త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Victory | ఉచితం.. అస‌లు ర‌హ‌స్యం.. బీజేపీ విజ‌యానికి బాట‌లు ప‌రుస్తున్న ఫ్రీ స్కీంలు

BJP Victory | ఉచితాలు వ‌ద్దే వ‌ద్దంటూ చ‌ట్ట‌స‌భ‌ల్లో ప‌దే ప‌దే ప్ర‌బోధించే కాషాయ పార్టీ.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆ ప‌థ‌కాలే ప్రాణ‌వాయువుగా ఎన్నిక‌ల్లో వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్న‌ది. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను తాము మాత్ర‌మే అనుస‌రిస్తున్నామంటూ పార్ల‌మెంటులో, అసెంబ్లీల్లో ఊద‌ర‌గొట్టి.. తీరా ఎన్నిక‌లు రాగానే అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా మాట మారుస్తున్న‌ది.

S

National | Published On Mar 27, 2026, 8.30 pm IST

BJP Victory | ఉచితం.. అస‌లు ర‌హ‌స్యం.. బీజేపీ విజ‌యానికి బాట‌లు ప‌రుస్తున్న ఫ్రీ స్కీంలు
Advertisement

మ‌హిళ‌లే ల‌క్ష్యంగా న‌గ‌దు బ‌దిలీలు
ఎన్నిక‌ల ముందు వాగ్దానాలు
గెలిచాక.. గాలికి హామీలు..
కొన్నిచోట్ల షెడ్యూల్ క‌న్నా ముందే..
స్కీం పేరుతో పంప‌కాలు
ప్ర‌తి అసెంబ్లీ ఎన్నిక‌లోనూ.. ఇదే వ్యూహం
ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఉచితాలే ప్ర‌చార ఆయుధాలు..
ఎన్నిక‌ల్లో కాషాయ పార్టీ తీరు ఇది..
అసోంలో మ‌హిళ‌ల ఖాతాల్లోకి 9వేల రూపాయ‌లు జ‌మ

BJP Victory | త్రినేత్ర‌.న్యూస్ : ఉచితాలు వ‌ద్దే వ‌ద్దంటూ చ‌ట్ట‌స‌భ‌ల్లో ప‌దే ప‌దే ప్ర‌బోధించే కాషాయ పార్టీ.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆ ప‌థ‌కాలే ప్రాణ‌వాయువుగా ఎన్నిక‌ల్లో వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్న‌ది. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను తాము మాత్ర‌మే అనుస‌రిస్తున్నామంటూ పార్ల‌మెంటులో, అసెంబ్లీల్లో ఊద‌ర‌గొట్టి.. తీరా ఎన్నిక‌లు రాగానే అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా మాట మారుస్తున్న‌ది. మ‌హిళ‌లే ల‌క్ష్యంగా న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించ‌డం.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వీలును బ‌ట్టి అమలు చేయ‌డం లేదా వ‌దిలేయ‌డం చేస్తున్న‌ది. అధికారం ఉన్న చోట మాత్రం.. ఎన్నిక‌ల షెడ్యూల్ క‌న్నా ముందే న‌గ‌దు బ‌దిలీలు చేస్తున్న‌ది. మ‌రికొద్ది రోజుల్లో అసోంలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల కోసం షెడ్యూల్ క‌న్నా ముందే అరుణోద‌య ప‌థ‌కం పేరుతో 40 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు 9 వేల రూపాయ‌ల చొప్పున జ‌మ చేశారు. ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఆక‌ర్షించాలి..ఓట్లు కొల్ల‌గొట్టాలి

త్వ‌ర‌లోనే ఐదు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షాలు ఈ న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కానికి మ‌రోసారి తెర‌లేపాయి. ఎన్నిక‌ల వేళ మ‌హిళా, యువ‌త ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే విధంగా భారీ వాగ్దానాలు ప్ర‌క‌టించ‌డం.. ఎన్నిక‌లు ముగిసి.. అధికారాన్ని చేజిక్కించుకున్న త‌ర్వాత పాక్షికంగా అమ‌లు చేయ‌డం లేదంటే ఆ ప‌థ‌కం నామ‌రూపాల్లేకుండా చేయ‌డం బీజేపీకి అల‌వాటుగా మారింది.

బీహార్‌లో ఒక్కొక్క‌రికీ 10వేలు

బీహార్‌లో ఎన్నిక‌ల‌కు ముందు అధికారంలో ఉన్న ఎన్డీఏ స‌ర్కారు ఆ రాష్ట్రంలో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యే కొన్ని గంట‌ల ముందే న‌గ‌దు బ‌దిలీ చేసింది. దాదాపు కోటి 56 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు ముఖ్య‌మంత్రి మ‌హిళా రోజ్‌గార్ యోజ‌న పేరుతో ఒక్కొక్క‌రికీ 10వేల రూపాయ‌లు వారి ఖాతాల్లోకి పంపింది. ఇది ఎన్డీఏ విజ‌యానికి అత్యంత కీల‌కంగా మారింద‌ని... రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మ‌హారాష్ట్ర‌లో 2100 ఇస్తామ‌ని

మ‌హారాష్ట్ర‌లో రెండేండ్ల క్రితం అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. అప్ప‌టికే అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ అసెంబ్లీ ఎన్నిల‌కు రెండు నెల‌ల ముందు ఓ కొత్త ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది. ముఖ్య‌మంత్రి మ‌జ్హీ ల‌డ్కీ బెహన్‌ యోజ‌న ప‌థ‌కం కింద మ‌హిళ‌ల‌కు రూ. 1500 పంపిణీ చేసే ప‌థ‌కాన్ని ప్రారంభించారు. మ‌హాయుతి కూట‌మి అధికారంలోకి వ‌స్తే ఈ ప‌థ‌కాన్ని మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తామ‌ని, రూ. 1500 నుంచి రూ. 2,100కు పెంచుతామ‌ని మంత్రులు, నేత‌లు ప్ర‌చారంలో వాగ్దానం చేశారు. ఎన్నిక‌లు ముగిశాయి.. అనుకున్న‌ట్టే మ‌హాయుతి కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. కానీ 2025 బ‌డ్జెట్ కేటాయింపుల్లో ఈ ప‌థ‌కం ప్ర‌స్తావ‌నే లేదు. దీంతో ఆ రాష్ట్ర ప్ర‌జానీకం బీజేపీ ప్ర‌భుత్వాన్ని బ‌హిరంగంగా నిల‌దీస్తే తాము అలాంటి హామీ ఇవ్వ‌లేద‌ని బుకాయించారు.

హ‌ర్యానాలో లక్ష్మీ యోజ‌న పేరుతో

హ‌ర్యానా ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ బీజేపీ అనేక హామీల వ‌ర్షం కురిపించింది. మ‌రి ముఖ్యంగా హ‌ర్యానాలోని ప్ర‌తి మ‌హిళ‌కు లాడో ల‌క్ష్మీ యోజ‌న అనే ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని వాగ్దానం చేసింది. ఈ ప‌థ‌కం కింద నెల‌కు రూ. 2100 ఇచ్చి మ‌హిళ‌ల‌ను ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి చేస్తామ‌ని గొప్ప‌లు చెప్పింది. ఎన్నిక‌ల్లోనూ గెలిచింది. 2025 సెప్టెంబ‌ర్‌లో ఈ ప‌థ‌కం అమ‌లుకు నోటిఫికేష‌న్ జారీ చేసిన‌ప్ప‌టికీ.. క‌ఠిన‌త‌ర‌మైన నిబంధ‌న‌లు విధించింది. ఈ ప‌థ‌కం కింద ప్ర‌యోజ‌నం పొందే మ‌హిళ‌ల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. ల‌క్ష మించ‌కూడ‌ద‌నే క‌ఠిన నిబంధ‌న విధించింది. అంతేకాకుండా రాష్ట్రంలో గ‌త 15 ఏండ్ల పాటు నివాసితులై ఉండాల‌ని ఆదేశించింది. దీంతో వ‌ల‌స‌దారులు, చాలా మంది మహిళ‌లు ఈ ప‌థ‌కానికి అన‌ర్హులుగా మిగిలిపోయారు. సుమారు 80 లక్షల మంది మహిళలు అర్హత సాధించే అవకాశం ఉండగా, వారిలో కేవలం 20-25 లక్షల మంది మాత్రమే అర్హత పొందవచ్చని ప్రభుత్వమే అంచనా వేసింది. మొత్తానికి ఈ ప‌థ‌కం అమ‌లు కాకుండానే మిగిలిపోయింది.

ఢిల్లీలో ఒక్కొక్క‌రికీ 2500...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ అధికారం కైవ‌సం చేసుకునేందుకు హామీల వ‌ర్షం కురిపించింది. 2025లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన ప్ర‌ధాన హామీ.. మ‌హిళా స‌మృద్ది యోజ‌న. దేశ రాజ‌ధానిలో నివాస‌ముంటున్న మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ. 2500 ఇస్తామ‌ని బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో ఆశ‌లు పెట్టుకున్న మ‌హిళ‌లు బీజేపీకే ఓటేసి ప‌ట్టం క‌ట్టారు. హామీ ఇచ్చిన మేర‌కు 2025 మార్చి 8న ఈ ప‌థ‌కాన్ని లాంఛ‌నంగా ప్రారంభించింది.. ఆర్భాటంగా రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ‌ను కూడా ప్రారంభించింది. కానీ బ‌డ్జెట్ కేటాయింపులు చేయ‌లేదు. ఎలాంటి ప్ర‌త్యేక నిధులు విడుద‌ల చేయ‌లేదు. నేటికి ఈ ప‌థ‌కం ఢిల్లీలో కార్య‌రూపం దాల్చ‌లేదు. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని పథకాల మాదిరిగానే, ఈ పథకం కూడా కేబినెట్ తీర్మానాలు, పత్రికా ప్రకటనలకే పరిమితమైంది.

Advertisement

తాజావార్తలు

Advertisement