త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు

Minor Girls Rescued | ఇళ్ల నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన ముగ్గురు మైనర్ బాలికలను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించి సురక్షితంగా రక్షించారు. మధ్యప్రదేశ్‌లోని బీనా రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చి, కౌన్సెలింగ్ అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.

P

Hyderabad | Published On Jul 28, 2026, 7.34 pm IST

Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు
Advertisement

Minor Girls Rescued | ఇళ్ల నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన ముగ్గురు మైనర్ బాలికలను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించి సురక్షితంగా రక్షించారు. మధ్యప్రదేశ్‌లోని బీనా రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చి, కౌన్సెలింగ్ అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి కనిపించడం లేదని వారిలో ఒకరి తల్లి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా బాలికలు ఇంట్లో చిన్నచిన్న విషయాలకు తల్లిదండ్రులు తరచూ మందలించడంతో మనస్తాపానికి గురై, ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు గుర్తించారు. అనంతరం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాటేదాన్ నుంచి ఆటోలో వెళ్లినట్లు నిర్ధారించారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. రైల్వే పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కాటేదాన్, బుద్వేల్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించి బాలికల ప్రయాణ మార్గాన్ని గుర్తించారు.

దర్యాప్తు సందర్భంగా బాలికల్లో ఒకరు వెంట తీసుకెళ్లిన మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్ ఆధారంగా సాంకేతిక విశ్లేషణ చేపట్టి ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేశారు. దీంతో వారు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నట్లు నిర్ధారించడమే కాకుండా, ఏ బోగీలో, ఏ సీట్లలో ఉన్నారో కూడా గుర్తించారు. ఈ సమాచారాన్ని వెంటనే రైల్వే పోలీసులకు అందించడంతో మధ్యప్రదేశ్‌లోని బీనా రైల్వే స్టేషన్‌లో రైలును తనిఖీ చేసి ముగ్గురు బాలికలను సురక్షితంగా రెస్క్యూ చేశారు. అనంతరం వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలని, వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. చిన్నచిన్న విషయాలకు తీవ్రంగా మందలించడం కంటే సమస్యలను ఓర్పుతో పరిష్కరించే ప్రయత్నం చేయాలని, పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై తగిన పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. ఏ సమస్య వచ్చినా ఇంటి నుంచి వెళ్లిపోవడం పరిష్కారం కాదని, కుటుంబ సభ్యులు, నమ్మకమైన వ్యక్తుల సహాయం తీసుకునేలా పిల్లలకు ధైర్యం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement