త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medical Tests | 40 ఏళ్లు దాటిన పురుషులు క‌చ్చితంగా చేయించుకోవాల్సిన వైద్య ప‌రీక్ష‌లు ఇవే..!

Medical Tests | సాధార‌ణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత పురుషుల ఆరోగ్యంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ వయస్సు నుంచి శరీరంలోని జీవక్రియల్లో త‌గ్గుద‌ల ప్రారంభం అవ‌డంతో పాటు, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా క్రమంగా పెరుగుతుంది.

S

Lifestyle | Published On Jan 25, 2026, 11.35 am IST

Medical Tests | 40 ఏళ్లు దాటిన పురుషులు క‌చ్చితంగా చేయించుకోవాల్సిన వైద్య ప‌రీక్ష‌లు ఇవే..!
Advertisement

Medical Tests | సాధార‌ణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత పురుషుల ఆరోగ్యంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ వయస్సు నుంచి శరీరంలోని జీవక్రియల్లో త‌గ్గుద‌ల ప్రారంభం అవ‌డంతో పాటు, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా క్రమంగా పెరుగుతుంది. గుండె జబ్బులు, షుగర్, రక్తపోటు, ప్రోస్టేట్ సమస్యలు, కాలేయం, మూత్రపిండాల సంబంధిత వ్యాధులు ఈ దశలో ఎక్కువగా కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించుకోవచ్చని సూచిస్తున్నారు. సాధారణంగా పురుషులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే ధోరణి ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.

అధిక ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట్రాల్‌..

చిన్న లక్షణాలను పట్టించుకోకుండా వదిలేయడం, డాక్టర్‌ను సంప్రదించడాన్ని ఆలస్యం చేయడం వల్ల సమస్యలు తీవ్రరూపం దాల్చే అవకాశముంటుంది. అందుకే 40 ఏళ్లు దాటిన తర్వాత కొన్ని ముఖ్యమైన వైద్య పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి కేవలం ప్రస్తుత ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికే కాకుండా, భవిష్యత్తులో ఎదురయ్యే తీవ్ర అనారోగ్య‌ సమస్యలను నివారించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మొదట‌గా రక్తపోటు, కొలెస్ట్రాల్ పరీక్షలు అత్యంత అవసరం. 40 ఏళ్ల తర్వాత అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రధాన కారణాలుగా మారుతాయి. అందువల్ల ప్రతి ఏడాది రక్తపోటు పరీక్ష చేయించుకోవడం, మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. విలువలు సాధారణ స్థాయిని మించితే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

డ‌యాబెటిస్‌, ప్రోస్టేట్ ప‌రీక్ష‌లు..

ఇక రక్తంలో చక్కెర స్థాయిల‌ని తెలుసుకునే పరీక్షలు కూడా అత్యంత కీలకం. భారతదేశంలో డయాబెటిస్ వేగంగా పెరుగుతున్న వ్యాధిగా మారింది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత దీని ప్రమాదం మరింత పెరుగుతుంది. సాధారణ ఫాస్టింగ్ షుగర్ పరీక్షతో పాటు హెచ్‌బీఏ1సీ (HbA1c) టెస్ట్ చేయించుకోవడం ద్వారా గత మూడు నెలలుగా రక్తంలో చక్కెర స్థాయి ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. దీని ద్వారా షుగర్‌ను తొలిదశలోనే గుర్తించి నియంత్రించుకోవచ్చు. పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు కూడా ఈ వయస్సు తర్వాత ఎక్కువగా కనిపిస్తాయి. ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ గ్రంథి వృద్ధి (ప్రోస్టాటిక్ హైపర్‌ప్లేసియా) వంటి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు పీఎస్‌ఏ (PSA) పరీక్ష, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (DRE) వంటి పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రారంభ దశలో గుర్తిస్తే ఈ వ్యాధులకు చికిత్స సులభంగా సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

లివ‌ర్‌, కిడ్నీల టెస్టులు..

అలాగే కాలేయం, మూత్రపిండాల పనితీరును తెలుసుకునే పరీక్షలు కూడా 40 ఏళ్ల తర్వాత తప్పనిసరి. లివర్ ఫంక్షన్ టెస్టులు (LFT), కిడ్నీ ఫంక్షన్ టెస్టులు (KFT) ద్వారా ఈ అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది తెలుస్తుంది. కాలేయ ఎంజైముల స్థాయిలు, క్రియాటినిన్ వంటి విలువల ఆధారంగా ఫ్యాటీ లివర్, కిడ్నీ సమస్యల‌ను తొలిదశలోనే గుర్తించవచ్చు. సమయానికి చికిత్స తీసుకుంటే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. 40 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా పురుషులు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్న పరీక్షలే అయినా పెద్ద సమస్యలను ముందుగానే గుర్తించి అడ్డుకునేందుకు వీలు క‌లుగుతుంది. దీంతో ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటారు.

Advertisement

తాజావార్తలు

Advertisement