త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chinna Reddy | చిన్నారెడ్డి రాజీనామా.. ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షురాలిగా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి..?

Chinna Reddy | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ముఖ్య‌మంత్రిపై కానీ, మంత్రులు, ఎమ్మెల్యేల‌పై కానీ బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేస్తే వేటు త‌ప్ప‌ద‌నే సంకేతాల‌ను స్ప‌ష్టంగా ఇచ్చింది పార్టీ హైక‌మాండ్. అసంతృప్తి ఉంటే పార్టీ అధినాయ‌క‌త్వానికి చెప్పుకోవాలి కానీ.. బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది

S

Telangana | Published On Sep 2, 2026, 11.17 pm IST

Chinna Reddy | చిన్నారెడ్డి రాజీనామా.. ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షురాలిగా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి..?
Advertisement
  • సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వేళ కీల‌క ప‌రిణామం

Chinna Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ముఖ్య‌మంత్రిపై కానీ, మంత్రులు, ఎమ్మెల్యేల‌పై కానీ బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేస్తే వేటు త‌ప్ప‌ద‌నే సంకేతాల‌ను స్ప‌ష్టంగా ఇచ్చింది పార్టీ హైక‌మాండ్. అసంతృప్తి ఉంటే పార్టీ అధినాయ‌క‌త్వానికి చెప్పుకోవాలి కానీ.. బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. ఇటీవ‌ల రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గానే అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు జిల్లెల చిన్నారెడ్డిని త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేర‌కు చిన్నారెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షురాలిగా విజ‌య‌లక్ష్మి..?

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడిగా కొన‌సాగిన చిన్నారెడ్డి స్థానంలో జీహెచ్ఎంసీ మాజీ మేయ‌ర్, కే కేశ‌వ‌రావు కుమార్తె గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మికి ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆమె కూడా త‌న‌కు ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి చిన్నారెడ్డికి ఉద్వాస‌న ప‌లికి విజయ‌ల‌క్ష్మికి ఆ బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టే ప‌నిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌క‌త్వం ఉన్న‌ట్లు స‌మాచారం.

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి ప‌రోక్ష వార్నింగ్

ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న జిల్లెల చిన్నారెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ‌పై వేటు వేసిన అధిష్టానం.. మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి ప‌రోక్ష వార్నింగ్ ఇచ్చిన‌ట్లు ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పార్టీ లైన్ ఎవ‌రూ దాటిన ఇలాంటి చ‌ర్య‌లే ఉంటాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి మిగ‌తా వారిని ప‌రోక్షంగా హెచ్చ‌రించార‌ని పేర్కొంటున్నారు.

చిన్నారెడ్డి వివ‌ర‌ణ సంతృప్తిగా లేదు..

పీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీకి రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు ఇచ్చిన వివ‌ర‌ణ క‌రెక్టుగా లేద‌ని వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టు 23న మేఘారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విధంగా వ్యాఖ్యానించారు. చిన్నారెడ్డి వివరణలో అన్నీ అబద్ధాలే ఉన్నాయన్నారు. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.
చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు నేను సంతృప్తి చెందలేదు. ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాల్సిందే. క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి ఆడియో, వీడియోలు ఇచ్చాను. కమిటీ మళ్లీ పిలిస్తే వ‌చ్చి నా వాదన వినిపిస్తా అని మేఘారెడ్డి పేర్కొన్నారు.

కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న‌నే మాట్లాడ‌న‌న్న చిన్నారెడ్డి

తాను పార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడ‌లేద‌ని, పార్టీ లైన్ ఎనాడూ దాట‌లేద‌ని, 40 ఏళ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్న‌ కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న‌నే మాట్లాడాన‌ని పీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీకి చిన్నారెడ్డి వివ‌ర‌ణ ఇచ్చిన తెలిసిందే.

మ‌రో జీవ‌న్ రెడ్డిని అయ్యేవాడిని..

బయట నుంచి వచ్చిన మేఘారెడ్డి డబ్బులతో వనపర్తి ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకొని గెలిచాక.. నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారని జిల్లెల చిన్నారెడ్డి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అయినప్పటికీ భరిస్తున్నానని, లేదంటే మరో జీవన్‌రెడ్డిని అయ్యేవాడినని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభించిన సంద‌ర్భంగా చిన్నారెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు. తాము తలపెట్టిన పనులకు అడ్డుతగులుతూ.. కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సహనంతో భరిస్తున్నానని చెప్పారు. తప్పుడు గాళ్లను పార్టీ నుంచి తరిమి వేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్‌ చిన్నారెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నాడు రేవంత్‌రెడ్డిని ఆదేశించినా.. డబ్బులకు ఆశపడి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement
Advertisement