త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | తెలంగాణ భాష కేవ‌లం ఒక్క‌ భాష మాత్ర‌మే కాదు.. ప్ర‌జ‌ల జీవన విధానం కూడా

Telangana | సెప్టెంబ‌ర్ 9న ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవాన్ని అమెరికాలోని బే ఏరియాలో తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

S

International | Published On Sep 12, 2026, 5.33 pm IST

Telangana | తెలంగాణ భాష కేవ‌లం ఒక్క‌ భాష మాత్ర‌మే కాదు.. ప్ర‌జ‌ల జీవన విధానం కూడా
Advertisement

అమెరికాలో ప్ర‌జా క‌వి కాళోజీ జ‌యంతిలో ద‌క్షిణామూర్తి

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : సెప్టెంబ‌ర్ 9న ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవాన్ని అమెరికాలోని బే ఏరియాలో తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి విచ్చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్యాత, ప్రభుత్వ కార్యక్రమాల వ్యాఖ్యాత, తెలంగాణ అధికార భాషా సంఘం ఓఎస్డీ మడిపల్లి దక్షిణామూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డబ్లిన్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బే ఏరియాకు చెందిన తెలుగు సంఘాల ప్రతినిధులతో పాటు కన్నడ, హిందీ, పంజాబీ, తమిళ, మలయాళ తదితర భాషా సంఘాల ప్రతినిధులు పాల్గొనడం విశేషం. తెలంగాణ సాంస్కృతిక సంఘం విజయ్ చావా రూపకల్పనలో సాగిన ఈ సమావేశంలో అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, కోశాధికారి సాగర్ కొత్త తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మడిపల్లి దక్షిణామూర్తి తెలంగాణ భాష చరిత్ర, ప్రత్యేకతలతో పాటు.. తన వృత్తిగత ప్రయాణం, ఆకాశవాణి కడప, వరంగల్, హైదరాబాద్ కేంద్రాల ద్వారా భాషా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో తన అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ భాష కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది తెలంగాణ ప్రజల జీవన విధానం, సంస్కృతి, చరిత్ర, భావోద్వేగాలు, మట్టి వాసనకు ప్రతిరూపమని ఆయన అన్నారు. అమెరికాలోని తెలంగాణ యువతరానికి తమ మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడం, భవిష్యత్ తరాలకు తెలంగాణ భాషా ,సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం మనందరి నిరంతర బాధ్యతగా పేర్కొన్నారు.

తెలంగాణ భాషా దినోత్సవం వంటి కార్యక్రమాలు తెలంగాణ చైతన్యాన్ని మరింతగా పెంపొందించడంతో పాటు, మన భాషా చరిత్రను పునరావలోకనం చేసుకుని, భాషా పరిరక్షణకు, పరివ్యాప్తికి మనమంతా పునరంకితం కావడానికి దోహదపడతాయని కార్యక్రమంలో మాట్లాడిన పలువురు పేర్కొన్నారు.

అనంతరం అమెరికన్ ఇండియన్ అసోసియేషన్ ( ఏఐఏ) నిర్వహించిన కమ్యూనిటీ సమావేశంలో మడిపల్లి దక్షిణామూర్తి రాధిక దంపతులను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా గౌరవనీయులైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగం, భాష, సంస్కృతి పట్ల అనుపమానమైన శ్రద్ద కనబరుస్తూన్నారని, తెలంగాణా భాషా సేవలో తనకు తోచినంత కృషి చేసే అవకాశం ఇచ్చి తెలంగాణ అధికార భాషా సంఘం ఓఎస్డీగా నియమించినందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిడ్డగా తమకు అనేకానేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రతి సంవత్సరం దాదాపు యాభై భారతీయ సంఘాల ప్రతినిధులు సామూహికంగా నిర్వహించబోయే వినాయక చవితి వంటి పండుగల సందర్భంలోనూ తెలంగాణా కళారూపాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. దక్షిణామూర్తి ఆకాశవాణి ద్వారా చేస్తున్న స్వరసేవలో భాగంగా ధారావాహికగా ప్రసారం చేస్తున్న భారత ప్రధాన మంత్రి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులోమాట అనౌన్స్మెంటు వినిపించినపుడు భాషలకు అతీతంగా అందరూ స్పందించి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో ఆల్ ఇండియా అసోసియేషన్స్ ప్రతినిధులు కళ్యాణ్ కట్టమూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, రమేష్ కొండా, చంద్రశేఖర్ ఆజాద్ తదితరులతో పాటు టీసీఏ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, కోశాధికారి సాగర్ కొత్త పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement