త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Big Bash League | భారత్‌లోకి బిగ్‌ బాష్‌ లీగ్‌

Big Bash League | ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మార్కెట్‌గా గుర్తింపు పొందిన భారత్‌లోకి ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక టీ20 టోర్నీ బిగ్‌ బాష్‌ లీగ్‌ (BBL) అడుగుపెట్టనుంది. విదేశీ క్రికెట్‌ లీగ్‌ భారత్‌లో మ్యాచ్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ చారిత్రక నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ అధికారికంగా ప్రకటించారు.

P

Sports | Published On Jul 10, 2026, 8.42 am IST

Big Bash League | భారత్‌లోకి బిగ్‌ బాష్‌ లీగ్‌
Advertisement
  • చెన్నై వేదికగా తొలి మ్యాచ్‌
  • చరిత్ర సృష్టించనున్న ఆస్ట్రేలియా టీ20 టోర్నీ
  • ప్రకటించిన ప్రధాని మోదీ- ఆంథోనీ అల్బనిస్‌

Big Bash League | ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మార్కెట్‌గా గుర్తింపు పొందిన భారత్‌లోకి ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక టీ20 టోర్నీ బిగ్‌ బాష్‌ లీగ్‌ (BBL) అడుగుపెట్టనుంది. విదేశీ క్రికెట్‌ లీగ్‌ భారత్‌లో మ్యాచ్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ చారిత్రక నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ అధికారికంగా ప్రకటించారు. బిగ్‌ బాష్‌ లీగ్‌ 16వ సీజన్‌కు డిసెంబర్‌ 12న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక కానుంది. తొలి మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పెర్త్‌ స్కార్చర్స్‌తో తలపడనుంది. సుమారు 38 వేల మంది సామర్థ్యం ఉన్న చెపాక్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది. భారత్‌లో జరుగనున్న వారంరోజుల ‘ఆస్ట్రేలియన్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌’లో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ప్రపంచ క్రికెట్‌లో అతిపెద్ద ప్రేక్షకాదరణ కలిగిన భారత్‌లో బీబీఎల్‌ను నిర్వహించడం ద్వారా లీగ్‌కు మరింత గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల సంఖ్య పెరుగుతుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా భావిస్తోంది.

రెండు దేశాల బంధానికి క్రికెట్‌ వారధి

ఈ నిర్ణయం భారత్‌, ఆస్ట్రేలియా మధ్య క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని బిగ్‌ బాష్‌ లీగ్స్‌ జనరల్‌ మేనేజర్‌ అలిస్టెయిర్‌ డాబ్సన్‌ అన్నారు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ బీబీఎల్‌కు ఎప్పటి నుంచో ప్రత్యేక బలమని పేర్కొన్నారు. ‘భారత్‌లో మా ఆటకు సహజంగానే బలమైన అనుబంధం ఉంది. ఇరు దేశాల ప్రభుత్వాలు కలిసి చేపట్టిన కీలక కార్యక్రమంలో భాగంగానే ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నాం. క్రికెట్‌ రెండు దేశాల ప్రజలను మరింత దగ్గర చేసే వేదిక. ఆస్ట్రేలియాలోని ఏ దేశీయ క్రీడా లీగ్‌ చరిత్రలోనూ అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌గా ఇది నిలుస్తుందని ఆశిస్తున్నాం’ అని డాబ్సన్‌ తెలిపారు. ఆస్ట్రేలియాలో బిగ్‌ బాష్‌ లీగ్‌కు ఉన్న అంతర్జాతీయ ఆదరణను చాలామంది తక్కువ అంచనా వేస్తారని, ముఖ్యంగా భారత్‌లో ఈ లీగ్‌కు విశేషమైన అభిమానులు ఉన్నారని చెప్పారు. భారత్‌లో మ్యాచులు నిర్వహించడం వల్ల బీబీఎల్‌తో పాటు పాల్గొనే జట్లకు కూడా మరింత ఆదరణ లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చెన్నైనే ఎందుకు?

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌తో సంప్రదించిన తర్వాతే చెన్నైని ఎంపిక చేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది. క్రికెట్‌కు చెన్నైలో ఉన్న అపార ఆదరణ, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఉన్న భారీ అభిమానగణం దృష్ట్యా ఈ చారిత్రక మ్యాచ్‌కు చెపాక్‌ను అత్యుత్తమ వేదికగా నిర్ణయించినట్లు తెలిపింది. భారత్‌లో బిగ్‌ బాష్‌ లీగ్‌ నిర్వహణతో ఈ టోర్నీకి కొత్త గుర్తింపు లభించడమే కాకుండా, భవిష్యత్తులో భారత్‌–ఆస్ట్రేలియా మధ్య క్రీడా సహకారం మరింత బలోపేతం అవుతుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆశాభావం వ్యక్తం చేసింది. డిసెంబర్‌ 12న మధ్యాహ్నం జరిగే ఈ మ్యాచ్‌ను భారత్‌లో ‘జియోస్టార్‌’ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. ఆస్ట్రేలియాలో ‘చానెల్‌ సెవెన్‌, 7 ప్లస్‌, కాయో స్పోర్ట్స్‌, ఫాక్స్‌ క్రికెట్‌’ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

Advertisement
Advertisement