందన్నారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని జనవరిలోనే ఉత్తర్వులు వచ్చినా అధికారులు అమలు చేయకపోవడంతోనే ఈ అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాల వల్లే కూలిపోయింది..
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్లే ఆలయం కూలిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది. అది చాలా పురాతన ఆలయమని తెలిపింది. ఆలయ స్థలాన్ని ఎవరికీ లీజుకు ఇవ్వలేదని, స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులు దాని పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటారని ఈటీపీబీ సీనియర్ అధికారి రాణా ఇఫ్తిఖార్ చెప్పారు.
తాజావార్తలు
- ●పిలుపులేమో స్వదేశీ... దిగుమతులేమో విదేశీ: ఎన్నాళ్ళీ రూపాయి కుంగుబాటు?
- ●Horoscope | సెప్టెంబర్ 3 రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనవసరమైన ఆందోళనలు!
- ●Chinna Reddy | చిన్నారెడ్డి రాజీనామా.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలిగా గద్వాల విజయలక్ష్మి..?
- ●Indiramma Atmiya Bharosa | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారులు 83 వేలు.. ఆర్థిక సాయం రూ. 5033.22 లక్షలు
- ●Baby Girl | 200 ఏళ్ల తర్వాత.. ఆ ఇంట ఆడబిడ్డ జననం
- ●Mokila | మోకిలా, బాచుపల్లిలో.. ఒక్కో ప్లాట్ ధర ఎంతో తెలుసా?

పిలుపులేమో స్వదేశీ... దిగుమతులేమో విదేశీ: ఎన్నాళ్ళీ రూపాయి కుంగుబాటు?

Horoscope | సెప్టెంబర్ 3 రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనవసరమైన ఆందోళనలు!

Chinna Reddy | చిన్నారెడ్డి రాజీనామా.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలిగా గద్వాల విజయలక్ష్మి..?

Indiramma Atmiya Bharosa | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్దిదారులు 83 వేలు.. ఆర్థిక సాయం రూ. 5033.22 లక్షలు






