త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala CM | కౌన్‌ బనేగా కేరళ సీఎం.. సీనియర్‌ నేతలకు కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు..!

Kerala CM | ఇటీవల కేరళ అసెంబ్లీకి జరిగిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఘన విజయం సాధించింది. ఫలితాలు వచ్చి వారం రోజులైనా సీఎం ఎవరు అన్నదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. ఈ మే 4న ఎన్నికలు ఫలితాలు వచ్చినా ఇప్పటికీ శాసనసభాపక్ష నేత పేరును పార్టీ అధిష్టానం ఇంకా తేల్చలేదు.

P

National | Published On May 12, 2026, 6.49 am IST

Kerala CM | కౌన్‌ బనేగా కేరళ సీఎం.. సీనియర్‌ నేతలకు కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు..!
Advertisement

Kerala CM | ఇటీవల కేరళ అసెంబ్లీకి జరిగిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఘన విజయం సాధించింది. ఫలితాలు వచ్చి వారం రోజులైనా సీఎం ఎవరు అన్నదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. ఈ మే 4న ఎన్నికలు ఫలితాలు వచ్చినా ఇప్పటికీ శాసనసభాపక్ష నేత పేరును పార్టీ అధిష్టానం ఇంకా తేల్చలేదు. ముఖ్యమంత్రి పీఠంపై పలువురు నేతలు ఆసక్తి చూపుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు, సీఎం ఎంపికపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం కేరళకు చెందిన పలువురు సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిచింది. మాజీ కేపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేగా ఎన్నికైన కే మురళీధరన్‌ను ఏఐసీసీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది.

అధిష్టానంపై నేతల ఒత్తిడి..

సీఎం ఎంపికపై 48 గంటల్లో స్పష్టత వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మురళీధరన్‌తో పాటు కేపీసీసీ ఉపాధ్యక్షుడు ఏపీ అనిల్‌కుమార్‌, షఫీ పరంబిల్‌, పీసీ విష్ణునాథ్‌తో పాటు పలువురు నేతలను ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే బెంగళూరు పర్యటనను మధ్యలోనే ముగించుకొని ఢిల్లీకి చేరున్నారు. కేరళ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత కేరళ అసెంబ్లీ గడువు మే 23తో ముగియనుండడంతో అధిష్ఠానంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం సీఎం పదవికి ముగ్గురు సీనియర్ నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాజీ ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితాల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ముగ్గురు నేతలతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇప్పటికే ఢిల్లీలో విస్తృత చర్చలు నిర్వహించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీ, వీడీ సతీశన్‌, వేణుగోపాల్‌, చెన్నితాలతో పాటు కేసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌, కేరళ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షిలతో భేటీ అయ్యారు.

సతీశన్‌ వైపే కేరళ నేతల మొగ్గు..

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఎక్కువ మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేణుగోపాల్‌ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రజల్లో ఎక్కువ ఆదరణ సతీశన్‌కే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం ఎంపికలో జాప్యంపై చెన్నితాల స్పందించారు. ఇది పార్టీ అంతర్గత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమేనని వ్యాఖ్యానించారు. అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా కాంగ్రెస్‌, యూడీఎఫ్‌ కార్యకర్తలు అంగీకరిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీ సమావేశాల అనంతరం కేరళ కాంగ్రెస్‌ నేతలు, దీపాదాస్‌మున్షీ సంయుక్తంగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సీఎం అభ్యర్థులకు మద్దతుగా ఎలాంటి ప్రదర్శనలు చేయొద్దని సూచించారు. యూడీఎఫ్‌ ఘన విజయం సాధించినప్పటికీ సీఎం ఎంపికలో జాప్యం మిత్రపక్షాల్లో కొంత అసహనానికి దారితీసినట్లు సమాచారం. 140 సభ్యుల కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్‌ 102 స్థానాలు గెలుచుకుని రెండు మూడొంతుల మెజార్టీ సాధించింది. కాంగ్రెస్‌ 63 స్థానాలు దక్కించుకోగా, ఇండియన్‌ ముస్లిం లీగ్‌ 22, కేరళ కాంగ్రెస్‌ ఎనిమిది, రివల్యుషనరీ సోషలిస్ట్‌ పార్టీ మూడు స్థానాల్లో గెలిచాయి. అధికార పంపకాల చర్చల్లో మిత్రపక్షాల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. పదవుల పంపకం విషయంలో సమ ప్రధాన్యం ఉండాలని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement