త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Asia | ఏప్రిల్ 6 వ‌ర‌కు ఇరాన్‌కు డెడ్‌లైన్‌.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌

West Asia | ప‌శ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌, యూఎస్‌-ఇరాన్ యుద్ధం 28వ రోజుకు చేరుకుంది. గ‌ల్ఫ్‌లోని ప‌లుదేశాల‌పై మిస్సైల్స్‌ను ప్ర‌యోగించ‌గా.. అడ్డుకున్న‌ట్లు ఆయా దేశాలు ప్ర‌క‌టించాయి.

P

International | Published On Mar 27, 2026, 8.00 pm IST

West Asia | ఏప్రిల్ 6 వ‌ర‌కు ఇరాన్‌కు డెడ్‌లైన్‌.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌
Advertisement
  • ఇరాన్ స‌మ‌యం అడిగింద‌ని ప్ర‌క‌ట‌న‌
  • చ‌ర్చ‌ల‌పై ఇరాన్ మీడియా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని ఆరోప‌ణ‌లు
  • గ‌ల్ఫ్ దేశాల‌పై మిస్సైల్స్‌ను ప్ర‌యోగించిన ఇరాన్‌

West Asia | ప‌శ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌, యూఎస్‌-ఇరాన్ యుద్ధం 28వ రోజుకు చేరుకుంది. గ‌ల్ఫ్‌లోని ప‌లుదేశాల‌పై మిస్సైల్స్‌ను ప్ర‌యోగించ‌గా.. అడ్డుకున్న‌ట్లు ఆయా దేశాలు ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలోనే యూఎస్ ట్రంప్ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ ఇంధ‌న కేంద్రాల‌పై దాడులు చేయ‌కుండా ఉండేందుకు ఏడు రోజుల స‌మ‌యం కోరింద‌ని, తాను ప‌ది రోజులు గ‌డువు ఇచ్చాన‌ని తెలిపారు. ఈ గ‌డువు ఏప్రిల్ 6 వ‌ర‌కు ఉంటుంద‌న్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ తన ప్రభుత్వంతో సంప్రదించి మరింత సమయం కోరిందని ట్రంప్ వెల్లడించారు. చ‌ర్చ‌ల అంశంపై మాట్లాడుతూ ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై ట్రంప్ మాట్లాడుతూ, “వాళ్లు మా ప్రతినిధుల ద్వారా మరింత సమయం కావాలని కోరారు. పని చేయకపోతే వారి విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తాను. వారు 7 రోజులు అడిగారు. నేను 10 రోజులు ఇచ్చాను” అని అన్నారు. ఇరాన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయన్నారు. ఇదే ట్రంప్ మరోసారి అమెరికా ఇరాన్‌పై యుద్ధంలో విజయం సాధించిందని ప్రకటించారు. ఇరాన్ నౌకాదళం, క్షిపణి సామర్థ్యాలను గణనీయంగా దెబ్బతీశామని, వైమానిక దళాన్ని ధ్వంసం చేశామని చెప్పారు. ఇరాన్‌కు చెందిన 154 నౌకలను నాశనం చేశామని వెల్ల‌డించారు.

గ‌ల్ఫ్ దేశాల‌పై ఇరాన్ దాడులు..

మరోవైపు, ఇరాన్ శుక్రవారం ఉదయం భారీ దాడులు ప్రారంభించింది. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4’లో 83వ స్టేజ్‌ని ప్రారంభించింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకొని దాడుల‌కు పాల్ప‌డింది. ఇజ్రాయెల్‌లోని అష్‌డోడ్ వద్ద ఉన్న ఆయిల్ డిపోపై అధునాతన క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అలాగే సైనిక స్థావరాలపై కూడా ఖచ్చితమైన దాడులు జరిగాయి. ఇరాన్, కువైట్‌లోని అలి అల్ సలేం ఎయిర్‌బేస్, బహ్రెయిన్‌లోని షేక్ ఈసా బేస్‌పై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో అమెరికా రక్షణ వ్యవస్థలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. యూఏఈలోని అల్ ధాఫ్రా ఎయిర్‌బేస్‌పై డ్రోన్ దాడులు జరిగాయి. ఇటీవల ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ నౌకాదళ అధిపతి అలిరెజా మరణించడంతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ల‌క్ష మందితో సైన్యం..

ఇరాన్‌పై భూత‌దాడుల‌కు అమెరికా సిద్ధ‌మ‌వుతుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో.. వాటిని ఎదుర్కొనేందుకు ఇరాస్ సైతం సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో భాగంగా ప‌దిల‌క్ష‌ల మందితో సైన్యాన్ని సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఓ వైపు ట్రంప్ చ‌ర్చ‌లు ప్ర‌తిపాద‌న‌లు తెస్తూ.. మ‌రో వైపు ఇరాన్‌పై దాడుల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నగా ఇరాన్‌ సైనిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇరాన్‌ నేలపై యూఎస్ సైన్యం త‌మ గ‌డ్డ‌పై అడుగుపెడితే వారికి నరకం చూపించేందుకు తమ యోధులు సిద్ధంగా ఉన్నారని సైన్యం హెచ్చ‌రించింది. తాము సైన్యంలో చేరుతామ‌ని బ‌సిజ్ ఫోర్స్‌, ఐఆర్‌జీసీల‌కు యువ‌కుల నుంచి అభ్య‌ర్థ‌న‌లు వ‌స్తున్నాయ‌ని తెలిపాయి. ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యుద్ధంలో పాల్గొనేందుకు ఉన్న వ‌య‌సు ప‌రిమితిని సైతం తొల‌గించిన‌ట్లు స‌మాచారం. 12 ఏళ్ల పిల్ల‌ల‌కు సైతం యుద్ధంలో పాల్గొనేందుకు అంగీక‌రించేందుకు నిర్ణ‌యించిన‌ట్లుగా స‌మాచారం. ఇదిలా ఉండ‌గా.. ఓ వైపు ఇరాన్‌తో చ‌ర్చ‌లు అంటూనే మ‌రో వైపు అత్యాధునిక ఫైట‌ర్ జెట్ల‌తో పాటు 10వేల మందితో సైనికుల‌ను మోహ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు వాషింగ్ట‌న్ పోస్ట్ క‌థ‌నం ప్ర‌చురించింది.

కెన‌డా విదేశాంగ మంత్రితో జైశంక‌ర్ భేటీ..

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ తో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశం జీ7 సమావేశం సందర్భంగా జరిగింది. ఈ భేటీలో పశ్చిమ ఆసియా సంక్షోభం, వాణిజ్యం, కీలక ఖనిజాలు, వ్యవసాయం, విద్య వంటి అంశాలపై చర్చించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హోర్ముజ్ జలసంధి భద్రతపై కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది.

Advertisement

తాజావార్తలు

Advertisement