త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Professor Manohar Suspension | ఓయూ అధికారుల తాట తీస్తా.. ఖబడ్దార్ : వీసీ, రిజిస్ట్రార్లపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గర్జన

ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ వేటు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వర్సిటీకి చేరుకుని వీసీ, రిజిస్ట్రార్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీసీల ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోమని హెచ్చరించారు.

J

Hyderabad | Published On Jan 20, 2026, 8.39 pm IST

Professor Manohar Suspension | ఓయూ అధికారుల తాట తీస్తా.. ఖబడ్దార్ : వీసీ, రిజిస్ట్రార్లపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గర్జన

సంక్షిప్త సారాంశం

ఓయూ ప్రొఫెసర్ మనోహర్ అక్రమ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న యుద్ధభేరి మోగించారు. యూనివర్సిటీలో అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ విచారణ కోరారు. సస్పెన్షన్ ఎత్తేయకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement
  • ప్రొఫెసర్ మనోహర్‌పై విధించిన అక్రమ సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలి
  • విధులకు గైర్హాజరైన వీసీ, రిజిస్ట్రార్‌లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి
  • వర్సిటీలో కొనసాగుతున్న అణచివేత ధోరణిని తక్షణమే అరికట్టాలి
  • తీన్మార్ మల్లన్న డిమాండ్

Professor Manohar Suspension | త్రినేత్ర.న్యూస్: ఉస్మానియా యూనివర్సిటీ (OU) వేదికగా అధికారుల అరాచకాలు సాగుతున్నాయని, బీసీ ప్రొఫెసర్లను వేధిస్తే సహించేది లేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఓయుటీఏ (OUTA) అధ్యక్షుడు, ప్రొఫెసర్ మనోహర్‌పై విధించిన సస్పెన్షన్ వేటును నిరసిస్తూ మంగళవారం ఆయన యూనివర్సిటీని సందర్శించారు.

అధికారులు పారిపోతారా? కుర్చీలో కూర్చునే అర్హత ఉందా?

సమస్యపై చర్చించేందుకు యూనివర్సిటీకి వచ్చిన మల్లన్నకు వీసీ, రిజిస్ట్రార్ అందుబాటులో లేకపోవడంతో ఆయన నిప్పులు చెరిగారు. "ఒక ఎమ్మెల్సీగా ప్రజా సమస్యపై మాట్లాడటానికి వస్తే భయపడి పారిపోతారా? కనీసం బాధ్యత లేకుండా ప్రవర్తించే మీకు ఆ కుర్చీల్లో కూర్చునే అర్హత ఉందా?" అని ప్రశ్నించారు. బీసీ ప్రొఫెసర్ల జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అధికారులను చట్టం ముందు నిలబెట్టి తాట తీస్తానని హెచ్చరించారు.

వర్సిటీ ఏమైనా మీ అయ్య జాగీరా?

విశ్వవిద్యాలయం ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలని, అధికారుల సొంత జాగీరులా వ్యవహరిస్తే ఊరుకోబోమని మల్లన్న మండిపడ్డారు. ప్రొఫెసర్లను గేటు బయట ఆపే సంస్కృతికి చరమగీతం పాడాలన్నారు. ప్రొఫెసర్ మనోహర్‌ని గేటు వద్ద ఆపిన సిబ్బందితో అక్కడికక్కడే క్షమాపణలు చెప్పించారు. తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలని, లేదంటే వర్సిటీని దిగ్బంధిస్తామని హెచ్చరించారు.

మంత్రులతో ఫోన్లో మల్లన్న చర్చలు

వీసీ, రిజిస్ట్రార్ అందుబాటులో లేకపోవడంతో మల్లన్న అక్కడి నుంచే మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో ఫోన్లో మాట్లాడారు. "కొందరు అధికారులు కావాలనే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రులు, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

బీసీల ఆత్మగౌరవ సమస్యగా పోరాటం

ఇది కేవలం ఒక ప్రొఫెసర్ సమస్య మాత్రమే కాదని, రాష్ట్రంలోని బీసీల ఆత్మగౌరవ సమస్య అని మల్లన్న అభివర్ణించారు. ఉస్మానియాలో కుల వివక్షను, అణచివేత ధోరణిని అరికట్టే వరకు తన పోరాటం ఆగదని, అవసరమైతే రాష్ట్రాన్ని కదిలిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement