త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

INDIA | ఇండియా కూట‌మిలో లుక‌ల‌క‌లు.. కాంగ్రెస్‌పై సీపీఎం ఆగ్ర‌హం, రేప‌టి భేటీని బ‌హిష్క‌రించిన డీఎంకే

INDIA | : ప్రతిపక్షాల ఇండియా (INDIA) కూటమి సమావేశం జ‌రుగ‌నున్న‌ది. ఈ భేటీకి ముందే కూట‌మిలో విభేదాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ వైఖరిపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. డీఎంకే సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ పరిణామాల మధ్య ప్రతిపక్ష కూటమి ఐక్యతపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

P

National | Published On Jun 7, 2026, 3.43 pm IST

INDIA | ఇండియా కూట‌మిలో లుక‌ల‌క‌లు.. కాంగ్రెస్‌పై సీపీఎం ఆగ్ర‌హం, రేప‌టి భేటీని బ‌హిష్క‌రించిన డీఎంకే
Advertisement

INDIA | : ప్రతిపక్షాల ఇండియా (INDIA) కూటమి సమావేశం జ‌రుగ‌నున్న‌ది. ఈ భేటీకి ముందే కూట‌మిలో విభేదాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ వైఖరిపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. డీఎంకే సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ పరిణామాల మధ్య ప్రతిపక్ష కూటమి ఐక్యతపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ లేఖ రాశారు. ఇండియా కూటమి సమావేశానికి తమ పార్టీ హాజరవుతుందని, రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఖర్గే తదితర కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో సీపీఎం-బీజేపీ మధ్య అవగాహన ఉందని ఆరోపించారని బేబీ ప్ర‌స్తావించారు. అప్ప‌టి సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌ధ్య ఒప్పందం ఉంద‌ని చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్షాల ఐక్య‌తా స్ఫూర్తికి విరుద్ధ‌మ‌న్నారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఆ ఆరోప‌ణ‌లు నిరాధారం..

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటమే ఇండియా కూటమి లక్ష్యమని, ఆ వేదికను బలోపేతం చేసేందుకు సీపీఎం ఆరంభం నుంచే కృషి చేస్తోందని బేబీ గుర్తుచేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో తమ పార్టీకి చెందిన అనేక మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, అలాంటి పరిస్థితుల్లో సీపీఎం బీజేపీతో కుమ్మక్కైందన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. మరోవైపు తమిళనాడులోని ప్రధాన మిత్రపక్షం డీఎంకే సైతం సమావేశానికి హాజరుకాకూడదని నిర్ణయించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, టీవీకేకు మద్దతు ఇవ్వడంపై డీఎంకే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ త‌మ‌కు కాంగ్రెస్ చేసిన రాజ‌కీయ ద్రోహంగా భావిస్తున్నామ‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఇప్ప‌టికీ ఆవేద‌న ఉంద‌ని డీఎంకే వ‌ర్గాలు పేర్కొన్నాయి. మ‌రో వైపు బెంగాల్‌లోనూ రాజ‌కీయాలు వేడెక్కాయి. తృణమూల్ కాంగ్రెస్‌లో అసంతృప్తి, అంతర్గత విభేదాల వార్తల మధ్య ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యే అవకాశాలపై చర్చ సాగుతోంది.

దిలీప్ ఘోష్ సెటైర్లు..

ఈ నేపథ్యంలో బీజేపీ నేత దిలీప్ ఘోష్ వ్యంగ్యంగా స్పందిస్తూ.. సొంత పార్టీనే పూర్తిగా వెన్నంటి లేకపోతే ఇతరులు ఎలా మద్దతిస్తారు? అని ప్ర‌శ్నించారు. ప్రతిపక్ష కూటమి పరిస్థితిపై బీజేపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌధరీ మాట్లాడుతూ ఇండియా కూటమి క్రమంగా విచ్ఛిన్నమవుతుందని వ్యాఖ్యానించారు. డీఎంకే వ్యాఖ్యలే కాంగ్రెస్ 40 ఏళ్ల మైత్రిని దెబ్బతీసిందని సూచిస్తున్నాయని, రానున్న రోజుల్లో కూటమిలో మరిన్ని చీలికలు కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఇప్పటికే బలహీనపడుతోందని, ప్రతిపక్ష పార్టీల పునరేకీకరణ సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యేలా కనిపించడం లేదన్నారు. బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరావోగి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాలు స్పష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టిన కాంగ్రెస్‌..

అయితే, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ స్పందిస్తూ ప్రతిపక్షాలపై వ్యాఖ్యానించే ముందు బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. సమావేశానికి ఎవరు వస్తారు.. ఎవరు రారు అనే ఊహాగానాల కంటే సమావేశం ముగిసిన తర్వాత వాస్తవ పరిస్థితి స్పష్టమవుతుందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాల భవిష్యత్ వ్యూహరచనకు ఈ సమావేశం కీలకంగా భావిస్తున్నారు. సమావేశానికి ముందే మిత్రపక్షాల మధ్య బహిర్గతమైన విభేదాలు ఇండియా కూటమి ఐక్యతపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Advertisement
Advertisement