త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సిడ్నీలో కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్‌ది హైదరాబాదే : తెలంగాణ డీజీపీ

ఆస్ట్రేలియాలో స్థిరపడిన తర్వాతనే సాజిద్ ఐసీస్ ఉగ్రవాద సంస్థకు ఆకర్షితులయ్యాడు. వాళ్లు ఐసీస్ భావజాలాన్ని పాటించడానికి, భారత్‌కి లేదా తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

J

Hyderabad | Published On Dec 16, 2025, 6.23 pm IST

సిడ్నీలో కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్‌ది హైదరాబాదే : తెలంగాణ డీజీపీ
Advertisement

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బోండీ బీచ్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఇద్దరు తండ్రికొడుకుల్లో ఒకరైన ఉగ్రవాది సాజిద్ అక్రంది తెలంగాణలోని హైదరాబాద్ అని తెలంగాణ డీజీపీ తెలిపారు. నిందితుడు సాజిద్ అక్రమ్ దగ్గర ఇండియన్ పాస్‌పోర్ట్ లభ్యం కావడంతో అతడి జాతీయతపై పలు అనుమానాలు రేకెత్తాయి.

తెలంగాణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాజిద్‌ది హైదరాబాద్ పాతబస్తీ. 1998 లోనే విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. హైదరాబాద్‌లోనే బీకామ్ డిగ్రీ పూర్తి చేసిన అక్రమ్ ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడే యూరప్‌కి చెందిన మహిళ వెనెరాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె క్రిస్టియన్. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోనే శాశ్వతంగా సెటిల్ అయ్యాడు. వాళ్లకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు మొన్న సిడ్నీ కాల్పుల్లో తండ్రి సాజిద్‌తో పాటు పాల్గొన్నాడు. పేరు నవీద్ అక్రమ్.కొడుకు, కూతురు వీళ్లిద్దరూ ఆస్ట్రేలియా పౌరులే. సాజిద్ మాత్రం ఇప్పటి వరకు భారత పాస్‌పోర్ట్‌నే ఉపయోగించాడు.

గత 27 సంవత్సరాల నుంచి తమకు సాజిద్‌తో ఎలాంటి సంప్రదింపులు లేవని హైదరాబాద్‌లో ఉంటున్న సాజిద్ బంధువులు తెలిపారు. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాక ఇప్పటి వరకు సాజిత్ ఒక ఆరు సార్లు మాత్రమే భారత్‌కి వచ్చాడని తెలిపారు. తన తండ్రి చనిపోయినా సాజిద్ భారత్‌కి రాలేదు.

ఆస్ట్రేలియాలో స్థిరపడిన తర్వాతనే సాజిద్ ఐసీస్ ఉగ్రవాద సంస్థకు ఆకర్షితులయ్యాడు. వాళ్లు ఐసీస్ భావజాలాన్ని పాటించడానికి, భారత్‌కి లేదా తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

గత నెలలో ఫిలిప్పీన్స్‌కి సాజిద్

గత నెల నవంబర్‌లో సాజిద్, తన కొడుకు నవీద్‌తో కలిసి ఫిలిప్పీన్స్ వెళ్లాడు. అక్కడే 28 రోజుల పాటు ఉండి ఆ తర్వాత ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చారని ఆస్ట్రేలియా పోలీసులు ధృవీకరించారు. ఫిలిప్పీన్స్ ఇమిగ్రేషన్ అధికారుల ప్రకారం.. సాజిద్ ఇండియన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాడని, నవీద్ ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్‌తో ప్రయాణించాడని తెలిపారు. వీళ్లు ఎందుకు ఫిలిప్పీన్స్ వెళ్లారు? అక్కడి నుంచి ఆస్ట్రేలియా వచ్చాక ఎందుకు ఈ దారుణానికి తెగబడ్డారు అనే దానిపై ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా, పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్రం మృతి చెందగా, అతడి కొడుకు నవీద్ అక్రమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement