త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Housing Scheme | పది అంతస్తుల్లో ‘ఇందిరమ్మ’ ఇండ్లు.. ఉపాధికి దూరం కాకుండా పేదలకు సర్కార్ వరం

తెలంగాణలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు గుడ్ న్యూస్! జీవనోపాధి దెబ్బతినకుండా పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.

J

Hyderabad | Published On Jun 25, 2026, 7.56 pm IST

Indiramma Housing Scheme | పది అంతస్తుల్లో ‘ఇందిరమ్మ’ ఇండ్లు.. ఉపాధికి దూరం కాకుండా పేదలకు సర్కార్ వరం
Advertisement
  • తెలంగాణలో పేదల కోసం క్యూర్ (CURE) పరిధిలో 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
  • జూన్ 28 నాటికి ఇళ్ల స్థలాల ఎంపిక పూర్తి, జూలై మొదటి వారంలో బ్రోచర్ విడుదల
  • తొలి విడతలో ప్రయోగాత్మకంగా ఒక్కో నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్ల కేటాయింపు
  • మహిళల పేరు మీద అన్-డివైడెడ్ షేర్ (UDS) కింద కోట్ల విలువ చేసే స్థలాల రిజిస్ట్రేషన్

Indiramma Housing Scheme | త్రినేత్ర.న్యూస్ : సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణలోని పేదలకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు నివసిస్తున్న ప్రాంతాలకు చేరువలోనే ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం సచివాలయంలో ప్రకటించారు. ముఖ్యంగా క్యూర్ (CURE) పరిధిలో స్థలాలు ఆదా చేసేందుకు 10 అంతస్తుల భవనాలను నిర్మించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఉపాధి, చదువులకు దూరం కాకుండా

గతంలో ఇండ్ల నిర్మాణం పేరిట పేదలను నగర శివార్లకు పంపడం వల్ల వారి ఉపాధి, పిల్లల చదువులు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు సర్కార్ కొత్త ప్లాన్ డిజైన్ చేసింది. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని, లబ్ధిదారులు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాల్లోనే వారికి గౌరవప్రదమైన నివాసాలను అందించనున్నారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ఈ ఏడాది ఏకంగా లక్ష ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లను మంజూరు చేయనున్నారు.

జూలై మొదటి వారంలో బ్రోచర్

ఇప్పటికే క్యూర్ పరిధిలో దాదాపు 20 లొకేషన్లను గుర్తించిన అధికారులు, జూన్ 28 నాటికి మిగతా స్థలాలను కూడా ఫైనలైజ్ చేయనున్నారు. ఆ లోపే ప్రాజెక్ట్ ప్లాన్స్, డిజైన్లను సిద్ధం చేస్తారు. ఇక జూలై మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ తదితర వివరాలతో కూడిన బ్రోచర్‌ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది. కోట్ల రూపాయల విలువైన ఈ ప్రభుత్వ స్థలాల్లో మహిళల సాధికారత కోసం.. వారికి అన్-డివైడెడ్ షేర్ (Undivided share) కింద వాటా కల్పిస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనుండటం ఈ స్కీమ్ హైలైట్.

ఒకే మోడల్‌లో RDO, తహసీల్దార్ ఆఫీసులు

కేవలం ఇండ్ల నిర్మాణమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ కార్పొరేషన్ (Housing Corporation) ఆధ్వర్యంలో ఒకే డిజైన్ లో ఆర్డీవో (RDO), తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కలెక్టర్లతో కో-ఆర్డినేట్ చేసుకుని పనులు వేగవంతం చేయాలని, పాత భవనాల మరమ్మతులకు సంబంధించి ఏఈలతో రిపోర్ట్ తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే భద్రాచలం దేవస్థానం అభివృద్ధిపైనా మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ రివ్యూ మీటింగ్‌లో రెవెన్యూ సెక్రటరీ డీఎస్ లోకేశ్ కుమార్, హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement