త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PRLIS | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి

PRLIS | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు సాగునీరు అందించాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగాలని, పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన బాధ్యతను నెరవేర్చుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన పాలమూరు డెవలప్‌మెంట్‌ ఫోరం సమావేశంలో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

P

Telangana | Published On Aug 3, 2026, 5.54 pm IST

PRLIS | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి
Advertisement
  • సొంత జిల్లా బిడ్డగా సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
  • మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్‌
  • పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టం చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు

PRLIS | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు సాగునీరు అందించాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగాలని, పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన బాధ్యతను నెరవేర్చుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన పాలమూరు డెవలప్‌మెంట్‌ ఫోరం సమావేశంలో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సాగునీరు, విద్య, ఉపాధి అవకాశాలపై చర్చించారు. ‘పక్కనే నదులు ప్రవహిస్తున్నా తాగడానికి నీరు లేని పరిస్థితి పాలమూరు జిల్లాది. పొలాలకు నీరు లేక వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది’ అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో వెనుకబాటుతనమే జిల్లా అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. దేశంలోనే ప్రత్యేకంగా ఒక జిల్లా అభివృద్ధి కోసం ఎన్నారైలు ఫోరం ఏర్పాటు చేసుకోవడం అరుదైన విషయమని, పాలమూరు డెవలప్‌మెంట్‌ ఫోరం రెండు దశాబ్దాలుగా చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. రైతు కుటుంబాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన పలువురు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికీ అభివృద్ధిలో వెనుకంజ..

తెలంగాణ ఏర్పాటైన తర్వాత జిల్లాలో పాఠశాలల అభివృద్ధి, తాగునీటి వసతులు, విద్యుత్‌ సౌకర్యాలు, మెడికల్‌ కాలేజీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 40 లక్షలకుపైగా జనాభా ఉన్న పాలమూరు జిల్లా ఇప్పటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే అదనంగా 5 నుంచి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేదంటే భవిష్యత్తులో ఉన్న ప్రాజెక్టులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లా అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దాం

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాలమూరు అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఒకప్పుడు పాలమూరు వెనుకబాటుతనాన్ని చూపించి రాష్ట్రానికి నిధులు, అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉండేదని అన్నారు. పాలమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై కేసులు వేయడం వల్ల పనులు ఆలస్యమయ్యాయని, అవి లేకుంటే ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేదని పేర్కొన్నారు. పాలమూరు డెవలప్‌మెంట్‌ ఫోరం చేస్తున్న కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు. అమెరికాలో స్థిరపడిన సుమారు 5వేల మంది పాలమూరు ఎన్నారైలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లా అభివృద్ధికి సూచనలు, ప్రతిపాదనలు తీసుకోవాలని కోరారు.

వలసలు తగ్గాలంటే సాగునీరు, విద్య కీలకం

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు వెనుకబాటుతనం తొలగించేందుకు భవిష్యత్తులోనూ ఎన్నారైల సహకారం అవసరమన్నారు. విద్య, సాగునీరు జిల్లా అభివృద్ధికి రెండు కళ్ల వంటివని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డగా వ్యవహరించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో వలసలు పూర్తిగా తగ్గాలంటే మొత్తం 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డిలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జిల్లా అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని, ‘మన ఊరు–మన బడి’ వంటి పథకాలను కొనసాగించాలని కోరారు.

కొత్తగా అమెరికా వచ్చే విద్యార్థులకు అండగా నిలవాలి

నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ అమెరికాకు కొత్తగా వచ్చే పాలమూరు విద్యార్థులకు డెవలప్‌మెంట్‌ ఫోరం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎన్నారైల సమావేశాలకు తమ పార్టీ తరఫున ఎప్పుడూ హాజరవుతామని తెలిపారు. పాలమూరు డెవలప్‌మెంట్‌ ఫోరం 20 ఏళ్లుగా చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధి రామచంద్రరెడ్డికి జరిగిన సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి ఎన్నారైల సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement