త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HD Deve Gowda Strong Counter to Kharge | “కాంగ్రెస్‌తో నాది బలవంతపు పెళ్లి.. అది ఒక దుర్భరమైన బంధం”: ఖర్గే కామెంట్లకు దేవెగౌడ స్ట్రాంగ్ కౌంటర్

కాంగ్రెస్ పార్టీతో తన పొత్తును 'బలవంతపు వివాహం'గా, 'దుర్భరమైన బంధం'గా అభివర్ణిస్తూ మాజీ ప్రధాని హెచ్.డి దేవెగౌడ సంచలన లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ఆయన దీటుగా బదులిచ్చారు.

J

National | Published On Mar 18, 2026, 7.57 pm IST

HD Deve Gowda Strong Counter to Kharge | “కాంగ్రెస్‌తో నాది బలవంతపు పెళ్లి.. అది ఒక దుర్భరమైన బంధం”: ఖర్గే కామెంట్లకు దేవెగౌడ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement

HD Deve Gowda Strong Counter to Kharge | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటక రాజకీయాల్లో 'పెళ్లి, విడాకులు' సెగలు రేపుతున్నాయి. బీజేపీ, జేడీఎస్ (JD-S) పొత్తును ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్.డి దేవెగౌడ (H.D. Deve Gowda) ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌తో తనది ‘బలవంతపు పెళ్లి’ అని, అది ఒక ‘దుర్భరమైన బంధం (Abusive Relationship)’ కాబట్టే విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు దేవెగౌడ బుధవారం ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.

అసలేం జరిగిందంటే

పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. దేవెగౌడను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "దేవెగౌడ గారు కాంగ్రెస్ పార్టీని ప్రేమించారు, కానీ చివరకు మోదీని (బీజేపీని) పెళ్లి చేసుకున్నారు. ఆయన ఎందుకు అలా చేశారో నాకైతే తెలియదు" అంటూ ఛలోక్తులు విసిరారు. ఉగాది వేడుకల నిమిత్తం బెంగళూరు వెళ్లిన దేవెగౌడ.. ఆ సమయంలో సభలో లేరు. ఖర్గే వ్యాఖ్యల గురించి తెలుసుకున్న ఆయన వెంటనే ఒక లేఖ ద్వారా తనదైన శైలిలో దీటుగా బదులిచ్చారు.

నాది బలవంతపు పెళ్లి.. అందుకే విడాకులు

"నా చిరకాల మిత్రుడు మల్లికార్జున ఖర్గే సభలో నా గురించి సరదాగా మాట్లాడారు. ఆయన ఉపయోగించిన అదే 'పెళ్లి' భాషలో నేను కూడా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీతో నాది 'బలవంతపు పెళ్లి'. అదొక దుర్భరమైన బంధం (అబ్యూజివ్ రిలేషన్‌షిప్). అందుకే నేను ఆ పార్టీకి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది" అని దేవెగౌడ తన లేఖలో పేర్కొన్నారు.

అప్పుడు ఖర్గేను సీఎం చేయమన్నాను

2018 కర్ణాటక ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను దేవెగౌడ ఈ సందర్భంగా గుర్తు చేశారు. "2018లో కాంగ్రెస్ పార్టీ గులాం నబీ ఆజాద్‌ను పంపి కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది. దీనికి నేను అంగీకరించలేదు. మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలని అందరి సమక్షంలో నేను చెప్పాను. అక్కడ సిద్ధరామయ్య కూడా ఉన్నారు. కానీ ఆజాద్ మాత్రం కుమారస్వామి నాయకత్వం వైపే మొగ్గుచూపారు" అని ఆయన వెల్లడించారు.

అలాగే కాంగ్రెస్ తీరును ఎండగడుతూ.. "ఇంత తతంగం, పెళ్లి జరిగాక 2019లో వాళ్లు ఏం చేశారు? మమ్మల్ని వదిలించుకున్నారు. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించారు? వారిని అటు పంపింది ఎవరో ఇప్పుడు అందరికీ తెలుసు. ఆనాడు ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తిపై కాంగ్రెస్ చర్యలు తీసుకుని ఉంటే, ఈరోజు నా మిత్రుడు ఖర్గే ఏఐసీసీ ప్రెసిడెంట్‌గా ఇంకా మెరుగైన స్థితిలో ఉండేవారు" అని దేవెగౌడ వ్యాఖ్యానించారు.

వారే నన్ను వదిలేశారు

చివరగా, తాను కాంగ్రెస్ కూటమిని విడిచిపెట్టలేదని దేవెగౌడ స్పష్టం చేశారు. "కాంగ్రెస్ నాయకులే నన్ను వదిలేసి వెళ్లిపోయారు. వాళ్లకు విడాకులు ఇచ్చి, ఒక స్థిరమైన కూటమిని ఎంచుకోవడం తప్ప నాకు వేరే దారి లేకుండా చేశారు" అని దేవెగౌడ తన లేఖలో స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేవెగౌడ రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

https://x.com/ANI/status/2034255514868367830

 

Advertisement

తాజావార్తలు

Advertisement