త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Cabinet | ఏపీ–కర్ణాటక ఆర్థిక కారిడార్‌కు కేంద్రం ఆమోదం.. రూ.4,294 కోట్లతో మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ‌

Union Cabinet | ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆర్థిక కారిడార్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.4,294 కోట్ల పెట్టుబడులు పెట్ట‌నుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివ‌రాల‌ను వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక రంగానికి కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

P

National | Published On Jul 24, 2026, 6.14 pm IST

Union Cabinet | ఏపీ–కర్ణాటక ఆర్థిక కారిడార్‌కు కేంద్రం ఆమోదం.. రూ.4,294 కోట్లతో మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ‌
Advertisement
  • బళ్లారి–గుంతకల్లు రైల్వే మార్గానికి మూడో, నాలుగో లైన్లు..
  • గ్రాండ్‌ కెమికల్స్‌ ప్రాజెక్టుకు నిధులు

Union Cabinet | ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆర్థిక కారిడార్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.4,294 కోట్ల పెట్టుబడులు పెట్ట‌నుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివ‌రాల‌ను వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక రంగానికి కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ కారిడార్‌లో భాగంగా రెండు కీలక ప్రాజెక్టులను చేపట్టనున్నారు. బళ్లారి–గుంతకల్లు రైల్వే మార్గంలో మూడో, నాలుగో లైన్ల నిర్మాణానికి రూ.1,264 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గంపై సరుకు రవాణా ఒత్తిడిని తగ్గించడంతో పాటు అదనపు రవాణా సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఈ విస్తరణ వెనుక ప్రధాన ఉద్దేశం. ఇక పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే గ్రాండ్‌ కెమికల్స్‌ ప్రాజెక్టుకు రూ.3,030 కోట్లను కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో రసాయన, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి మార్గం సుగమం కానుంది.

ఉక్కు, సిమెంట్‌ పరిశ్రమలకు ప్రయోజనం

బళ్లారి–హోస్పేట్‌ ప్రాంతం ఇప్పటికే ఉక్కు, సిమెంట్‌ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఉంది. కొత్త ఆర్థిక కారిడార్‌తో ఈ పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల రవాణా, తయారైన ఉత్పత్తుల తరలింపు మరింత సులభతరం కానుంది. రైల్వే అనుసంధానం మెరుగుపడటంతో పరిశ్రమల రవాణా వ్యయం తగ్గే అవకాశం ఉంది. అలాగే, ప్రధాన ఓడరేవులు, పర్యాటక ప్రాంతాలతో ఈ ప్రాంతానికి అనుసంధానం మెరుగుపడనుంది. రైల్వే లైన్ల విస్తరణ పూర్తయితే ఏటా అదనంగా 1.6 కోట్ల టన్నుల సరుకు రవాణా చేసే సామర్థ్యం పెరగనుంది. ఇది వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు దోహదపడనుంది.

ప్రాజెక్టులో కీలక అంశాలు

  • ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ఆర్థిక కారిడార్‌కు రూ.4,294 కోట్ల పెట్టుబడులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం.
  • బళ్లారి–గుంతకల్లు మార్గంలో మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి రూ.1,264 కోట్లు.
  • గ్రాండ్‌ కెమికల్స్‌ ప్రాజెక్టు కోసం రూ.3,030 కోట్ల కేటాయింపు.
  • నిర్మాణం, నిర్వహణ దశల్లో కలిపి సుమారు 31 లక్షల పనిదినాల ఉపాధి అవకాశాలు.
  • ఏటా అదనంగా 1.6 కోట్ల టన్నుల సరుకు రవాణాకు అవకాశం.

పర్యావరణానికి కూడా మేలు

రవాణా వ్యవస్థలో మార్పులతో ఆర్థిక ప్రయోజనాలతో పాటు పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు. కారిడార్‌ అందుబాటులోకి వస్తే ప్రతి ఏడాది సుమారు 66.7 మిలియన్‌ కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంది. ఇది దాదాపు 27 లక్షల చెట్లు నాటినంత పర్యావరణ ప్రయోజనానికి సమానమని అంచనా. మరోవైపు సరుకు రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో ఏటా సుమారు రూ.149 కోట్ల వరకు లాజిస్టిక్స్‌ వ్యయం ఆదా అయ్యే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు తగ్గడం వల్ల స్థానిక పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెట్‌లో పోటీతత్వం పెరగనుంది.

Advertisement
Advertisement