త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi – Donald Trump Phone Call | యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులు, ముఖ్యంగా అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన 'హార్ముజ్ జలసంధి'ని తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకతపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు.

J

International | Published On Mar 24, 2026, 7.51 pm IST

PM Modi – Donald Trump Phone Call | యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ట్రంప్
Advertisement

PM Modi - Donald Trump Phone Call | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియాలో ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చిన వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఫోన్ కాల్లో ప్రధానంగా మిడిల్ ఈస్ట్ పరిస్థితులు, ముఖ్యంగా 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) గుండా వాణిజ్య నౌకల రాకపోకల ఆవశ్యకత గురించి ఇరువురు నేతలు చర్చించినట్లు అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన తొలి ఫోన్ కాల్ ఇదే కావడం గమనార్హం.

శాంతి, స్థిరత్వమే భారత్ లక్ష్యం: మోదీ ట్వీట్

ట్రంప్‌తో సంభాషణ అనంతరం ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా స్పందించారు.

"అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. పశ్చిమ ఆసియాలో ప్రస్తుత పరిస్థితులపై మా మధ్య ఉపయోగకరమైన, నిర్మాణాత్మక చర్చ జరిగింది. ఉద్రిక్తతలు తగ్గి, వీలైనంత త్వరగా అక్కడ శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోంది. హార్ముజ్ జలసంధిని ప్రపంచ దేశాల కోసం సురక్షితంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం చాలా అవసరం. శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరపాలని నిర్ణయించాం" అని ప్రధాని పేర్కొన్నారు.

ఇరాన్‌తో చర్చలకు మార్గం సుగమం చేసేలా.. ఆ దేశ ఇంధన కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ఈ కాల్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

https://x.com/narendramodi/status/2036433142815523128

పార్లమెంటులో ప్రధాని ప్రకటన: తీవ్ర ఇంధన సంక్షోభం

ఈ యుద్ధం వల్ల "తీవ్రమైన ఇంధన సంక్షోభం" తలెత్తిందని అంతకుముందు ప్రధాని మోదీ పార్లమెంట్‌లో తెలిపారు. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాల నుంచి భారత్‌ భారీ ఎత్తున దిగుమతి చేసుకునే ఇంధనం, గ్యాస్, ఎరువుల సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. గల్ఫ్ దేశాల నాయకులతోనూ తాను మాట్లాడానని, వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, అంతర్జాతీయ నావిగేషన్‌కు ఆటంకాలు కల్పించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రధాని స్పష్టం చేశారు.

అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. భారత్ వద్ద సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని ప్రధాని భరోసా ఇచ్చారు. దేశంలో శుద్ధి చేసిన ఇంధనంతో పాటు, 3.372 మిలియన్ టన్నుల ముడిచమురు రిజర్వ్‌లో ఉందని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో వెల్లడించారు.

'హార్ముజ్ జలసంధి' భారత్‌కు ఎందుకు కీలకం?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభ రోజుల్లో ఇరాన్ ప్రయోగించిన షాహెద్ 'కమికాజ్' డ్రోన్ దాడులపైనే ప్రపంచం దృష్టి పెట్టింది. కానీ యుద్ధం సాగుతున్న కొద్దీ ముడి చమురు, గ్యాస్ సరఫరాపై తీవ్ర ఆందోళన మొదలైంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిపోయింది. దీనికి ప్రధాన కారణం ఇరాన్ భౌగోళిక నియంత్రణలో ఉన్న 'హార్ముజ్ జలసంధి'. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం (రోజుకు 20-25 మిలియన్ బ్యారెళ్లు) ఈ ఇరుకైన మార్గం గుండానే రవాణా అవుతుంది.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారత్‌కు రోజుకు 5.5 నుంచి 6 మిలియన్ బ్యారెళ్ల చమురు అవసరం. యుద్ధానికి ముందు భారత్ తన ముడిచమురు అవసరాల్లో దాదాపు 40 శాతం (రోజుకు 2.1 నుంచి 2.6 మిలియన్ బ్యారెళ్లు) గల్ఫ్ దేశాల నుంచి ఈ 'హార్ముజ్' మార్గం ద్వారానే దిగుమతి చేసుకునేది. దీనిని బట్టి ఈ మార్గం తెరిచి ఉంచడం భారత్‌కే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement