త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సాయంత్రం 5 గంటల ట్రిక్.. శాటిలైట్స్‌కు చిక్కకుండా పంజాబ్, హర్యానా రైతుల ఎత్తుగడ

J

National | Published On Dec 8, 2025, 11.53 am IST

సాయంత్రం 5 గంటల ట్రిక్.. శాటిలైట్స్‌కు చిక్కకుండా పంజాబ్, హర్యానా రైతుల ఎత్తుగడ
Advertisement

ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో పొగ మంచు ఎంతలా కమ్ముకుంటుందో తెలుసు కదా. చలికాలం అయితే ఉదయం 10 దాటినా పొగ మంచు తగ్గదు. దానికి తోడు ఎన్‌సీఆర్ పరిధిలో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు ఇదివరకులా పరిస్థితులు ఇప్పుడు లేవని, ఢిల్లీ పరిధిలో కాలుష్యం చాలామేరకు తగ్గిందని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో చూస్తే అలాంటి పరిస్థితులు అయితే లేవు. పంజాబ్, హర్యానా రైతులు పంట వ్యర్థాలను దహనం చేయడం చాలావరకు తగ్గిందని ప్రభుత్వం చెబుతున్నా.. అసలు విషయం తెలిస్తే అందరూ షాక్ అవుతారు.

సంచలన విషయాలు బయటపెట్టిన ఇస్రో, నాసా

పంజాబ్, హర్యానా రైతులు తమ పంటల వ్యర్థాలను దహనం చేయడం తగ్గించలేదు కానీ.. శాటిలైట్ల బారి నుంచి తప్పించుకోవడానికి సరికొత్త ఎత్తుగడ వేశారని ఇస్రో, నాసా తాజాగా బయటపెట్టింది.

అదే సాయంత్రం 5 గంటల ట్రిక్. పంజాబ్, హర్యానా రైతులు చేసే పంట వ్యర్థాల దహనాన్ని పర్యవేక్షించేందుకు పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్లను ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ శాటిలైట్లు రోజుకు రెండు సార్లు పంజాబ్, హర్యానా ప్రాంతాలను స్కాన్ చేస్తాయి. వాటికి మంటలు, పొగ కన్పిస్తే ఆ ప్రాంతాన్ని అంతా రికార్డు చేసి సైంటిస్టులకు సమాచారాన్ని చేరవేస్తాయి.

ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఆ ప్రాంతాలను స్కాన్ చేస్తాయి. ఈ విషయాన్ని కనిపెట్టిన పంజాబ్, హర్యానా రైతులు.. ఆ సమయంలో పంట వ్యర్థాలను కాల్చడం లేదు. వాటి స్కానింగ్ పూర్తయ్యాక సాయంత్రం 5 గంటలకు పొలాల్లో నిప్పు పెడుతున్నారు. ఒక్కోసారి మధ్యాహ్నం 1.30 తర్వాత నిప్పు పెడతారు. దీని వల్ల ఆ మంటలు శాటిలైట్లలో రికార్డు కావడం లేదు.

2020 సంవత్సరంలో మధ్యాహ్నం 1.30 తర్వాత బాగా మంటలు కనిపించేవని.. కానీ 2024 తర్వాత ఆ సమయాన్ని మార్చి రైతులు సాయంత్రం 5 గంటలకు మంటలను పెడుతున్నట్టు అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ గుర్తించింది. శాటిలైట్లకు దొరకకుండా రైతులు ఉద్దేశపూర్వకంగానే సమయాన్ని మార్చారని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు.

మూడో అత్యంత కలుషిత సంవత్సరంగా 2025

నాసా శాస్త్రవేత్తల బృందం కూడా అదే చెబుతోంది. ప్రభుత్వ గణాంకాలు మాత్రం పంట వ్యర్థాల దహనం తగ్గిందని చెబుతునా, గాలిలో చూస్తూ కాలుష్యం మాత్రం తగ్గలేదు.. అని నాసా శాస్త్రవేత్త హిరేన్ జెత్వా తెలిపారు.

ఏరోసోల్ లోడింగ్ డేటా ప్రకారం.. గత 15 ఏళ్లను లెక్కలోకి తీసుకుంటే 2025 సంవత్సరం మూడో అత్యంత కలుషిత సంవత్సరంగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.

మధ్యాహ్నం తర్వాత పెట్టే మంటలను శాటిలైట్స్ గుర్తించలేకపోవడం వల్ల వాటి రిపోర్ట్ ప్రకారం 92 శాతం వరకు మంటల తగ్గుదల ఉందని ప్రభుత్వం వాదిస్తోందని ఆయన అన్నారు.

అధికారులు చెబితేనే రైతులు అలా చేస్తున్నారా?

క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందంటే.. పంజాబ్‌కు చెందిన కొందరు ప్రభుత్వ అధికారులు సాయంత్రం 4 తర్వాత మంటలు పెట్టుకోవాలని రైతులకు సలహాలు ఇస్తున్నారని తెలుస్తోంది. అందుకే రైతులు కూడా శాటిలైట్లకు అందకుండా సాయంత్రం తర్వాత మంటలు పెడుతున్నారని.. తద్వారా ప్రభుత్వ రికార్డుల్లో మంటలు పెడుతున్నట్లు లేకున్నా, ఎన్‌సీఆర్ రీజియన్‌లో చూస్తే మాత్రం పొగ, కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కాలుష్య నియంత్రణ చేయి దాటి పోయి అది మానవాళికే ముప్పు తీసుకొస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement