త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kuwait Airport Attack | కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ భీకర దాడి.. భారతీయుడు మృతి, నిలిచిన విమాన సేవలు

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన భీకర దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. కువైట్‌లో విమాన సేవలు బంద్!

J

International | Published On Jun 3, 2026, 5.56 pm IST

Kuwait Airport Attack | కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ భీకర దాడి.. భారతీయుడు మృతి, నిలిచిన విమాన సేవలు
Advertisement

Kuwait Airport Attack | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రాచ్యంలో (Middle East) ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం (Kuwait International Airport) లక్ష్యంగా జరిగిన భారీ దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో కనీసం 63 మంది తీవ్రంగా గాయపడ్డారని కువైట్ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. పౌరులు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడిపై గల్ఫ్ దేశాలు భగ్గుమంటున్నాయి.

అసలేం జరిగింది?

బుధవారం కువైట్ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్-1 పై ఆకస్మికంగా దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఎయిర్‌పోర్ట్ సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుళ్ల ధాటికి గాయపడిన 63 మందిని వెంటనే వివిధ ఆసుపత్రులకు తరలించామని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని కువైట్ ఆరోగ్య శాఖ ప్రతినిధి అబ్దుల్లా అల్-సనద్ తెలిపారు. తలలకు తీవ్ర గాయాలు కావడం, శరీర భాగాలు తెగిపడటం లాంటి హృదయ విదారక దృశ్యాలు కనిపించాయని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వెంటనే 25 అంబులెన్స్‌లను (Ambulances) పంపించి సహాయక చర్యలు చేపట్టారు.

భారతీయుడి మృతి.. ఎంబసీ అలర్ట్

ఈ భీకర దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించినట్లు కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ (Indian Embassy) అధికారికంగా ఎక్స్ వేదికగా ధృవీకరించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎంబసీ.. కువైట్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఎయిర్‌పోర్ట్‌పై దాడుల నేపథ్యంలో కువైట్ సివిల్ ఏవియేషన్ తమ దేశంలో విమాన రాకపోకలను (Air traffic) పూర్తిగా నిలిపివేసింది.

దాడి చేసింది మేమే: ఇరాన్

కువైట్‌పై జరిగిన ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇరాన్‌కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ (Revolutionary Guards) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల తమ ఆయిల్ ట్యాంకర్, ద్వీపంపై అమెరికా (US) చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు టెలిగ్రామ్ (Telegram) ఛానెల్ ద్వారా స్పష్టం చేసింది. కువైట్‌లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని యూఎస్ ఫిఫ్త్ ఫ్లీట్ హెడ్‌క్వార్టర్స్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు (Missiles), డ్రోన్లతో (Drones) విరుచుకుపడినట్లు ఇరాన్ వెల్లడించింది.

గల్ఫ్ దేశాల ఆగ్రహం

ఇరాన్ తీరుపై గల్ఫ్ దేశాలు (Gulf countries) తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పౌర విమానాశ్రయం లాంటి కీలక మౌలిక సదుపాయాలపై దాడి చేయడాన్ని కువైట్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ పదే పదే చేస్తున్న ఇలాంటి దాడులను ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని యూఏఈ (UAE) అధ్యక్ష సలహాదారు అన్వర్ గార్గాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ దాడి కేవలం ఒక దేశంపై జరిగినది కాదు, మనందరిపై జరిగిన దాడి" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement