త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sheikh Hasina | ఉరిశిక్ష వేసినా భయపడను.. ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్ హసీనా సంచలన ఇంటర్వ్యూ

మరణశిక్ష విధించినా భయపడేది లేదని, ఈ ఏడాదే బంగ్లాదేశ్‌లో అడుగుపెడతానని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలివే.

J

International | Published On Jun 28, 2026, 5.15 pm IST

Sheikh Hasina | ఉరిశిక్ష వేసినా భయపడను.. ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్ హసీనా సంచలన ఇంటర్వ్యూ
Advertisement
  • జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
  • తనపై మరణశిక్ష కత్తి వేలాడుతున్నా భయపడనని, ఈ ఏడాదే మాతృదేశానికి తిరిగి వెళ్తానని స్పష్టం
  • అవామీ లీగ్‌ పార్టీపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేయాలని, హిందువుల వంటి మైనారిటీల రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్
  • ప్రస్తుత మహ్మద్ యూనస్, బీఎన్‌పీ (BNP) ప్రభుత్వాల హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని, బంగ్లాదేశ్ ఒక 'విఫల దేశం'గా మారిందని విమర్శ

Sheikh Hasina | త్రినేత్ర.న్యూస్ : బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) మరోసారి సంచలన ప్రకటన చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఉరిశిక్ష పడే అవకాశం ఉందని తెలిసినా సరే.. ఈ ఏడాదే తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా పలు ఆసక్తికరమైన, కీలక విషయాలు పంచుకున్నారు.

మరణ భయం లేదు.. పదవి కోసం పాలిటిక్స్ చేయను

దేశం విడిచి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో.. తన రీఎంట్రీ గురించి అడిగిన ప్రశ్నకు హసీనా ధీమాగా బదులిచ్చారు. అమెరికన్ జనరల్ డగ్లస్ మాక్‌ ఆర్థర్ తరహాలో తాను కచ్చితంగా ఈ ఏడాదే మాతృదేశంలో అడుగుపెడతానని ప్రకటించారు. "నేను రాజకీయాలు చేసేది పవర్ కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం. నాకు మరణ భయం లేదు. 1975లోనే నా కుటుంబాన్ని మొత్తం కోల్పోయాను. నాపై గ్రెనేడ్ దాడులు కూడా జరిగాయి. నాపై వచ్చిన తీర్పులు న్యాయబద్ధమైనవి కావు.. అవన్నీ రాజకీయ కక్షసాధింపు చర్యలే" అని ఆమె కొట్టిపారేశారు.

మైనారిటీలపై దాడులు.. దేశానికే అవమానం

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు వంటి మైనారిటీల (Minorities) పై జరుగుతున్న దాడుల పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగస్టు 5 తర్వాత మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని.. దేవాలయాలు ధ్వంసమవుతున్నాయని అన్నారు. మైనారిటీల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడిన చిన్మయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) లాంటి వాళ్లపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టడం దారుణమన్నారు. మైనారిటీలు తమ సొంత దేశంలోనే బిక్కుబిక్కుమంటూ బతకాల్సి రావడం స్వతంత్ర బంగ్లాదేశ్‌కే తీరని అవమానం అని హసీనా విమర్శించారు.

అవామీ లీగ్‌ను ఎవరూ అంతం చేయలేరు

తమ పార్టీ అవామీ లీగ్ (Awami League) కేవలం కాగితాలకే పరిమితమైన సంస్థ కాదని.. అది ప్రజల నుంచి పుట్టుకొచ్చిన ఒక బలమైన ఫోర్స్ అని ఆమె అభివర్ణించారు. జూన్ 23న పార్టీ 77వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్న ఎంతో మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీపై ఉన్న బ్యాన్ ఎత్తివేయడం అనేది వాళ్లు చేసే దయ కాదని, అది తమ కనీస హక్కు అని స్పష్టం చేశారు. బీఎన్‌పీ (BNP) నాయకత్వంతో తాను ఎలాంటి బ్యాక్‌డోర్ చర్చలు (Backchannel discussions) జరపలేదని, రహస్య డీల్స్ ద్వారా తనకు న్యాయం అక్కర్లేదని హసీనా తేల్చి చెప్పారు.

విఫల దేశంగా బంగ్లాదేశ్!

తమ ప్రభుత్వ హయాంలో జీడీపీ వృద్ధి రేటు 7.25 శాతంగా ఉండేదని, పద్మా బ్రిడ్జ్, మెట్రో రైల్ లాంటి ప్రాజెక్టులతో బంగ్లాదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని హసీనా గుర్తు చేశారు. కానీ మహ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం.. ఎన్నికల పేరిట వచ్చిన బీఎన్‌పీ సర్కారు దేశాన్ని ఒక 'ఫెయిల్డ్ స్టేట్' (Failed state) మోడల్‌లోకి నెట్టేశాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన లేకుండా పోయిందని, దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే అది కేవలం అవామీ లీగ్‌తోనే సాధ్యమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సుదూర దేశంలో ఉన్నా.. తన మనసంతా బంగ్లాదేశ్ ప్రజలు, పార్టీ కార్యకర్తల వద్దే ఉందని షేక్ హసీనా భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement
Advertisement