త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Rejects Pakistan Offer | ‘పాకిస్థాన్‌తో మాకేం సంబంధం’ : ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చల ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇస్లామాబాద్‌లో నేరుగా చర్చలు నిర్వహిస్తామన్న పాకిస్థాన్ ప్రతిపాదనను ఇరాన్ తీవ్రంగా తోసిపుచ్చింది. అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగలేదని స్పష్టం చేసింది.

J

International | Published On Mar 30, 2026, 5.58 pm IST

Iran Rejects Pakistan Offer | ‘పాకిస్థాన్‌తో మాకేం సంబంధం’ : ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చల ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్
Advertisement

Iran Rejects Pakistan Offer | త్రినేత్ర.న్యూస్ : అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తామన్న పాకిస్థాన్ ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు ఆతిథ్యం ఇస్తామని పాకిస్థాన్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. పాకిస్థాన్ నేతృత్వంలో జరిగే ఎలాంటి ప్రయత్నాల్లోనూ తాము భాగస్వాములం కాదని ఇరాన్ స్పష్టం చేసింది.

మధ్యవర్తుల ద్వారా అహేతుక డిమాండ్లు

ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సోమవారం ఈ అంశంపై ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగలేదని, కేవలం మధ్యవర్తుల ద్వారా మితిమీరిన, అహేతుకమైన డిమాండ్లు మాత్రమే తమకు అందాయని పేర్కొంది. పాకిస్థాన్ ఏర్పాటు చేసే వేదికలు వారి సొంత వ్యవహారమని, వాటిలో ఇరాన్ పాల్గొనలేదని కాన్సులేట్ స్పష్టం చేసింది.

Pakistan hosts talks with Saudi Arabia, Turkey and Egypt to discuss regional de-escalation, in Islamabad

"అమెరికాతో ప్రత్యక్ష చర్చలు లేవు.. మధ్యవర్తుల ద్వారా మితిమీరిన, అహేతుక డిమాండ్లు మాత్రమే వస్తున్నాయి. అమెరికా దౌత్యం నిరంతరం మారుతూ ఉంటుంది. కానీ మా వైఖరి స్పష్టంగా ఉంది. పాకిస్థాన్ వేదికలు వారి సొంతం, మేము అందులో పాల్గొనలేదు. యుద్ధాన్ని ముగించాలనే ప్రాంతీయ పిలుపులను స్వాగతిస్తున్నాం.. కానీ ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరో గుర్తుంచుకోండి!" అని కాన్సులేట్ జనరల్ తన ప్రకటనలో ఘాటుగా బదులిచ్చింది.

పాకిస్థాన్ వాదన ఏంటి?

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇషాక్ దార్ ఆదివారం ఇస్లామాబాద్‌లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమెరికా-ఇరాన్ చర్చలకు ఇస్లామాబాద్‌లో ఆతిథ్యం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి ఆయా దేశాల విదేశాంగ మంత్రులు పూర్తి మద్దతు తెలిపారని దార్ ప్రకటించారు. హార్ముజ్ జలసంధి ద్వారా సముద్ర రవాణాకు అంతరాయం కలగడం తదితర పరిణామాలపై వారు చర్చించారు.

Pakistan hosts talks with Saudi Arabia, Turkey and Egypt to discuss regional de-escalation

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలతో తాను, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పలుమార్లు ఫోన్‌లో మాట్లాడామని దార్ చెప్పుకొచ్చారు. అలాగే అమెరికా యంత్రాంగంతో కూడా చురుకుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. అయితే, ఆదివారం ఇస్లామాబాద్‌లో పటిష్ట భద్రత మధ్య జరిగిన ఈ చర్చల్లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ప్రతినిధులు ఎవరూ పాల్గొనకపోవడం గమనార్హం. వాషింగ్టన్‌తో ఎలాంటి అధికారిక చర్చలు జరపలేదని టెహ్రాన్ చెబుతున్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్లామాబాద్ ద్వారా పంపిన 15-అంశాల ప్రణాళికకు ఇరాన్ తన స్పందనను తెలియజేసిందని ఇరాన్‌కు చెందిన తస్నిమ్ (Tasnim) న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

కొనసాగుతున్న దాడులు.. ట్రంప్ హెచ్చరికలు

మరోవైపు సోమవారం కూడా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు కొనసాగించాయి. ఇరాన్ సైతం గల్ఫ్ అరబ్ దేశాలపై తన దాడుల్లో భాగంగా కువైట్‌లోని ఓ కీలక నీటి, విద్యుత్ కేంద్రంపై దాడి చేయడంతో పాటు.. ఉత్తర ఇజ్రాయెల్‌లోని చమురు శుద్ధి కర్మాగారంపై విరుచుకుపడింది.

A blaze after Israel's Fire and Rescue Service said that an industrial building and a fuel tanker at Israel's Oil Refineries were hit by debris from an intercepted Iranian missile, in Haifa

అయితే, గౌరవసూచకంగా సోమవారం నుంచి హార్ముజ్ జలసంధి ద్వారా 20 ఆయిల్ ట్యాంకర్లను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అదే సమయంలో పర్షియన్ గల్ఫ్‌లోని ఇరాన్‌కు చెందిన ఖార్గ్ ఐలాండ్ (Kharg Island) చమురు టెర్మినల్‌ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే 2,500 మంది యూఎస్ మెరైన్‌లు ఆ ప్రాంతంలో మోహరించారని, మరో భారీ బృందం అక్కడికి చేరుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement