త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala Pollas | ఏడాదికి రెండు సిలిండ‌ర్లు ఫ్రీ.. కేర‌ళ మేనిఫెస్టో విడుద‌ల చేసిన బీజేపీ..!

Kerala Pollas | కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మంగళవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ న‌బీన్ పాల్గొని.. ఆవిష్క‌రించారు.

P

National | Published On Mar 31, 2026, 5.28 pm IST

Kerala Pollas | ఏడాదికి రెండు సిలిండ‌ర్లు ఫ్రీ.. కేర‌ళ మేనిఫెస్టో విడుద‌ల చేసిన బీజేపీ..!
Advertisement

Kerala Pollas | కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మంగళవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ న‌బీన్ పాల్గొని.. ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేర‌ళ‌లో సహజ వనరులు, మానవ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ గత 17 ఏళ్ల ఎల్‌డీఎఫ్-యూడీఎఫ్ పాలనలో కేరళలో పారిశ్రామిక అభివృద్ధి అనుకున్నంత జ‌ర‌గ‌లేద‌ని.. ఆర్థిక స్థబ్దత, ఆర్థిక నిర్వహణలో లోపాలున్నాయ‌ని ఆరోపించారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కేరళ ప్రజలతో “మ్యాచ్ ఫిక్సింగ్” రాజకీయాలు ఆడుతున్నాయని మండిప‌డ్డారు. “ఈ రెండు కూటములు గత 17 ఏళ్లుగా అధికారంలోకి రావడం కోసం మాత్రమే పనిచేశాయి. ప్రజల అభివృద్ధి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. వారి రాజకీయాలు కుటుంబ ప్రయోజనాలకే పరిమితమయ్యాయి” విమ‌ర్శించారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఎప్పుడూ ఒకే వేదికపై ఉన్నాయని, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లోనూ కలిసి పనిచేశాయని, యూపీఏలోనూ భాగస్వాములుగా ఉన్నాయని గుర్తు చేశారు. అయితే, కేరళ అభివృద్ధిపై మాత్రం ఎప్పుడూ దృష్టి పెట్టలేద‌ని ఆరోపించారు.

బీజేపీ హామీలు..

“సిటిజన్ ఫస్ట్” భావనను అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. కేరళలోని 3.6 కోట్ల ప్రజలకు సమాన హక్కులు, సమాన న్యాయం, అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పిస్తామని నితిన్ న‌బీన్ వెల్ల‌డించారు. పేద కుటుంబాలకు సంవత్సరానికి రెండు ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. ఓనం పండుగ‌కు, క్రిస్మ‌స్ పండుగ స‌మ‌యాల్లో ఈ సిలిండ‌ర్ల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచుతామని చెప్పారు. ప్రతి కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) పథకాలను విస్తరించి ప్రతి మలయాళీకి ఆరోగ్య భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కేర‌ళ ప్ర‌జ‌ల‌కు రాహుల్ అస‌లు స్వ‌రూపం తెలుసు..

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, డీఎంకేపై కూడా న‌బిన్ విమ‌ర్శ‌లు గుప్పించారు. “కేరళ ప్రజలకు రాహుల్ గాంధీ అసలు స్వరూపం తెలుసు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చే రాజకీయాలు ఆయనవని వారికి తెలుసు” అని అన్నారు. శబరిమల అంశాన్ని ప్రస్తావిస్తూ “మీరు శబరిమల గురించి మాట్లాడారు. మీ మిత్రపక్షమైన డీఎంకే నాయకులు హిందూ మ‌నోభావాలను అవమానించినప్పుడు ఎందుకు స్పందించలేదు?” అంటూ ప్రశ్నించారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే శ‌బ‌రిమ‌ల దొంగ‌త‌నం కేసును సీబీఐతో విచార‌ణ చేయిస్తామ‌ని, దోషుల‌ను గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement