త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bihar by elections | ఉప ఎన్నికల్లో బీజేపీకి కుదుపు.. 3 సీట్లలో రెండింట్లో ఓటమి

Bihar by elections | ఒకే ఒక్క సీటు. ముఖ్యమంత్రి రంగంలోకి దిగాడు. ఎన్నిక ముగిసే వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అక్కడే తిష్ట వేశాడు. 27 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ ప్రచారంలో పాల్గొన్నా.. 9 నెలల కిందట 50 వేల మెజారిటీతో గెలుపొందిన సీటును.. ఉప ఎన్నికలో కోల్పోయారు. బీహార్‌లోని బాంకీపూర్ శాసనసభ నియోజకవర్గంలో జన సురాజ్ పార్టీ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేతిలో బీజేపీ ఓడిపోయింది.

S

National | Published On Aug 3, 2026, 7.20 pm IST

Bihar by elections | ఉప ఎన్నికల్లో బీజేపీకి కుదుపు.. 3 సీట్లలో రెండింట్లో ఓటమి
Advertisement
  • బాంకీపూర్‌లో బీజేపీని ఓడించిన పీకే
  • ఎంపీలో చెమటోడ్చినా గెలుపు దక్కించుకోలేని కాషాయ దళం
  • గుజరాత్‌లో లక్ష నుంచి 30వేలకు పడిపోయిన బీజేపీ మెజారిటీ
  • ఓటమికి హేతువులైన జెన్ జీ.. అసమ్మతి.. వ్యతిరేకత

త్రినేత్ర.న్యూస్ : ఒకే ఒక్క సీటు. ముఖ్యమంత్రి రంగంలోకి దిగాడు. ఎన్నిక ముగిసే వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అక్కడే తిష్ట వేశాడు. 27 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ ప్రచారంలో పాల్గొన్నా.. 9 నెలల కిందట 50 వేల మెజారిటీతో గెలుపొందిన సీటును.. ఉప ఎన్నికలో కోల్పోయారు. బీహార్‌లోని బాంకీపూర్ శాసనసభ నియోజకవర్గంలో జన సురాజ్ పార్టీ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేతిలో బీజేపీ ఓడిపోయింది. తన సీటును తిరిగి దక్కించుకోలేకపోయింది. మరోవైపు మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ.. అక్కడ దతియా నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గుజరాత్‌లోని మాంజల్ పూర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినా.. మెజారిటీ లక్ష (2022 ఎన్నిక) నుంచి 30వేలకే పరిమితమైంది.

కంచుకోటను బద్దలు కొట్టి..

31 రౌండ్ల పాటు ఉత్కంఠభరితంగా సాగిన బాంకీపూర్ ఓట్ల కౌంటింగ్‌లో తొలి రౌండ్ నుంచే ప్రశాంత్ కిశోర్ ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చారు. దాదాపు 20వేల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై విజయం సాధించారు. 1995 నుంచి బాంకీపూర్‌లో బీజేపీయే విజయం సాధిస్తూ వచ్చింది. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో విజయం సాధించారు.రాజ్యసభ సభ్యుడిగా కొనసాగేందుకు వీలుగా నితిన్.. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాంకీపూర్ నియోజకవర్గానికి రాజీనామా సమర్పించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, గత నవంబర్ లో బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనా.. ప్రశాంత్ కిశోర్.. క్షేత్రస్థాయిలో జనం మధ్యనే తిరుగుతూ శ్రమిస్తూ వచ్చారు. నితిన్ రాజీనామాతో ఉప ఎన్నిక రావడంతో ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగారు. బీజేపీ కంచుకోట బాంకీపూర్‌లో బీజేపీ ని ఓడించి రాజకీయ అంచనాలను తలకిందులు చేశారు.

ఎంపీలో అంచనాలు తలకిందులు

మధ్యప్రదేశ్‌లోని దతియా నియోజకవర్గాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2023లో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర భారతి దతియా నుంచి గెలిచారు. అప్పుడు బీజేపీ నుంచి నరోత్తమ్ మిశ్రా పోటీ చేశారు. కాగా, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఓ కేసులో ఢిల్లీ కోర్టు ..ఆయనకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి నేరపూరిత చరిత్రనే ప్రచార అంశంగా మలుచుకొని ఆరునూరైనా గెలిచేందుకు బీజేపీ విపరీతంగా శ్రమించింది. అదే సమయంలో తన సీటును తాను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ కూడా బాగా కష్టపడింది. బీ ఫామ్ ఇచ్చే సమయానికి సీనియర్ అభ్యర్థి అయిన నరోత్తమ్ మిశ్రాను పక్కన పెట్టి బీజేపీ అధిష్టానం.. అశుతోశ్ తివారీకీ టికెట్ ఇచ్చింది. దీంతో నరోత్తమ్ 3వేల మంది అనుచరులతో జాతీయ రహదారిని 12 గంటల పాటు దిగ్బంధించి అధిష్టానాన్ని కలవరపరచారు. ఈ నేపథ్యంలో.. స్థానికంగా రేగిన అసమ్మతి జ్వాలను కాషాయ దళం ఆర్పలేకపోయింది. చివరికి 6వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్ శ్యామ్ సింగ్ విజయం సాధించారు.

లక్ష నుంచి 30 వేలకు పడిపోయిన మెజారిటీ

గుజరాత్ నుంచి మాంజల్ పూర్ నియోజకవర్గం బీజేపీకి పెట్టని కోట. ఇక్కడ బీజేపీ అభ్యర్థి యోగేశ్ పటేల్ 2012, 2017, 2022 లో వరుసగా గెలుస్తూ వచ్చారు. 2022 లో ఏకంగా లక్ష ఓట్ల మెజారిటీని సాధించారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో యోగేశ్ మరణించారు. అయితే.. బీజేపీ నుంచి నిలబడిన సత్యేంద్ర భాయ్ పటేల్‌కు కేవలం 55,481 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి భికాభాయి రబారీపై 30వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మాంజల్ పూర్‌లో ఇంత భారీగా మెజారిటీ పడిపోవడంపై కాషాయ దళం విశ్లేషించుకునే పనిలో పడింది..

జెన్ జీ.. అసమ్మతి.. వ్యతిరేకత

బీహార్, మధ్యప్రదేశ్‌లతో పాటు కేంద్రంలోనూ బీజేపీ సర్కారే అధికారంలో ఉన్నా.. ప్రతిష్టాత్మకమైన బాంకీపూర్, దతియా నియోజకవర్గాల్లో ఓడిపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. జెన్ జీ ఉద్యమంతో విద్యార్థుల్లో సర్కారుపై పెట్రేగిన వ్యతిరేకత, బీహార్ సీఎం ఓ హంతకుడంటూ.. ప్రశాంత్ కిశోర్ క్షేత్రస్థాయిలో చేసిన ప్రచారం.. మధ్యప్రదేశ్‌లో పార్టీలో నెలకొన్న అసమ్మతి.. వంటి కారణలతో బీజేపీ ఓటమి పాలైనట్లు భావిస్తున్నారు. కాగా గుజరాత్‌లోని మాంజల్ పూర్‌లో వ్యతిరేకత కారణంగానే మెజారిటీ తగ్గినట్టు విశ్లేషిస్తున్నారు.

Advertisement
Advertisement