త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | స‌భ‌కు రండి.. లేదంటే రాజ‌కీయంగా రాణించ‌లేరు

CM Revanth Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంద‌రూ అసెంబ్లీకి వ‌చ్చి చ‌ర్చ‌ల్లో పాల్గొనాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్ర‌జ‌లు ఇచ్చిన హోదాను స‌రైన విధంగా ఉప‌యోగించుకోక‌పోతే భ‌విష్య‌త్‌లో రాజ‌కీయంగా రాణించ‌లేరు అని సీఎం అన్నారు.

S

Telangana | Published On Sep 10, 2026, 9.04 pm IST

CM Revanth Reddy | స‌భ‌కు రండి.. లేదంటే రాజ‌కీయంగా రాణించ‌లేరు
Advertisement

చ‌ర్చ‌ల్లో పాల్గొనండి..
హాజ‌రు శాతం త‌గ్గ‌కుండా చూసుకోండి
బీఆర్ఎస్‌కు అధికారం పోయినా..
అహంకారం వీడ‌లేదు
ప్ర‌తిప‌క్ష కుట్ర‌ల‌ను తిప్పికొట్టినందుకు
మిమ్మ‌ల్ని అభినందిస్తున్నా
స‌ర్ విష‌యంలో ఏదో ప్ర‌మాదం పొంచి ఉంది
సీఎల్పీ స‌మావేశంలో సీఎం రేవంత్ వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంద‌రూ అసెంబ్లీకి వ‌చ్చి చ‌ర్చ‌ల్లో పాల్గొనాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్ర‌జ‌లు ఇచ్చిన హోదాను స‌రైన విధంగా ఉప‌యోగించుకోక‌పోతే భ‌విష్య‌త్‌లో రాజ‌కీయంగా రాణించ‌లేరు అని సీఎం అన్నారు. స‌భ‌లో హాజ‌రు శాతం త‌గ్గ‌కుండా చూసుకోవాల‌న్నారు. వెయ్యి రోజుల పాలనకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ సహకారంతో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు తీసుకువచ్చామ‌ని సీఎం అన్నారు. సీఎల్పీ స‌మావేశం సంద‌ర్భంగా సీఎం ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సభను నిర్వహిస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఫామ్ హౌజ్‌లో కేసీఆర్ అధ్యక్షతన సభను సజావుగా జరగకుండా కుట్ర చేశారు. అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులను, ప్రజా ప్రతినిధులను దూషించి మూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారని సీఎం మండిప‌డ్డారు.

నేలను శుద్ధి చేసి అవమానించారు..

అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించడం చేశారు. శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారు. ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసిన మిమ్మల్ని అభినందిస్తున్నాను. జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌పై విచార‌ణ చేప‌ట్ట‌డం జ‌రిగింది అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

సభలో సమస్యలు ప్రస్తావించాలి..

అందరికీ వెసులుబాటుగా ఉండాలని అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నాం. అసెంబ్లీలో సెంట్రల్ హాల్‌ను ప్రారంభించుకుని దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టుకున్నాం. సభలో నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించాలి. అసెంబ్లీ జరిగినన్ని రోజులు సభ్యుల హాజరు సంపూర్ణంగా ఉండాలి అని సీఎం సూచించారు.

కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కనిపించినట్టున్నారు..

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగి కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే సునీత లక్ష్మా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? పోలీస్ సిబ్బందిలో కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కనిపించినట్టున్నారు. అంత ఆక్రోశంతో అధికారులపై దాడులు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు.

జ‌న‌గ‌ణ‌న‌లో కుల‌గ‌ణ‌న కోసం కేంద్రంపై ఒత్తిడి

దేశానికి మనం చేసిన జనగణన రోల్ మోడల్. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత. తెలంగాణ నమూనాను జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి అని రేవంత్ పేర్కొన్నారు.

స‌ర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర

స‌ర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఈ ఓటు హక్కును కాపాడే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి. మీ ప్రతీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుంది. మీ వ్యక్తిగత పనితీరు మీ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంది. స‌ర్ అంశాన్ని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోండి. దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా తేల్చారు, కానీ ఓటర్ల జాబితా మాత్రం 88 కోట్లుగా చూపుతున్నారు. దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉంది అని సీఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 

Advertisement
Advertisement