త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

America Iran War | అమెరికా, ఇరాన్ యుద్ధం.. ప్ర‌పంచ దేశాల‌పై ప్ర‌భావం..

America Iran War | అమెరికా, ఇజ్రాయెల్ క‌లిసి సంయుక్తంగా ఇరాన్‌పై (America Iran War) గ‌త ఫిబ్ర‌వ‌రిలో దాడులు ప్రారంభించాయి. తొలిరోజే ఆ దేశ‌ సుప్రీంలీడ‌ర్ అయుతుల్లా ఖ‌మేనీని అంత‌మొందించాయి. ఇరాన్ త‌మ ఆధీనంలోకి వ‌చ్చింద‌ని ఇరు దేశాలు భావించాయి. అయితే ఇరాన్ నుంచి అనుకోని ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వ‌డంతో మ‌ధ్య‌ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

G

National | Published On Jun 18, 2026, 8.06 am IST

America Iran War | అమెరికా, ఇరాన్ యుద్ధం.. ప్ర‌పంచ దేశాల‌పై ప్ర‌భావం..
Advertisement

America Iran War | త్రినేత్ర‌.న్యూస్‌: అమెరికా, ఇజ్రాయెల్ క‌లిసి సంయుక్తంగా ఇరాన్‌పై (America Iran War) గ‌త ఫిబ్ర‌వ‌రిలో దాడులు ప్రారంభించాయి. తొలిరోజే ఆ దేశ‌ సుప్రీంలీడ‌ర్ అయుతుల్లా ఖ‌మేనీని అంత‌మొందించాయి. ఇరాన్ త‌మ ఆధీనంలోకి వ‌చ్చింద‌ని ఇరు దేశాలు భావించాయి. అయితే ఇరాన్ నుంచి అనుకోని ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వ‌డంతో మ‌ధ్య‌ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. గ‌ల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే ల‌క్ష్యంగా ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. దీంతో ఇరాన్‌, అమెరికా మ‌ధ్య యుద్ధం తీవ్ర‌రూపం దాల్చింది. ఈ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ చ‌మురు ర‌వాణాకు కీల‌క‌మైన హ‌ర్మూజ్ జ‌లసంధిని ఇరాన్ మూసివేసింది. చ‌మురు నౌక‌లు స‌ముద్ర జ‌లాల్లో ఇరుక్కుపోవ‌డంతో ప్ర‌పంచ దేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌కు తీవ్ర కొర‌త ఏర్ప‌డింది.

ఇది భార‌త్ స‌హా అన్ని దేశాల ఆర్థిక‌, రాజ‌కీయ‌, ఇంధ‌న వ్య‌వ‌స్థ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. స‌ప్ల‌య్ చైన్ దెబ్బ‌తిన‌డంతో ఆర్థిక న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. ఈ యుద్ధానికి అమెరికా ఆప‌రేష‌న్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury) అని నామ‌క‌ర‌ణం చేసింది. ఫిబ్ర‌వ‌రి నుంచి జూన్ వ‌ర‌కు దాదాపు మూడు నెల‌ల‌కుపైగా సాగిన ఈ యుద్ధం తాజాగా ఇరు దేశాలు ఎంఓయూపై సంత‌కాలు చేయ‌డంతో ముగిసింది. అయితే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ దాని తాలూకు దీర్ఘకాలిక ప్రభావాలు ప్రపంచాన్ని ఇంకా వేధిస్తూనే ఉన్నాయి.

ప్ర‌పంచ దేశాల‌పై యుద్ధ ప్రభావాలు

అంతర్జాతీయ ఇంధన సంక్షోభం

ఇరాన్ తనపై జరిగిన దాడులకు ప్రతికారంగా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) నిర్బంధించడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 64 శాతానికిపైగా పెరిగాయి. అదేవిధంగా ప్రపంచ ఇంధన సరఫరాలో దాదాపు పావు వంతు (20 శాతం చమురు, గ్యాస్) నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు కొరత ఏర్పడింది. ఖతార్‌లోని ప్రధాన గ్యాస్ ప్లాంట్లపై దాడులు చేయ‌డంతో ద్రవీకృత సహజ వాయువు (LNG) ఎగుమతులు భారీగా క్షీణించాయి. దీంతో భార‌త్ స‌హా చాలా దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి.

ఆర్థిక మందగమనం

ఇంధన ధరల పెరుగుదల కారణంగా రవాణా వ్యయాలు పెరిగి, ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు అధిక‌మ‌య్యాయి. దీంతో యూరోజోన్ దేశాలు స్టాగ్‌ఫ్లేషన్ (ఆర్థిక వృద్ధి లేకపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం)లోకి జారుకున్నాయి. యుద్ధ భయాలతో అంతర్జాతీయ షేర్ మార్కెట్లు కుప్పకూలాయి, దీనివల్ల మదుపరులు (Investors) రూ.లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. మ‌రోవైపు సురక్షితమైన కరెన్సీగా భావించే అమెరికా డాలర్ ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే దాదాపు 2 శాతం బలపడింది.

మధ్యప్రాచ్యంలో నీటి భద్రత, ఆహార కొరత

గల్ఫ్ దేశాలు (GCC) తమ ఆహార అవసరాల కోసం ప్ర‌ధానంగా దిగుమ‌తుల‌పైనే ఆధ‌ర‌ప‌డుతాయి. ఇవి 70 శాతానికిపైగా హ‌ర్ముజ్ జలసంధి ద్వారానే జ‌రుగుతుంటాయి. హ‌ర్మూజ్‌ మూసివేతతో ఆయా ప్రాంతాల్లో నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగి తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. అదేవిధంగా ఇరాన్ జరిపిన ఎదురు దాడుల్లో ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లోని సముద్రపు నీటిని శుద్ధి చేసే (Desalination) ప్లాంట్లు దెబ్బతిన్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా దేశాల్లో తాగునీటి భద్రతకు ముప్పు వాటిల్లింది.

సెమీకండక్టర్లు, చిప్‌ల‌ కొరత

యుద్ధ ప్రభావంతో రసాయనాలు, ఎరువులతో పాటు ఎలక్ట్రానిక్ రంగానికి అవసరమైన సెమీకండక్టర్లు, చిప్‌ల‌ సరఫరా నిలిచిపోయింది. విమాన ఇంధన (Jet Fuel) ధరలు రెట్టింపు కావడం, మధ్యప్రాచ్య వైమానిక మార్గాలు మూతపడటంతో అంతర్జాతీయంగా విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగి, ప్రయాణికుల డిమాండ్ తగ్గింది. చాలా విమానయాన సంస్థ‌లు త‌మ స‌ర్వీసుల‌ను పెద్ద సంఖ్య‌లో ర‌ద్దు చేసుకున్నాయి. దూరా భారం పెర‌గ‌డంతో ఆ ఖ‌ర్చును ప్ర‌యాణికుల‌పైనే మోపాయి.

భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై..

అమెరికా, ఇరాన్ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన సవాళ్లను సృష్టించింది. ప్ర‌ధానంగా హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని మూసివేయ‌డంతో మార్కెట్లు, ద్రవ్యోల్బణం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఇంధ‌న కొర‌త తీవ్రం ప్ర‌భావం చూపింది. గ్యాస్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో సిలిండ‌ర్ల ధ‌ర‌లు భారీగా పెరిగాయి.

ఇంధన బిల్లు, కరెంట్ ఖాతా లోటు

భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్న‌ది. యుద్ధకాలంలో ముడిచ‌మురు బ్యారెల్‌కు 120 నుంచి 125 అమెరికా డాల‌ర్ల‌కు చేరడంతో దేశ వార్షిక చమురు దిగుమతి బిల్లుపై విపరీతమైన భారం పడింది. పెద్ద‌మొత్తంలో చెల్లించాల్సి రావ‌డంతో క‌రెంటు ఖాతా లోటు ఏర్ప‌డింది.

దేశీయ ఇంధన ధరలు

యుద్ధం ప్రారంభమైన త‌ర్వాత‌ దేశంలో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ లీటరుకు దాదాపు రూ.7.5 నుంచి రూ.8 వరకు వాహ‌న‌దారుల‌పై భారం ప‌డింది. చమురు కంపెనీలు భారీగా న‌ష్ట‌పోయాయి.

రూపాయి క్షీణత, ద్రవ్యోల్బణం

యుద్ధం వ‌ల్ల‌ విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి సురక్షితమైన అమెరికా డాలర్ వైపు మళ్లారు. దీంతో రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూ.92 మార్కును దాటి రూ.97కి చేరువైంది. రిస్క్-ఆఫ్ సెంటిమెంట్ కారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) కేవలం రెండు రోజుల్లోనే రూ.11,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించ‌డంతో మార్కెట్లు కుప్ప‌కూలాయి. యుద్ధంతో సరఫరా చైన్ దెబ్బ‌తిన‌డం, ఎరువులు, ఎల్‌ఎన్‌జి (LNG) కొరత కారణంగా ఆర్‌బీఐ (RBI) 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ (GDP) వృద్ధి అంచనాను 6.9 శాతానికి తగ్గించింది.

Advertisement
Advertisement