త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amarnath | ప్రకృతి ప్రభావమా.. మానవ తప్పిదమా..?

Amarnath | ఓ వైపు అమర్‌నాథ్‌కు భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. మరోవైపు పవిత్ర మంచు లింగం వేగంగా కరుగడం ఆందోళనకు గురి చేస్తోంది. యాత్ర మొదలైన కొద్దిరోజుల్లోనే సహజ మంచు లింగం కొద్ది రోజుల్లోనే పరిమాణం తగ్గిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం మారుతున్న వాతావరణ పరిస్థితులా? లేక పెరుగుతున్న మానవ కార్యకలాపాల ప్రభావమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

P

National | Published On Jul 10, 2026, 10.15 am IST

Amarnath | ప్రకృతి ప్రభావమా.. మానవ తప్పిదమా..?
Advertisement
  • అమర్‌నాథ్‌లో కరుగుతున్న మంచులింగం!
  • భారీగా పెరిగిన భక్తుల తాకిడి
  • మౌలిక సదుపాయాలపై ఒత్తిడి తెస్తున్న భక్తులు
  • మానవ సంచారంతో పెరుగుతున్న వేడి
  • హిమాయలయాల్లో వాతావరణ మార్పులు
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలంటున్న నిపుణులు

Amarnath | ఓ వైపు అమర్‌నాథ్‌కు భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. మరోవైపు పవిత్ర మంచు లింగం వేగంగా కరుగడం ఆందోళనకు గురి చేస్తోంది. యాత్ర మొదలైన కొద్దిరోజుల్లోనే సహజ మంచు లింగం కొద్ది రోజుల్లోనే పరిమాణం తగ్గిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం మారుతున్న వాతావరణ పరిస్థితులా? లేక పెరుగుతున్న మానవ కార్యకలాపాల ప్రభావమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంచు లింగం దాదాపుగా 90శాతం వరకు కరిగిపోయిందని పలువురు జర్నలిస్టులు, భక్తులు తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు స్పందించలేదు. మంచు లింగం కరగడంపై పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) నేత ఇల్తిజా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. యాత్ర నిర్వహణ, పర్యావరణ ప్రభావాలపై ప్రశ్నలు లేవనెత్తారు. రోజువారీ భక్తుల సంఖ్యపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

తొలి నాలుగు రోజుల్లోనే 93వేల మంది..

2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. యాత్ర ప్రారంభమైన తొలి నాలుగు రోజుల్లోనే దాదాపు 93 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెండో రోజే 20వేల మందికిపైగా బాబా బర్ఫానీని దర్శనం చేసుకున్నారు. గత కొన్నేళ్లలో భక్తుల సంఖ్య ఇదే అత్యధిక సంఖ్య అధికారులు వెల్లడించారు. అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) రోజుకు పహల్గామ్‌, బల్తాల్‌ మార్గాల్లో 10వేల మంది భక్తులకు పరిమితి విధించింది. అయితే, రిజిస్ట్రేషన లేకుండా, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు లేకుండా వేలాది మంది భక్తులు వచ్చి ఒత్తిడి పెంచుతున్నట్లుగా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లింగం కరగడానికి కారణాలు ఏంటీ?

సముద్రమట్టానికి సుమారు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ గుహ ఉంటుంది. ఇక్కడ సహజంగా ఏర్పడే మంచు లింగం పరిమాణం ప్రతి ఏడాది వాతావరణ పరిస్థితుల ఆధారంగా మారుతూ ఉంటుంది. మంచు కురిసే స్థాయి, గుహలో ఉష్ణోగ్రత, తేమ వంటి అంశాలు దాని ఏర్పాటుపై ప్రభావం చూపుతాయి. అయితే, ఇటీవలి కాలంలో హిమాలయ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు మంచు లింగం త్వరగా కరగడానికి కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. 2018, 2020, 2022, 2024 సంవత్సరాల్లోనూ యాత్ర పూర్తయ్యేలోపే మంచు లింగం పరిమాణం తగ్గింది. అయితే, అమర్‌నాథ్‌ మార్గంలో గత రెండు దశాబ్దాల్లో మౌలిక సదుపాయాలు భారీగా పెరిగాయి. రహదారుల విస్తరణ, తాత్కాలిక వసతులు, లంగర్‌ సెంటర్స్‌, విద్యుత్‌ సదుపాయాలు వంటి అభివృద్ధి పనులు మెరుగయ్యాయి. అయితే, హిమాలయాల వంటి సున్నితమైన ప్రాంతాల్లో పెరుగుతున్న మానవ కార్యకలాపాలు గుహలోని సూక్ష్మ వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచు లింగం త్వరగా కరగడానికి వాతావరణ మార్పులే ఏకైక కారణమని ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయంగా రుజువు కాలేదు. అయితే, భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో యాత్ర సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత అవసరమనే చర్చ మాత్రం మరోసారి మొదలైంది. పవిత్ర స్థలాన్ని పరిరక్షించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు స్వతంత్ర శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని పలువురు నాయకులు, నిపుణులు కోరుతున్నారు.

గతంలో ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు..

సున్నితమైన హిమాలయ ప్రాంతంలో జరిగే అమర్‌నాథ్‌ యాత్ర నిర్వహణపై సుప్రీంకోర్టు గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. భక్తుల భద్రత, మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా 2012లో యాత్ర సమయంలో పెద్ద సంఖ్యలో భక్తుల మృతులపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఎత్తైన పర్వత ప్రాంతంలో అత్యవసర వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లను మెరుగుపరచాలని పేర్కొంది. అలాగే యాత్ర మార్గాల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల రద్దీని నియంత్రించాలని, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించింది. ఆ తర్వాత యాత్ర నిర్వహణలో రిజిస్ట్రేషన్‌, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు, భక్తుల సంఖ్య నియంత్రణ వంటి విధానాలు అమల్లోకి వచ్చాయి.

Advertisement
Advertisement