త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GPI | ప్ర‌పంచ శాంతి సూచీలో మ‌రింత దిగ‌జారిన భార‌త్ స్థానం..

GPI | ప్ర‌పంచ శాంతి సూచీలో (GPI) భార‌త్ స్థానం మ‌రింత దిగ‌జారింది. గతేడాది 115వ స్థానంలో నిలిచిన మన దేశం.. ఈ ఏడాది 12 స్థానాలు కోల్పోయి 127వ స్థానంలో నిలిచింది. అంతర్గత కలహాల వల్ల పెరిగిన మరణాలు, పొరుగు దేశాలతో క్షీణించిన సంబంధాలే కార‌ణం.

G

National | Published On Jun 13, 2026, 7.37 am IST

GPI | ప్ర‌పంచ శాంతి సూచీలో మ‌రింత దిగ‌జారిన భార‌త్ స్థానం..
Advertisement

GPI | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌పంచ శాంతి సూచీలో (GPI) భార‌త్ స్థానం మ‌రింత దిగ‌జారింది. గతేడాది 115వ స్థానంలో నిలిచిన మన దేశం.. ఈ ఏడాది 12 స్థానాలు కోల్పోయి 127వ స్థానంలో నిలిచింది. అంతర్గత కలహాల వల్ల పెరిగిన మరణాలు, పొరుగు దేశాలతో క్షీణించిన సంబంధాలే కార‌ణం. దీనికితోడు పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మయన్మార్‌ సరిహద్దులో అస్థిరత పెరగ‌డం, మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘ‌ర్ష‌ణ‌ల‌తో కొన‌సాగుతున్న హింస భారత్‌ ర్యాంక్‌పై ప్రభావం చూపింది. ఈ ఏడాది 163 దేశాలకు ర్యాంకులను ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్ (IEP) విడుదల చేసింది. ఇందులో భారత్ కంటే నేపాల్‌, బంగ్లాదేశ్ మెరుగైన స్థానాల్లో నిలిచాయి. ఇక 152వ స్థానంతో పాకిస్థాన్ అత్యంత ప్ర‌మాద‌క‌ర దేశాల్లో ఒక‌టిగా నిలిచింది.

అత్యంత ప్ర‌మాద‌క‌ర దేశం..

జీపీఐ ప్రకారం 2026లో ప్రపంచంలోనే అత్యంత శాంతియుత దేశంగా ఐస్‌లాండ్ వరుసగా 18వ ఏడాది కూడా తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఇక దక్షిణాసియా (South Asia) ప్రాంతంలోనే అత్యంత శాంతియుత దేశంగా భూటాన్ నిలిచింది. జీపీఐలో భూటాన్ 16వ స్థానంలో ఉంది.

మ‌రోవైపు ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర దేశాల్లో ర‌ష్యా మొద‌టి స్థానంలో నిలిచింది. తీవ్రమైన యుద్ధాలు, అంతర్గత తిరుగుబాట్లు, రాజకీయ అస్థిరతే దీనికి కార‌ణం.

జీపీఐలో చివరి స్థానాల్లో ఉన్న దేశాలు

ర‌ష్యా- 163వ స్థానం (చివరిది)- స్కోరు 3.441
ఉక్రెయిన్‌- 162వ ప్లేస్ (3.434 స్కోరు)
సూడాన్- 161వ స్థానం (3.323 స్కోరు)
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో- 160వ స్థానం (3.292 స్కోరు)
యెమెన్- 159వ‌ స్థానం (3.262 స్కోరు)
అఫ్గానిస్థాన్-158వ స్థానం (3.229 స్కోరు)

జీపీఐ అంటే..?

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలోని శాంతి భద్రతల స్థాయిలను అంచనా వేసే ఒక అంతర్జాతీయ నివేదిక గ్లోబల్ పీస్ ఇండెక్స్ (Global Peace Index). దీనిని ఆస్ట్రేలియాకు చెందిన అంతర్జాతీయ థింక్ ట్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) ప్రతి ఏటా విడుదల చేస్తుంది. మొత్తం 163 స్వతంత్ర దేశాలు, భూభాగాలలో ప్రపంచ జనాభాలో 99.7 శాతం మందిని పరిగణనలోకి తీసుకుని ఈ సూచీని రూపొందిస్తారు. దీని కోసం 23 గుణాత్మక, పరిమాణాత్మక సూచికలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. వాటిలో ప్రధానంగా సామాజిక భద్రత, అంతర్గత, బాహ్య సంఘర్షణలు, సైనికీకరణ స్థాయి ఆధారంగా దీనిని లెక్కిస్తారు. తక్కువ స్కోరు ఉంటే ఎక్కువ శాంతియుతంగా, ఎక్కువ స్కోరు ఉంటే తక్కువ శాంతియుతంగా (అశాంతిగా) పరిగణిస్తారు.

భార‌త్ స్కోరు ఎందుకు త‌గ్గింది?

దీనినిబ‌ట్టి భారతదేశం 2.409 స్కోరు నమోదు చేసింది. గతేడాది పోలిస్తే దేశంలో శాంతి భద్రతల స్థాయి 2.9 శాతం మేర క్షీణించింది. మణిపూర్‌లో జరిగిన కొన‌సాగ‌తున్న‌ జాతి హింస, అంతర్గత ఘర్షణలతో మ‌రణాలు పెర‌గ‌డ‌తోపాటు పాకిస్థాన్, మయన్మార్ సరిహద్దుల్లో నెలకొన్న భద్రతా సవాళ్లు, ఉద్రిక్తతల వల్ల భారత్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడింది.

తాజాగా విడుద‌ల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాయిలు గత ఏడాదితో పోలిస్తే 0.7 శాతం క్షీణించాయి. ప్ర‌స్తుతం 103 దేశాలు బాహ్య సంఘర్షణల్లో పాల్గొంటున్నాయి. 2008లో ఈ దేశాల సంఖ్య 59గా ఉంది. ఇక పెరుగుతున్న‌ హింస, అంతర్గత కలహాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 21.81 ట్రిలియన్ డాలర్ల భారం పడింది. ఇది ప్రపంచ జీడీపీ (GDP)లో దాదాపు 10.5 శాతానికి సమానం.

Advertisement
Advertisement