త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel-Iran War | ఇరాన్‌పై ఇక దాడులు చేయం.. ఐదు రోజుల పాటు వాయిదా వేసిన ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఈ సంక్షోభం భారత్‌కు కూడా సవాళ్లు విసురుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.

J

International | Published On Mar 23, 2026, 6.40 pm IST

US-Israel-Iran War | ఇరాన్‌పై ఇక దాడులు చేయం.. ఐదు రోజుల పాటు వాయిదా వేసిన ట్రంప్
Advertisement
  • పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక దాడులు నిలిపివేత
  • చల్లారుతున్న ఉద్రిక్తతలు
  • సంక్షోభంపై ప్రధాని మోదీ ఆందోళన

US-Israel-Iran War | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య గత మూడు వారాలుగా సాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, ఆ దేశ విద్యుత్ కేంద్రాలపై చేయాలనుకున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

5 రోజుల పాటు దాడుల నిలిపివేత

ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేయాలని రక్షణ శాఖను ఆదేశించినట్లు ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు రోజులుగా ఇరాన్‌తో "అత్యంత సానుకూల, నిర్మాణాత్మక చర్చలు" జరుగుతున్నాయని, పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే, 48 గంటల్లో హార్ముజ్ జలసంధిని తెరవకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శనివారం ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఆ వార్తలను ఖండించిన ఇరాన్

హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తోందన్న వార్తలను న్యూఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేసింది.

మరోవైపు, తమ తీర ప్రాంతాలు లేదా దీవులపై ఎవరైనా దాడికి దిగితే పెర్షియన్ గల్ఫ్ మొత్తాన్ని నావికా మైన్లతో దిగ్బంధిస్తామని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. అప్పుడు ఆ పరిణామాలకు బాధ్యత శత్రు దేశాలదే అవుతుందని స్పష్టం చేసింది. హార్ముజ్ దీవి సమీపంలో అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా కొట్టిపారేసింది. అదొక వదంతి అని తేల్చిచెప్పింది.

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ఆందోళన

పశ్చిమాసియా సంక్షోభంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో మాట్లాడారు. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారత్‌కు కూడా సవాళ్లను విసురుతోందని, ఈ వివాదానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని మోదీ తెలిపారు.

హార్ముజ్ జలసంధిలో భారత నౌకలు

తీవ్ర ఉద్రిక్తతల మధ్య, రెండు భారతీయ ఎల్‌పీజీ ట్యాంకర్లు (పైన్ గ్యాస్, జగ్ వసంత్) పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరి హార్ముజ్ జలసంధి గుండా భారత ఓడరేవుల వైపు వస్తున్నాయి. ప్రస్తుతం ఇవి ఇరాన్‌లోని లారక్, కేశ్మ్ దీవుల సమీపంలో ఉన్నట్లు షిప్ ట్రాకింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. పశ్చిమాసియా వైపు ఉన్న 22 భారతీయ నౌకల్లో ఆరు ఎల్‌పీజీ క్యారియర్లు కాగా, అందులో ఈ రెండు నౌకలు ఇప్పుడు భారత్ వైపు సురక్షితంగా పయనమయ్యాయి.

ఇరాన్‌లో పాలన మారాలన్న మాజీ యువరాజు

ట్రంప్ అనుసరిస్తున్న 'బలప్రయోగం ద్వారా శాంతి' వ్యూహాలకు ప్రవాసంలో ఉన్న ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లావి మద్దతు పలికారు. ఇరాన్ నాయకత్వం కేవలం బలప్రయోగానికే దారిలోకి వస్తుందని, వారి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించాలని డిమాండ్ చేశారు. అక్కడ పాలన మారితేనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, మధ్యప్రాచ్యంలో తాజా పరిస్థితులు, సముద్ర భద్రతపై దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి.. ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్‌లో చర్చించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement