త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీక‌రించిన‌ కేంద్రం

E20 fuel | 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వల్ల కొన్ని వాహనాల్లో మైలేజ్ (fuel economy) త‌గ్గుతుంద‌న్న మాట వాస్త‌వ‌మేన‌ని కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది. దీని ప్రభావం కంటే ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయని వివరించింది.

D

National | Published On Jul 10, 2026, 4.30 pm IST

E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీక‌రించిన‌ కేంద్రం
Advertisement

E20 fuel | త్రినేత్ర‌.న్యూస్ : E20 పెట్రోల్ (20% ఇథనాల్, 80% పెట్రోల్ మిశ్రమం) వినియోగంపై (E20 fuel) దేశవ్యాప్తంగా ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ఇంధనం వాడటం వల్ల మైలేజ్ తగ్గడం (reduce mileage), ఇంజిన్ దెబ్బతినడం (damage engines), మెయింటేనెన్స్ ఖర్చులు పెరగడం లాంటి సమస్యలు వస్తున్నాయని చాలా మంది వాహనదారులు ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా స్పందించింది. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వల్ల కొన్ని వాహనాల్లో మైలేజ్ (fuel economy) త‌గ్గుతుంద‌న్న మాట వాస్త‌వ‌మేన‌ని అంగీక‌రించింది.

ఇథ‌నాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడ‌కంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టేందుకు పెట్రోలియం, స‌హ‌జ వాయువు మంత్రిత్వ శాఖ ఒక వివ‌ర‌ణాత్మ‌క ప్ర‌శ్నోత్త‌రాల ప‌త్రాన్ని విడుద‌ల చేసింది. E20 పెట్రోల్‌ కారణంగా కొన్ని వాహనాల్లో మైలేజ్ 3 నుంచి 5 శాతం తగ్గొచ్చని వెల్లడించింది. అయితే, దీని ప్రభావం కంటే ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయని వివరించింది. ఈ 20 పెట్రోల్‌తో అధిక ఆక్టేన్ రేటింగ్, మెరుగైన‌ ఇంజిన్ పనితీరు, మెరుగైన పికప్, స్మూత్ యాక్సిలరేషన్, తక్కువ కర్బన ఉద్గారాల విడుదల వంటి ఉపయోగాలు ఉన్నాయని స్ప‌ష్టం చేసింది. ఈ10 లేదా సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే E20 స్వ‌చ్ఛ‌మైన‌, మెరుగైన నాణ్యత కలిగిన, సమర్థవంతమైన ఇంధనంగా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

2001లోనే ప్ర‌వేశ‌పెట్టాం..

ఈ20 పెట్రోల్ వినియోగాన్ని చాలా తొంద‌ర‌గా అమ‌లు చేశార‌న్న ఆందోళ‌న‌ల‌పై కూడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ కార్యక్రమాన్ని చాలా త్వరగా అమలు చేశారనే అభిప్రాయాలను మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అనేక సంవత్సరాల శాస్త్రీయ పరీక్షలు, వాహన తయారీ సంస్థలతో చర్చలు, దేశీయ ఇథనాల్ ఉత్పత్తి పెంపు తర్వాతే ఈ20 అమలు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 2001లోనే ప్ర‌యోగాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తెలిపింది. 2006 నాటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5 శాతం బ్లెండింగ్‌ను ప్రవేశపెట్టామని తెలిపింది. 2014 వరకు ఇథనాల్ బ్లెండింగ్‌ స్థాయి సుమారు 1.5 శాతం వద్దే ఉండగా.. 2018లో జీవ ఇంధనాలపై జాతీయ విధానం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం ఉత్పత్తిని వేగవంతం చేసిందని తెలిపింది. 2022 నాటికి 10 శాతానికి, 2025-26 నాటికి 20 శాతం ఇథ‌నాల్ బ్లెండింగ్ ల‌క్ష్యాన్ని చేరుకున్న‌ట్లు మంత్రిత్వ శాఖ వివ‌రించింది.

అలా చేస్తే రవాణా ఖర్చులు పెరుగుతాయి..

పెట్రోల్ బంకుల్లో సాధారణ పెట్రోల్, ఈ10, ఈ20 వంటి అనేక రకాల ఇంధనాలు అందుబాటులో ఉంచాలనే డిమాండ్లను మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. దేశవ్యాప్తంగా వేర్వేరు ఇంధన సరఫరా వ్యవస్థలను నిర్వహించడం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయని, భారత్‌లోని లక్షకు పైగా రిటైల్ ఇంధన కేంద్రాల వద్ద పంపిణీ వ్యవస్థ మరింత క్లిష్టంగా మారుతుందని తెలిపింది.

రూ.1.90 ల‌క్ష‌ల కోట్ల విదేశీ మార‌క ద్ర‌వ్యం సేవ్..

ఇథ‌నాల్ పెట్రోల్ వ‌ల్ల రూ.1.90 ల‌క్ష‌ల కోట్ల విదేశీ మార‌క ద్ర‌వ్యం సేవ్ అయ్యింద‌ని తెలిపింది. పెట్రోల్‌లో ఇథ‌నాల్ క‌ల‌ప‌క‌పోతే భార‌త్ అద‌నంగా 3.1 కోట్ల మెట్రిక్ ట‌న్నుల క్రూడాయిల్ దిగుమ‌తి చేసుకోవాల్సి వ‌చ్చేద‌ని పేర్కొంది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా 952 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగిన‌ట్లు వెల్ల‌డించింది. అలాగే రైతులకు 1.66 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం చేరిందని పేర్కొంది. ఈ20 గురించి వస్తున్న తప్పుడు సమాచారాన్ని విశ్వ‌సించొద్ద‌ని మంత్రిత్వ శాఖ సూచించింది. అదే స‌మ‌యంలో E20 విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Advertisement
Advertisement