Red Tabletop Road | భారత్లో తొలిసారి వన్యప్రాణి సురక్షిత రహదారి – ఎన్హెచ్ఏఐ కొత్త ప్రయోగం
మధ్యప్రదేశ్లోని వీరాంగణ దుర్గావతి టైగర్ రిజర్వ్ గుండా వెళ్లే NH-45పై ఎన్హెచ్ఏఐ భారత్లో తొలిసారి ఎరుపు టేబుల్టాప్ రోడ్ మార్కింగ్స్ను అమలు చేసింది. వన్యప్రాణి–వాహన ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డుపై ఎరుపు రంగు డబ్బాలు గీయడం, అండర్పాస్లు, ఫెన్సింగ్తో రూపొందిన ఈ వినూత్న రహదారి ప్రయోగం దేశవ్యాప్తంగా అటవీ రహదారి నమూనాగా మారనుంది.
India’s First Wildlife-Safe Highway: NHAI Introduces Red Tabletop Markings on NH-45 in Madhya Pradesh
అడవుల గుండా వెళ్లే ఈ రహదారిపై వాహనాల వేగాన్ని సహజంగా తగ్గించి, వన్యప్రాణి–వాహన ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం.
- భారత్లో తొలిసారిగా వన్యప్రాణుల సురక్షిత రహదారి ప్రయోగం
- NH-45పై ఎరుపు టేబుల్టాప్ మార్కింగ్స్ అమలు
- వన్యప్రాణి–వాహన ప్రమాదాలను తగ్గించే లక్ష్యం
భోపాల్, డిసెంబర్ 17:
దేశంలో రహదారుల విస్తరణతో పాటు వన్యప్రాణుల రక్షణ కూడా అంతే కీలకమని చాటిచెప్పేలా మధ్యప్రదేశ్లో ఒక వినూత్న ప్రయోగం ప్రారంభమైంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) జబల్పూర్–భోపాల్ జాతీయ రహదారి నంబర్ 45 (ఎన్హెచ్-45)పై భారత్లో తొలిసారిగా ‘ఎరుపు టేబుల్టాప్ రోడ్ మార్కింగ్స్’ను అమలు చేసింది. అడవుల గుండా వెళ్లే రహదారులపై వాహనాల వేగాన్ని తగ్గించి, వన్యప్రాణులు రోడ్డు దాటే సమయంలో జరిగే ప్రమాదాలను తగ్గించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం.
ఈ రెడ్ టాప్ రోడ్డు ఉపయోగమేంటి?

దుబాయ్లోని షేక్ జాయేద్ రోడ్డును స్ఫూర్తిగా తీసుకుని ఎన్హెచ్ఏఐ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇది వీరాంగణ దుర్గావతి టైగర్ రిజర్వ్ (గతంలో నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం) గుండా వెళ్లే 11.9 కిలోమీటర్ల రహదారి విభాగంలో అమలవుతోంది. ఇందులో దాదాపు రెండు కిలోమీటర్ల పొడవున ఎరుపు రంగు టేబుల్టాప్ మార్కింగ్స్ వేశారు. ఇవి కేవలం ఐదు మిల్లీమీటర్ల మందంతో ఉండే సన్నని పొర మాత్రమే. దీనివల్ల, రహదారిపై అకస్మాత్తుగా కనిపించే ఎరుపు రంగు డ్రైవర్లకు ప్రమాద సంకేతంగా పనిచేసి, సహజంగానే వేగం తగ్గేలా చేస్తుంది. సంప్రదాయ స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా వాహనాలు కుదుపులకు లోనుకాకుండా, అడవి జంతువులను భయపెట్టే శబ్దాలు, కంపనాలు లేకుండానే ఈ లక్ష్యాన్ని సాధించడం ఇందులోని ప్రత్యేకత.
ఈ ప్రాంతం పులులు, జింకలు, సాంబార్ జింకలు, నక్కలు, హైనాలు వంటి అనేక వన్యప్రాణులకు ఆవాసంగా ఉంది. పులుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, యవ్వనంలో ఉన్న పులులు కొత్త ఆవాసాల కోసం రహదారులు దాటే అవకాశాలు పెరిగాయి. గణాంకాల ప్రకారం, గత రెండేళ్లలోనే మధ్యప్రదేశ్లో 237 జంతు–వాహన ప్రమాదాలు చోటుచేసుకోగా, దాదాపు 94 వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. ఇటీవల గ్వాలియర్ సమీపంలో చిరుతపులి పిల్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఈ తక్షణ చర్యలకు ప్రేరణగా మారింది.
ఎలా రూపొందించారు?

రూ.122.25 కోట్ల వ్యయంతో రెండు లైన్ల నుంచి నాలుగు లైన్లకు విస్తరిస్తున్న ఈ రహదారి ప్రాజెక్టు 2025 చివరి నాటికి పూర్తి కానుంది. ఎరుపు మార్కింగ్స్తో పాటు, వన్యప్రాణి రక్షణ కోసం మరిన్ని చర్యలు చేపట్టారు. జంతువులు రహదారి కింద నుంచి సురక్షితంగా అవతలికి వెళ్లేందుకు 25 అండర్పాస్లను కూడా నిర్మించారు. రహదారికి రెండు వైపులా ఎనిమిది అడుగుల ఎత్తైన ఇనుప కంచెలు ఏర్పాటు చేసి, జంతువులు నేరుగా రోడ్డు మీదకు రాకుండా అండర్పాస్ల వైపు మళ్లేలా చేశారు. అదనంగా, రహదారి అంచుల వెంట తెలుపు రంగు షోల్డర్ లైన్లు, స్పీడ్ డిటెక్షన్ పరికరాలను కూడా అమర్చారు.
View this post on Instagram
సాధారణంగా తెలుపు లేదా పసుపు రంగు రోడ్ మార్కింగ్స్ వాడుతుంటాం. ప్రమాద ప్రాంతాల్లో ఎరుపు రంగును వినియోగించడం ఇదే తొలిసారి. ఇది డ్రైవర్లకు స్పష్టమైన హెచ్చరికగా పనిచేస్తూ, వాహనాలు నెమ్మదిగా నడిచేలా చేస్తుందని ఎన్హెచ్ఏఐ అధికారి అమృత్లాల్ సాహూ తెలిపారు. మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ ఈ చర్యను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ, “వన్యప్రాణుల రక్షణ మన పవిత్ర కర్తవ్యం” అని పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, దేశవ్యాప్తంగా అడవుల గుండా వెళ్లే ఇతర రహదారుల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశముంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ పరిసరాలు, ఈశాన్య భారతంలోని ఏనుగుల కారిడార్ ప్రాంతాల్లో ఇది ఉపయోగపడవచ్చని అధికారులు భావిస్తున్నారు.

దేశంలో రహదారుల నెట్వర్క్ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, అభివృద్ధితో పాటు వన్యప్రాణుల సంరక్షణ కూడా అనివార్యం. రోడ్లు అవసరమే కానీ, అవి అటవీ జీవనాన్ని దెబ్బతీయకూడదు. ఈ ఎరుపు టేబుల్టాప్ మార్కింగ్స్.. అభివృద్ధి, పర్యావరణ రక్షణ రెండింటికీ మధ్య సమతుల్యత సాధించే మార్గంగా నిలుస్తున్నాయి. చిన్నగా కనిపించే ఈ మార్పు, ఎన్నో వన్యప్రాణుల ప్రాణాలను కాపాడగలదని వన్యప్రాణి నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Woman Parade | భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. అర్ధనగ్నంగా వివాహిత ఊరేగింపు
జులై 4, 2026

Divorce for Snoring | రాత్రిళ్లు నీ గురక భరించలేపోతున్నా.. భర్తను విడాకులు కోరిన భార్య
జులై 4, 2026

DGP CV Anand | ప్రజలకు చేరువగా పోలీసింగ్.. సాంకేతికతతో సమర్థవంతమైన సేవలు : డీజీపీ సీవీ ఆనంద్
జులై 3, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



