త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mushroom Business | రూ. 2500తో పుట్ట‌గొడుగుల వ్యాపారం.. ఏడాదికి రూ. 3 కోట్లు గ‌డిస్తున్న అన్న‌ద‌మ్ముళ్లు..!

Mushroom Business | రెక్కాడితే కానీ డొక్కాడ‌ని కుటుంబం అది.. తండ్రి వ్య‌వ‌సాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయ‌న కుమారులిద్ద‌రూ వ్య‌వ‌సాయ కూలీలుగా( Agricultural labourers ) జీవ‌నం సాగిస్తున్నారు. అయినా కూడా ఆర్థికంగా ఎదుగుద‌ల లేదు. సాధార‌ణ పంట‌లైనా వ‌రి( Paddy ), గోధుమ( Wheat ) నుంచి ప్ర‌త్యామ్నాయ పంట‌ల వైపు దృష్టి సారించాల‌ని అన్న‌ద‌మ్ముళ్లు నిర్ణ‌యించుకున్నారు. దీంతో ఆదా చేసుకున్న రూ. 2500తో పుట్ట‌గొడుగుల వ్యాపారం( Mushroom Business ) ప్రారంభించి.. ఇప్పుడు ఏడాదికి రూ. 3 కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు ఎదిగారు. మ‌రి ఆ ఇద్ద‌రు అన్న‌దమ్ముళ్ల స‌క్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే ఉత్త‌ర‌ప్ర‌దేశ్( Uttar Pradesh ) వెళ్ల‌క త‌ప్ప‌దు.

S

Agriculture | Published On May 18, 2026, 3.04 pm IST

Mushroom Business | రూ. 2500తో పుట్ట‌గొడుగుల వ్యాపారం.. ఏడాదికి రూ. 3 కోట్లు గ‌డిస్తున్న అన్న‌ద‌మ్ముళ్లు..!
Advertisement

Mushroom Business | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌( Uttar Pradesh )లోని బారాబంకి జిల్లా( Barabanki District )కు చెందిన దిలీప్, కుల్దీప్ వ‌ర్మ అన్న‌ద‌మ్ముళ్లు. వీరు వ్య‌వ‌సాయ కూలీలు( Agricultural labourers ). తండ్రి రైతు. త‌మ‌కున్న భూమిలో తండ్రి గోధుమ‌( Wheat ), వ‌రి( Paddy ) పండించేవారు. అన్న‌ద‌మ్ముళ్లిద్ద‌రూ కూలీ ప‌నులు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేవారు. ఈ క్ర‌మంలోనే రూ. 2500 ఆదా చేసుకున్నారు.

అయితే వ‌రి, గోధుమ పంట‌లు పండిస్తున్న‌ప్ప‌టికీ ఆర్థికంగా ఎద‌గ‌లేక‌పోతున్నారు. ప్ర‌త్యామ్నాయ పంట‌ల వైపు దృష్టి సారించాల‌ని అన్న‌ద‌మ్ముళ్లు నిర్ణ‌యించుకున్నారు. త‌మ ప్రాంతంలో పుట్ట‌గొడుగులు( Mushrooms ) పండిస్తున్న రైతులను గ‌మ‌నించారు. వారు డ‌బ్బు బాగా సంపాదిస్తున్న‌ట్లు గ్ర‌హించారు. తాము ఎందుకు ప్ర‌య‌త్నించ‌కూడ‌దు అని మ‌న‌సులో ఆలోచ‌న త‌ట్టింది.

ఓ గ‌దిలోనే పుట్ట‌గొడుగు సాగు

ఈ ఆలోచ‌న‌నే వ్య‌వ‌సాయ కూలీలుగా ఉన్న అన్న‌ద‌మ్ముళ్లిద్ద‌రిని వ్యాపార‌వేత్త‌లుగా మార్చింది. ఆదా చేసుకున్న రూ. 2500తో.. స్థానిక రైతు నుంచి రూ. 500 వెచ్చించి పుట్ట‌గొడుగుల విత్త‌నాల‌ను సేక‌రించారు. గోధుమ గ‌డ్డి కోసం మ‌రో రూ. 250 ఖ‌ర్చు చేశారు. ఇక త‌మ ఇంట్లోని ఓ గ‌దిలోనే పుట్ట‌గొడుగు సాగు( Mushrooms Cultivation ) మొద‌లుపెట్టారు.

మొద‌టి ప్ర‌య‌త్నంలోనే 600 కిలోల పుట్టగొడుగులు ఉత్ప‌త్తి

మొద‌టి ప్ర‌య‌త్నంలోనే సుమారు 600 కిలోల వ‌ర‌కు పుట్టగొడుగుల‌ను ఉత్ప‌త్తి చేశారు. ల‌క్నో మార్కెట్‌కు త‌ర‌లించి కిలో పుట్ట‌గొడుగుల‌ను రూ. 50కి విక్ర‌యించారు. రూ. 3 వేల వ‌ర‌కు ఆదాయం వ‌చ్చింది. పెట్టుబ‌డి కేవ‌లం రూ. 2500 మాత్ర‌మే.. కానీ ఈ పంట‌కు మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని అన్న‌ద‌మ్ముళ్లు గ్ర‌హించారు.

దాదాపు 100 గుడిసెలు ఏర్పాటు చేసి..

ఇక తిరిగి చూడ‌లేదు. ప్ర‌తి ఏడాది త‌మ ఉత్ప‌త్తిని పెంచారు. వ‌చ్చిన ఆదాయాన్ని తిరిగి పెట్టుబ‌డిగా పెట్టారు. అయితే బ‌ట‌న్ పుట్ట‌గొడుగుల‌కు త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు అవ‌స‌రం. ఈ సాగు కేవ‌లం శీతాకాలం వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ సోద‌రులు గుడిసెల ప‌ద్ధ‌తిని ఎంపిక చేసుకున్నారు. మ‌ట్టి, గ‌డ్డి ఉప‌యోగించి గుడిసెల‌ను ఏర్పాటు చేశారు. ఈ న‌మూనాను నాలుగు నుంచి ఐదు ఎక‌రాల‌కు విస్త‌రించారు. దాదాపు 100 గుడిసెలు ఏర్పాటు చేసి.. ఉత్ప‌త్తి పెంచారు. రెట్టింపు దిగుబ‌డి రావ‌డంతో పాటు రెట్టింపు ఆదాయం కూడా స‌మ‌కూర‌డం ప్రారంభ‌మైంది.

ఒకే సీజ‌న్‌లో దాదాపు 50 వేల కిలోల వ‌ర‌కు

ఒకే సీజ‌న్‌లో దాదాపు 50 వేల కిలోల వ‌ర‌కు పుట్ట‌గొడుగులను ఉత్ప‌త్తి చేశారు. కిలో పుట్ట‌గొడుగుల‌ను రూ. 90కి విక్ర‌యించారు. ఆ స‌మ‌యంలో దాదాపు రూ. 45 ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయాన్ని పొందారు.

మ‌ట్టి గుడిసెల స్థానంలో ఏసీ యూనిట్లు

త‌మ దిగుబ‌డి రెట్టింపు అవుతున్న కొద్ది.. వ్యాపారం విస్త‌రిస్తున్న కొద్ది.. అధునాత‌న ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంభించ‌డం ప్రారంభించారు. మ‌ట్టి గుడిసెల స్థానంలో ఏసీ యూనిట్ల‌ను నెల‌కొల్పారు. ఈ రెండింటి మ‌ధ్య స్ప‌ష్ట‌మైన వ్య‌త్యాసం ఉంది. ఒక్కో మ‌ట్టి గుడిసె నిర్మాణానికి రూ. 1 ల‌క్ష వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. అక్టోబ‌ర్ నుంచి మార్చి నెల వ‌ర‌కు మాత్ర‌మే ఈ మ‌ట్టి గుడిసెలు ప‌ని చేస్తాయి. ఒక్కో గుడిసె నుంచి రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం పొందొచ్చు. త‌ద్వారా ప్ర‌తి సీజ‌న్‌లో రూ. 1 ల‌క్ష వ‌ర‌కు లాభం గ‌డించొచ్చు. పుట్ట‌గొడుగుల సాగు ప్రారంభించే వారికి ఇది అనుకూల‌మైన ప‌ద్ధ‌తి. త‌క్కువ పెట్టుబ‌డి, త‌క్కువ న‌ష్టంతో అధిక రాబ‌డిని సంపాదించొచ్చు.

రూ. 3 ల‌క్ష‌ల నుంచి రూ. 4 ల‌క్ష‌ల వ‌ర‌కు లాభం

ఇక ఏసీ యూనిట్ల విష‌యానికి వ‌స్తే.. పెట్టుబ‌డి అధికంగా ఉంటుంది. కానీ ఏడాది పొడ‌వునా పుట్ట‌గొడుగుల‌ను సాగు చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఒక్కో ఏసీ యూనిట్ నుంచి ప్ర‌తి సైకిల్‌కు 4 వేల కిలోల వ‌ర‌కు దిగుబ‌డిని పొందే అవ‌కాశం ఉంటుంది. ఏడాదికి ఐదు సైకిళ్ల చొప్పున‌.. ఒక్కో యూనిట్ నుంచి 20 వేల కిలోల వ‌ర‌కు దిగుబ‌డి సాధించొచ్చు. త‌ద్వారా ఒక్కో సైకిల్‌లో ఒక్కో యూనిట్ నుంచి రూ. 3 ల‌క్ష‌ల నుంచి రూ. 4 ల‌క్ష‌ల వ‌ర‌కు లాభం పొందొచ్చు.

లీజుకు తీసుకున్న ప్ర‌దేశంలో 12 ఏసీ యూనిట్లు

అయితే వీరు గుడిసె, ఏసీ యూనిట్ల‌ను రెండింటిని కొన‌సాగిస్తున్నారు. లీజుకు తీసుకున్న ప్ర‌దేశంలో 12 ఏసీ యూనిట్ల‌ను నెల‌కొల్పారు. బ్యాక్టిరియా, ఫంగస్ వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా అరిక‌ట్టొచ్చు. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చినా ఒక్క యూనిట్ వ‌ర‌కు మాత్ర‌మే ప్ర‌భావితం అవుతుంది.

40 మందికి ఉపాధి

ఈ విధంగా ఏసీ యూనిట్ల నుంచి ప్ర‌తి ఏడాది సుమారు 2.4 ల‌క్ష‌ల కిలోలు, 70 మ‌ట్టి గుడిసెల నుంచి సుమారు 35 వేల కిలోల పుట్ట‌గొడుగుల‌ను పండిస్తున్నారు. కిలో పుట్టగొడుగుల‌ను స‌గ‌టున రూ. 110కి విక్ర‌యిస్తున్నారు. అధిక డిమాండ్ ఉన్న స‌మ‌యంలో రూ. 130 వ‌ర‌కు కూడా విక్ర‌యిస్తున్నారు. పెళ్లిళ్ల సీజ‌న్ల‌లో రూ. 200 వ‌ర‌కు కూడా అమ్ముతున్నారు. ఈ సోద‌రులిద్ద‌రూ సుమారు 40 మందికి ఉపాధి క‌ల్పిస్తున్నారు.

ఏడాదికి రూ. 3 కోట్ల ఆదాయం..

మొత్తంగా ఏడాదికి రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వార్షిక ట‌ర్నోవ‌ర్‌కు ఎదిగారు. లాభాలు వ‌చ్చేసి రూ. 1.25 కోట్ల నుంచి రూ. 1.5 కోట్ల మ‌ధ్య గ‌డిస్తున్నారు. త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ దిగుబ‌డి, ఆదాయం సాధించే పంట‌ల్లో పుట్ట‌గొడుగుల సాగు ఒక‌టి అని దిలీప్, కుల్దీప్ వ‌ర్మ పేర్కొన్నారు. మొదట‌గా గుడిసెల్లో సాగు చేసి.. ఆ త‌ర్వాత ఏసీ యూనిట్ల‌కు వెళ్తే.. అనుకున్న సంపాద‌న సాధించే అవ‌కాశం ఉందని తెలిపారు.

Advertisement
Advertisement