త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel-Iran War | యూఎస్, ఇరాన్ చర్చలపై నో క్లారిటీ.. యుద్ధం ముగుస్తుందా? లేదా?

లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం, హిజ్బుల్లా మధ్య కొనసాగుతున్న దాడులు దౌత్యపరమైన ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి దౌత్య మార్గాలు ఒత్తిడిలో ఉన్నప్పటికీ, పూర్తిగా మూసుకుపోలేదని కొందరు అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు.

J

International | Published On Apr 14, 2026, 6.14 pm IST

US-Israel-Iran War | యూఎస్, ఇరాన్ చర్చలపై నో క్లారిటీ.. యుద్ధం ముగుస్తుందా? లేదా?

సంక్షిప్త సారాంశం

యూఎస్- ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డ్ పడే అవకాశాలు ఉన్నాయా అనే దానిపై క్లారిటీ ఈ వారమే రానుంది. ఇరాన్ డీల్‌కి రెడీగా ఉందని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పదే పదే చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చూస్తే అలాంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు. భవిష్యత్తులో జరగబోయే చర్చలన్నీ ఇరాన్ మీదనే ఆధారపడి ఉన్నాయని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ పోర్టులను యూఎస్ నావికాదళం దిగ్బంధించిన విషయం తెలిసిందే. దీంతో గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈనేపథ్యంలో ఈ వారంలో మరోసారి పాకిస్థాన్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement
  • లెబనాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో ఇద్దరు మృతి
  • ఇరాన్ పోర్టులను దిగ్బంధించిన అమెరికా
  • భగ్గుమన్న ఆయిల్ ధరలు

US-Israel-Iran War | త్రినేత్ర.న్యూస్ : అమెరికా-ఇరాన్ సంబంధాలు మరింత క్షీణించాయి. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో నెలకొన్న సంక్షోభం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7:30 గంటల నుంచి ఇరాన్ పోర్టులను అమెరికా నావికాదళం పూర్తిగా దిగ్బంధించింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది.

ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

ఈ వ్యవహారంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని "చాలా బలంగా" కోరుకుంటోందని, చర్చల కోసం తగిన వ్యక్తుల ద్వారా తనను సంప్రదించిందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా నావికా దిగ్బంధాన్ని అడ్డుకునేందుకు ఇరాన్‌కు చెందిన ఏవైనా 'ఫాస్ట్ అటాక్ షిప్స్' వస్తే.. వాటిని తక్షణమే నాశనం చేస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు.

పాకిస్థాన్‌లో బెడిసికొట్టిన చర్చలు

తాజా దిగ్బంధానికి ముందు పాకిస్థాన్‌లో ఇరు దేశాల మధ్య జరిగిన తెరవెనుక చర్చలు (Backchannel talks) విఫలమయ్యాయి. ఈ వైఫల్యానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇరాన్ తన అణ్వస్త్ర ఆశయాలను విడనాడేందుకు నిరాకరించిందని అమెరికా ఆరోపించగా.. వాషింగ్టన్ మితిమీరిన డిమాండ్లు చేస్తోందని, మాట మారుస్తోందని ఇరాన్ మండిపడింది. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య అపనమ్మకాన్ని మరింత పెంచాయి.

వెనక్కి తగ్గేది లేదన్న ఇరాన్.. సైన్యం అప్రమత్తం

అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. సముద్ర మార్గాలపై ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమైన చర్య అని మండిపడింది. అమెరికా బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ నాయకత్వం స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో, ఇరాన్ సాయుధ దళాలను అత్యున్నత పోరాట స్థాయి (Maximum combat alert)లో ఉంచారు.

100 డాలర్లు దాటిన ఆయిల్ ధరలు

ఈ సంక్షోభం ప్రభావం అప్పుడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడటం మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోయి, బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ వాణిజ్య మార్గంలో స్వేచ్ఛా నౌకాయానాన్ని పునరుద్ధరించడానికి కృషి చేయాలని ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ యూనియన్ దేశాలు పిలుపునిచ్చాయి.

ఇజ్రాయెల్ - హిజ్బుల్లా దాడులు

మరోవైపు లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం, హిజ్బుల్లా మధ్య కొనసాగుతున్న దాడులు దౌత్యపరమైన ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి దౌత్య మార్గాలు ఒత్తిడిలో ఉన్నప్పటికీ, పూర్తిగా మూసుకుపోలేదని కొందరు అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు. వలసలు, యుద్ధ భయాలతో పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతోంది.

Advertisement
Advertisement