త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tigers | అంతరించిపోతున్న పులి జాతి.. పెరుగుతున్న మరణాల సంఖ్య.. కారణం ఏంటి?

2024 సంవత్సరంలో 126 పులులు మృత్యువాత పడితే.. 2025 సంవత్సరం ఆ సంఖ్య పెరిగింది. 2024 కంటే 40 పులులు అదనంగా 2025 లో మరణించాయి. గత సంవత్సరం జనవరి 2న మహారాష్ట్రలోని బ్రహ్మపురి ఫారెస్ట్ డివిజన్‌లో తొలి మరణం నమోదు అయింది.

J

National | Published On Jan 1, 2026, 5.32 pm IST

Tigers | అంతరించిపోతున్న పులి జాతి.. పెరుగుతున్న మరణాల సంఖ్య.. కారణం ఏంటి?
Advertisement

Tigers | పులిని చూస్తేనే భయపడతాం కానీ.. అడవుల్లో పులి ఉండటం అనేది జీవ వైవిధ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫుడ్ చైన్‌‌లో కీలకంగా వ్యవహరించే ఈ జంతువు జీవావరణ వ్యవస్థ సరైన దారిలో నడిచేలా తోడ్పాటునందిస్తుంది. ఒకప్పుడు అడవులు ఎక్కువగా ఉండేవి.. పులి జాతి కూడా విపరీతంగా పెరిగేది. కానీ.. రాను రాను మన దేశంలో అడవులు తగ్గి కాంక్రీట్ జంగల్‌గా మారుతోంది. దీంతో పులి జాతి కూడా అంతరించిపోతోంది. గత కొన్నేళ్లుగా మృత్యువాత పడుతున్న పులుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పులులను అడవుల్లో చూడగలమా? లేక వాటి గురించి పుస్తకాల్లోనే చదువుకునే పరిస్థితి వస్తుందా?

ప్రపంచంలోనే ఎక్కువ పులులు ఉన్న దేశంగా భారత్‌కి రికార్డు ఉంది. కానీ.. ఆ రికార్డు త్వరలోనే మాయమైపోయే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 2025 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 166 పులులు చనిపోయాయని నేషనల్ టైగర్ కంజర్వేషన్ అథారిటీ(NTCA) లెక్కలు చెబుతున్నాయి.

మన దేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అందుకే దాన్ని టైగర్ స్టేట్ అని కూడా పిలుస్తారు. ఆ రాష్ట్రం చాలా ఏళ్ల కిందనే పులల సంరక్షణ కోసం చర్యలను ప్రారంభించింది. అయినా కూడా ఆ రాష్ట్రంలోనే అత్యధికంగా పులులు మృత్యువాత పడుతున్నాయి. గత సంవత్సరం అంటే 2025 లో 55 పులులు కేవలం మధ్యప్రదేశ్‌లోనే మృతి చెందాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 38, కేరళలో 13, అస్సాంలో 12 పులులు చనిపోయాయి. దేశవ్యాప్తంగా మృతి చెందిన 166 పులులలో 31 పులి పిల్లలే అని ఎన్‌టీసీఏ డేటా చెబుతోంది.

2024 లో 126.. 2025 లో 166

2024 సంవత్సరంలో 126 పులులు మృత్యువాత పడితే.. 2025 సంవత్సరం ఆ సంఖ్య పెరిగింది. 2024 కంటే 40 పులులు అదనంగా 2025 లో మరణించాయి. గత సంవత్సరం జనవరి 2న మహారాష్ట్రలోని బ్రహ్మపురి ఫారెస్ట్ డివిజన్‌లో తొలి మరణం నమోదు కాగా, ఆ తర్వాత మూడు రోజులకే మరో పులి మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లో మృతి చెందింది. 2025, డిసెంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని నార్త్ సాగర్‌లో చివరగా మరో పులి మృతి చెందింది.

అడవుల నరికివేతే ప్రధాన కారణమా?

ఒకప్పుడు దేశంలో చాలా అడవులు ఉండేవి. ఇప్పుడు అవి లేవు. కొన్ని అడవులు కుంచించుకుపోతున్నాయి. పులులకు ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లేలా అడవులు విస్తారంగా ఉండాలి. కానీ.. పెరుగుతున్న జనాభా, పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వల్ల అడవులు అంతరించిపోతుండటం వల్ల పులులు వేరే ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండటం లేదు. దీని వల్ల మగ, ఆడ పులులు మేటింగ్ సమస్య పెరుగుతోంది. తద్వారా పులుల సంతతి పెరగడం లేదు. మరోవైపు ఒకే పులికి పుట్టిన పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లే చాన్స్ లేకపోవడం వల్ల వాటికి అవే మేటింగ్ చేసుకుంటున్నాయి. దీంతో జన్యుపరమైన సమస్యలతో పిల్లలు పుట్టి అవి పెరిగే క్రమంలో మృత్యువాత పడుతున్నాయి. వాటి భూభాగాన్ని విస్తరింపచేసుకోలేకపోవడం అతి పెద్ద సమస్య.

2014 నుంచి 60 శాతం పెరిగిన పులుల జనాభా

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి లెక్కిస్తే పులుల జనాభా 60 శాతం పెరిగింది. కానీ.. వాటి భూభాగం ఎక్కడ ఉంది. అవి ఉండటానికి అడవులు ఎక్కడ ఉన్నాయి? ఒకచోటు నుంచి మరోచోటుకి వెళ్లే పరిస్థితి ఎక్కడ ఉంది? అందుకే ఎంత వేగంగా వాటి విస్తరణ జరిగినా.. అంతే వేగంగా అవి మృత్యువాత పడుతున్నాయి.. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పులుల జాతి అంతరించిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. అని వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్ జైరామ్ శుక్లా వెల్లడించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement