త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?

వర్షాకాలంలో పచ్చని అందాలు, జలపాతాల మధ్య రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన 7 అద్భుతమైన ట్రైన్ రూట్స్ ఇవే.

J

Tourism | Published On Aug 5, 2026, 4.00 am IST

Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?
Advertisement
  • భారత్‌లో వర్షాకాలంలో 7 అత్యంత అందమైన మాన్‌సూన్ రైలు మార్గాలు ఇవే
  • సముద్రంపై ప్రయాణించే పాంబన్ బ్రిడ్జ్ నుంచి మంచు కొండల్లో సాగే కశ్మీర్ వ్యాలీ రైల్వే వరకు విశేషాలు
  • దూద్‌సాగర్ జలపాతం, అరకు లోయల మీదుగా సాగే ప్రకృతి రమణీయత
  • ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు మధురమైన అనుభూతినిచ్చే బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్

Monsoon Train Journeys India | త్రినేత్ర.న్యూస్ : రైలు ప్రయాణం అంటే కేవలం ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లడమే కాదు. కిటికీ పక్కన కూర్చుని.. పచ్చని కొండలు, జలపాతాలు, నదులు, లోయలను చూస్తూ ఎంజాయ్ చేయడం ఒక అద్భుతమైన ఫీలింగ్. ముఖ్యంగా వర్షాకాలంలో (Monsoon) ఈ అందాలు మరింత రెట్టింపు అవుతాయి. సముద్రపు వంతెనలు దాటుకుంటూ, చీకటి గుహల (Tunnels) గుండా వెళ్తూ ఒక మధురమైన అనుభూతిని ఇచ్చే 7 బెస్ట్ ట్రైన్ రూట్స్ (Train routes) మన ఇండియాలో ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిన ఆ మార్గాలేంటో చూద్దాం.

1. చెన్నై టు రామేశ్వరం (పాంబన్ బ్రిడ్జ్ మీదుగా)

Chennai to Rameswaram via Pamban Bridge

భారత్‌లో అత్యంత అందమైన, సాహసోపేతమైన రైలు ప్రయాణాల్లో ఇది ముందుంటుంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న 'పాంబన్ బ్రిడ్జ్' (Pamban Bridge) మీదుగా సముద్రంపై ప్రయాణించడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. కిటికీలోంచి చూస్తే ఇరువైపులా అనంతమైన నీలి సముద్రం, చిన్నచిన్న దీవులు, కలర్‌ఫుల్ ఫిషింగ్ బోట్లు కనిపిస్తాయి. ధనుష్కోడిని నాశనం చేసిన ఎన్నో తుఫాన్లను కూడా ఈ వంతెన తట్టుకుని నిలబడింది. ఇప్పుడు కొత్తగా 2.2 కిలోమీటర్ల పొడవైన దేశంలోనే తొలి వర్టికల్-లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ కూడా ఇక్కడ సిద్ధమైంది.

2. షోరనూర్ టు నిలంబూర్ రోడ్ (కేరళ సీక్రెట్ రూట్)

Shoranur to Nilambur Road – Kerala's Secret Branch Line

కేరళలోని ఈ రూట్‌ను ముద్దుగా "గ్రీన్ టన్నెల్" (Green Tunnel) అని పిలుస్తారు. సుమారు 66 కిలోమీటర్ల ఈ ప్రయాణం రెండు గంటల పాటు సాగుతుంది. దట్టమైన అడవులు, పచ్చని వరి పొలాలు, నాలుగు ప్రధాన నదుల (కుంతిపుజా, వెల్లియార్, ఒలిప్పుజా, కుతిరప్పుజా) మీదుగా ఈ ట్రైన్ వెళ్తుంది. "టేక్ ప్లాంటేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా" గా పేరున్న నిలంబూర్ నుంచి ఈ జర్నీ మొదలవుతుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య ఈ రూట్‌లో ప్రయాణిస్తే ఆ కిక్కే వేరు.

3. కోరాపుట్ టు అరకు వ్యాలీ (తూర్పు కనుమల అందాలు)

Koraput to Araku Valley – Eastern Ghats Hideaway

తూర్పు కనుమల (Eastern Ghats) గుండా సాగే ఈ ప్రయాణం మనసును దోచేస్తుంది. అరకు వ్యాలీ రూట్‌లో ట్రైన్ ఏకంగా 58 టన్నెల్స్ (సొరంగాలు), ఎన్నో వంతెనల గుండా వెళ్తుంది. కాఫీ తోటలు, గిరిజన గ్రామాలు, లోయలు, జలపాతాల అందాలను చూస్తూ ప్రయాణించవచ్చు. వర్షాకాలం, చలికాలంలో ఈ ప్రయాణం చేస్తే ఆ మజానే వేరు.

4. కొచ్చి టు కాసర్‌గోడ్ (కేరళ కోస్టల్ రైల్వే)

Kochi to Kasaragod – Kerala Coastal Railway

సముద్ర తీరం వెంబడి సాగే అందమైన ప్రయాణం ఇది. కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, బ్యాక్‌వాటర్స్ (Backwaters), చిన్న పల్లెటూర్ల గుండా ట్రైన్ దూసుకుపోతుంది. జూన్-సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలో అరేబియా సముద్రం అలలు రైల్వే ట్రాక్‌కు చాలా దగ్గరగా వస్తాయి. కోజికోడ్ దాటేటప్పుడు పాతకాలపు భవనాల అందాలు కూడా ఆకట్టుకుంటాయి.

5. లోండా టు దూద్‌సాగర్ (క్యాజిల్ రాక్ మీదుగా)

Londa to Dudhsagar via Castle Rock

కొండలు, జలపాతాలు అంటే ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవుల గుండా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో ప్రధాన ఆకర్షణ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'దూద్‌సాగర్ జలపాతం' (Dudhsagar Waterfall). కళ్ల ముందే పాల నురగలా దూకుతున్న జలపాతం పక్కనుంచే రైలు వెళ్తుంటే.. ఆ అనుభూతి వర్ణనాతీతం. జులై, ఆగస్టు నెలలు ఇందుకు బెస్ట్ టైమ్.

6. పాతాళపాని టు కలకుండ్ (మధ్యప్రదేశ్ హెరిటేజ్ రైల్వే)

Patalpani to Kalakund – Madhya Pradesh's Heritage Railway

మధ్యప్రదేశ్ అడవుల్లో సాగే చిన్న, అందమైన ప్రయాణం ఇది. కేవలం 9.5 కిలోమీటర్ల దూరమే అయినా.. పచ్చని లోయలు, రాతి కొండలు, దట్టమైన అడవుల మధ్య ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోతుంది. వర్షాకాలంలో పచ్చదనం తోడై.. జలపాతాలకు జీవం పోయడంతో ఈ హెరిటేజ్ ట్రైన్ (Heritage train) రైడ్ మరింత స్పెషల్‌గా మారుతుంది. ట్రైన్ నెమ్మదిగా వెళ్లడం వల్ల సీనరీని ఎంజాయ్ చేయడానికి తగినంత సమయం దొరుకుతుంది.

7. జమ్మూ టు బారాముల్లా (కశ్మీర్ వ్యాలీ రైల్వే)

Jammu to Baramulla – Kashmir Valley Railway

ఇండియాలో మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వే రూట్లలో ఇదొకటి. పీర్ పంజాల్ పర్వతాల గుండా సాగే ఈ ప్రయాణంలో మంచుతో కప్పబడిన కొండలు, ఆకుపచ్చని లోయలు, అందమైన గ్రామాలు పలకరిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ 'చీనాబ్ బ్రిడ్జ్' (Chenab Bridge) ఈ రూట్‌లోనే ఉంది. వింటర్‌లో మంచు కురుస్తున్నప్పుడు ఈ ప్రయాణం ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది.

మీరు ప్రకృతి ప్రేమికులైనా, ఫొటోగ్రఫీ ఇష్టమున్న వారైనా లేదా ప్రశాంతంగా విండో సీటు పక్కన కూర్చుని స్లో ట్రావెల్ (Slow travel) ఎంజాయ్ చేయాలనుకున్నా.. ఈ 7 రూట్లు మీకు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మీ నెక్స్ట్ ట్రిప్‌ను ప్లాన్ చేసుకోండి!

Advertisement
Advertisement