త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Conflict | చమురు కాదు.. నీరే గ‌ల్ఫ్‌కు లైఫ్‌లైన్‌!

Iran Conflict | పశ్చిమాసియాలో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్య గల్ఫ్‌ దేశాలకు నీటి భద్రత ఆందోళనకరంగా మారింది. ఇప్పటి వరకు చమురునే అత్యంత కీలక వనరుగా యావ‌త్ ప్ర‌పంచం భావిస్తూ వ‌చ్చింది. చ‌మురు కంటే ఎక్కువ‌గా గ‌ల్ఫ్ దేశాల‌కు డీసాలినేషన్‌ ప్లాంట్లు మాత్ర‌మే లైఫ్‌లైన్‌గా మారింది.

P

International | Published On Mar 21, 2026, 7.11 pm IST

Iran Conflict | చమురు కాదు.. నీరే గ‌ల్ఫ్‌కు లైఫ్‌లైన్‌!
Advertisement
  • డీసాలినేషన్‌ ప్లాంట్లపై ఇరాన్ దాడుల భ‌యం
  • ఆందోళనకరంగా మారిన నీటి భద్రత
  • ఎడారి ప్రాంతంలో నీటి మౌలిక వసతుల లేమి
  • కీలకంగా మారిన డీసాలినేషన్‌ ప్లాంట్లు
  • ప్లాంట్లు మూతపడితే నీటి సంక్షోభం తప్పదు
  • నీటి భద్రతతోనే గల్ఫ్‌కు స్థిరత్వమంటున్న నిపుణులు

Iran Conflict | పశ్చిమాసియాలో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్య గల్ఫ్‌ దేశాలకు నీటి భద్రత ఆందోళనకరంగా మారింది. ఇప్పటి వరకు చమురునే అత్యంత కీలక వనరుగా యావ‌త్ ప్ర‌పంచం భావిస్తూ వ‌చ్చింది. చ‌మురు కంటే ఎక్కువ‌గా గ‌ల్ఫ్ దేశాల‌కు డీసాలినేషన్‌ ప్లాంట్లు మాత్ర‌మే లైఫ్‌లైన్‌గా మారింది. ఇరాన్‌పై యూఎస్‌, ఇజ్రాయెల్ వ‌రుస దాడులు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి ఇరాన్ గ‌ల్ఫ్ దేశాల‌పై విరుచుకుప‌డుతోంది. ముఖ్యంగా క్రూడాయిల్ రిఫైన‌రీల‌పై విరుచుకుప‌డుతోంది. గ‌ల్ఫ్ దేశాల‌కు ఆయువుప‌ట్టుగా నిలుస్తున్న వాట‌ర్ డీసాలినేష‌న్ ప్లాంట్ల‌ను సైతం ల‌క్ష్యంగా చేసుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ప‌లు యూనిట్ల‌పై డ్రోన్ దాడులు జ‌రిగిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. గ‌ల్ఫ్ దేశాల‌కు లైఫ్‌లైన్‌గా నిలుస్తున్న ఈ యూనిట్ల‌పై ఇరాన్ దాడులు భ‌యాల‌తో ఈ ప్రాంతంలో స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎడారి వాతావరణం, తక్కువ వర్షపాతం కారణంగా గల్ఫ్‌ దేశాల్లో సహజ తాగునీటి వనరులు అందుబాటులో లేవు. దీంతో సముద్రపు నీటిని శుద్ధి చేసే డీసాలినేషన్‌ ప్లాంట్లపైనే ఇక్క‌డ జీవ‌నం ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంది. అరేబియా ద్వీపకల్పంలోని దుబాయి, దోహా, కువైట్‌ సిటీ, అబుదాబి వంటి ప్రధాన నగరాల నీటి సరఫరా పూర్తిగా ఈ ప్లాంట్ల నుంచే జరుగుతోంది. సౌదీ అరేబియాలో తాగునీటిలో సుమారు 70 శాతం, కువైట్‌, ఒమాన్‌లలో 90 శాతం వరకు డీసాలినేషన్‌ ద్వారానే అందుతోంది. మొత్తం గల్ఫ్‌ ప్రాంతంలో దాదాపు 10 కోట్ల మంది ప్రజలు ఈ నీటిపైనే ఆధారపడుతున్నారు.

డీసాలినేషన్‌పైనే గల్ఫ్‌ జీవనం

ప్రపంచంలోనే అతిపెద్ద డీసాలినేషన్‌ ప్లాంట్లలో చాలా గల్ఫ్‌ మరియు ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితిని నిపుణులు ‘డీసాలినేషన్‌ డిపెండెన్సీ’గా పేర్కొంటున్నారు. గల్ఫ్‌ దేశాలు ప్రపంచ డీసాలినేషన్‌ ఉత్పత్తిలో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉండటం ఈ ఆధారపడుతున్న స్థాయిని చూపుతోంది. ఈ ప్లాంట్లు స్థిర నిర్మాణాలుగా ఉండటంతో వీటికి తక్షణ ప్రత్యామ్నాయాలు కల్పించడం సాధ్యం కాదు. చమురు పైప్‌లైన్‌లు లేదా నిల్వ కేంద్రాల మాదిరిగా వీటిని మళ్లించడం కుదరదు. ఒక పెద్ద ప్లాంట్‌ తీవ్రంగా దెబ్బతింటే దాన్ని పునరుద్ధరించడానికి నెలలు, అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల్లోనే నగరాల్లో నీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ ప్లాంట్ల రక్షణ ఆయా దేశాలకు వ్యూహాత్మక అవసరంగా మారింది.

భారీ పెట్టుబడులు.. బిలియన్ల ఖర్చు

డీసాలినేషన్‌ ప్లాంట్ల నిర్మాణం గల్ఫ్‌ దేశాలపై భారీ ఆర్థిక భారంగా మారాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఆయా దేశాలు కనీసం 40 బిలియన్‌ డాలర్లకుపైగా ఈ ప్రాజెక్టులపై ఖర్చు చేశాయి. సౌదీ అరేబియాలోని రాస్‌ అల్‌ ఖైర్‌ వంటి భారీ ప్లాంట్‌ నిర్మాణానికి మాత్రమే సుమారు 7.2 బిలియన్‌ డాలర్లు వెచ్చించినట్లు అంచనా. డీసాలినేషన్‌ ప్రక్రియ అత్యంత ఖరీదైనదే కాకుండా అధిక విద్యుత్‌ వినియోగాన్ని కూడా అవసరం చేస్తుంది. గల్ఫ్‌ దేశాల్లో మొత్తం విద్యుత్‌ వినియోగంలో 10 నుంచి 25 శాతం వరకు ఈ ప్రక్రియకే వెళ్తోంది. ఒకప్పుడు ఒక క్యూబిక్‌ మీటర్‌ నీటి ఉత్పత్తికి 5 డాలర్ల వరకు ఖర్చవుతుండగా, సాంకేతిక అభివృద్ధితో అది ప్రస్తుతం 0.40–0.50 డాలర్లకు తగ్గింది. అయినప్పటికీ ఇది ఇంకా ఖరీదైన పరిష్కారంగానే కొనసాగుతోంది.

పెరుగుతున్న నీటి అవసరాలు

గల్ఫ్‌ దేశాల్లో నీటి అవసరాలు కూడా భారీగా ఉన్నాయి. సౌదీ అరేబియాలో రోజుకు సుమారు 2.5–3 కోట్ల క్యూబిక్‌ మీటర్ల నీరు అవసరమవుతుండగా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఇది 1.5–2 కోట్ల క్యూబిక్‌ మీటర్ల వరకు ఉంటుంది. కువైట్‌కు 50–70 లక్షలు, ఒమాన్‌కు 30–40 లక్షలు, ఖతర్‌కు 40–50 లక్షలు, బహ్రెయిన్‌కు 10–15 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీరు రోజువారీ అవసరం. వ్యక్తిగత వినియోగం కూడా గణనీయంగా ఎక్కువగానే ఉంది. సౌదీ అరేబియాలో ఒక్కో వ్యక్తి రోజుకు 250–300 లీటర్లు వినియోగిస్తుండగా, యూఏఈలో ఇది 500 లీటర్లకు పైగా ఉంటుంది. మొత్తం గల్ఫ్‌ ప్రాంతంలో రోజుకు 6–8 కోట్ల క్యూబిక్‌ మీటర్ల నీరు అవసరమవుతుండగా, ఇందులో అధిక భాగం డీసాలినేషన్‌ ద్వారానే అందుతోంది.

నగరాల ఉనికికే ముప్పు

గల్ఫ్‌ దేశాల ఆర్థిక వ్యవస్థను చమురు నడిపిస్తే, వారి జీవనాన్ని నీరు నడిపిస్తోంది. డీసాలినేషన్‌ లేకుండా ఈ ప్రాంతంలోని ఆధునిక నగరాల ఉనికి అసాధ్యం. ప్రస్తుతం గల్ఫ్‌లో వందల సంఖ్యలో డీసాలినేషన్‌ ప్లాంట్లు పనిచేస్తుండగా, ప్రపంచ సామర్థ్యంలో పెద్ద భాగం ఇక్కడే కేంద్రీకృతమైంది. ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్లాంట్లు వ్యూహాత్మక లక్ష్యాలుగా మారుతున్నాయి. ఇవి దెబ్బతింటే కొన్ని రోజుల్లోనే నీటి సరఫరా కుదేలై, నగరాల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గల్ఫ్‌లో చమురు ఎంత ముఖ్యమో నీరు అంతకంటే కీలకంగా మారుతోంది. బిలియన్ల డాలర్లతో నిర్మించిన డీసాలినేషన్‌ ప్లాంట్లు ఇప్పుడు కేవలం మౌలిక వసతులు కాదు, ఆయా దేశాల జీవనాధారాలు. భవిష్యత్‌లో నీటి భద్రతే గల్ఫ్‌ ప్రాంత స్థిరత్వాన్ని నిర్ణయించే ప్రధాన అంశంగా మారనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement