త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Artemis-2 | భూమి దిశ‌గా వ్యోమ‌గాముల ప్ర‌యాణం షురూ.. 40వేల కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తున్న నౌక‌..!

Artemis-2 | విజ‌య‌వంతంగా చంద్రుడి చెంత‌కు చేరుకున్న ఆర్టెమిస్‌-2 మిష‌న్ నలుగురు వ్యోమగాములు ప్రస్తుతం భూమి వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. భార‌త‌కాల‌మానం ప్ర‌కారం.. మంగళవారం రాత్రి సుమారు 10:55 గంటల సమయంలో ‘ఒరియన్’ అంతరిక్ష నౌక చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావం నుంచి బ‌య‌ట‌ప‌డింది.

P

International | Published On Apr 8, 2026, 10.23 am IST

Artemis-2 | భూమి దిశ‌గా వ్యోమ‌గాముల ప్ర‌యాణం షురూ.. 40వేల కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తున్న నౌక‌..!
Advertisement

Artemis-2 | విజ‌య‌వంతంగా చంద్రుడి చెంత‌కు చేరుకున్న ఆర్టెమిస్‌-2 మిష‌న్ నలుగురు వ్యోమగాములు ప్రస్తుతం భూమి వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. భార‌త‌కాల‌మానం ప్ర‌కారం.. మంగళవారం రాత్రి సుమారు 10:55 గంటల సమయంలో ‘ఒరియన్’ అంతరిక్ష నౌక చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావం నుంచి బ‌య‌ట‌ప‌డింది. ప్రస్తుతం భూమి గురుత్వాకర్షణ ప్రభావం పెరగడంతో నౌక వేగంగా భూమి వైపుగా దూసుకువ‌స్తోంది. చంద్రుడి నుంచి బయలుదేరిన నౌక మూడురోజుల పాటు ప్ర‌యాణించ‌నుంది. ఈ సమయంలో వ్యోమగాముల ప్రధాన లక్ష్యం భూమిపై సురక్షితంగా చేరుకోవడమే. ఈ క్రమంలో ‘ట్రాజెక్టరీ కరెక్షన్ బర్న్స్’ అనే చిన్న ఇంజిన్లను ఉప‌యోగించుకుంటూ భూమిని చేర‌నున్నారు. వీటి సహాయంతో అంతరిక్ష నౌక దిశ, వేగాన్ని నియంత్రిస్తూ భూమి వాతావరణంలో సరైన కోణంలో ప్రవేశించేలా చూస్తారు. ఇది అదుపు త‌ప్పితే ప్ర‌మాదం సంభ‌వించే అవ‌కాశాలుంటాయి.

ఏప్రిల్ 10 కీలకం..

భూమికి తిరుగు ప్రయాణంలో అత్యంత కీలక దశ ఏప్రిల్ 10న ఎదురుకానుంది. ఆ రోజు ఒరియన్ నౌక గంటకు సుమారు 40వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించనుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 2,760 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు ‘స్కిప్ రీ-ఎంట్రీ’ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇందులో అంతరిక్ష నౌక ముందుగా వాతావరణంలోకి కొంతవరకు ప్రవేశించి, తిరిగి కొద్దిసేపు బయటకు వెళ్లి, ఆపై మళ్లీ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధానం వల్ల వేడి ప్రభావం తగ్గి, వ్యోమగాములపై ఒత్తిడి తగ్గి, ల్యాండింగ్ మరింత సురక్షితంగా జరుగుతుంది.

ఈ మిషన్ ఏప్రిల్ 11న ముగియనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:37 గంటల సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియా, సాన్ డియాగో సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఒరియన్ క్యాప్సూల్ ల్యాండ్ అవుతుంది. అక్కడ ముందుగానే అమెరికా నౌకాదళానికి చెందిన ‘యూఎస్‌ఎస్ జాన్ పీ ముర్తా’ నౌక సిద్ధంగా ఉంటుంది. క్యాప్సూల్ సముద్రంలో దిగిన వెంటనే డైవర్లు వ్యోమగాములను బయటకు తీసుకువ‌స్తారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత మానవులు చంద్రుడి సమీపానికి మళ్లీ చేరుకోవడం ఈ మిషన్ ప్రత్యేకత. భవిష్యత్తులో మళ్లీ మనుషులను చంద్రుడిపైకి పంపే దిశగా ఇది కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు.

Advertisement
Advertisement