త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tunga Balu | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: తుంగ బాలు డిమాండ్‌

Tunga Balu | పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు డిమాండ్ చేశారు. గత 30 నెలలుగా తెలంగాణలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

S

Hyderabad | Published On Jun 19, 2026, 1.10 pm IST

Tunga Balu | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: తుంగ బాలు డిమాండ్‌
Advertisement
  • ఓయూ ఆర్ట్స్ క‌ళాశాల ముందు పోస్ట‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌

Tunga Balu | త్రినేత్ర‌.న్యూస్‌: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు డిమాండ్ చేశారు. ఈమేర‌కు శుక్ర‌వారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కార్‌పై తీవ్ర విమర్శ‌లు గుప్పించారు. గత 30 నెలలుగా తెలంగాణలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తెలంగాణ భ‌విష్య‌త్తును నిర్ల‌క్ష్యం చేయ‌డమే..

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ విద్యావ్యవస్థ నేడు దిగజారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో "భవిష్యత్ తెలంగాణ అంటే విద్యార్థులు, విద్యావ్యవస్థ" అని చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం విద్యారంగాన్ని గాలికి వదిలేశారు. భవిష్యత్ తరాలను నిర్లక్ష్యం చేయడం అంటే తెలంగాణ భవిష్యత్తునే నిర్లక్ష్యం చేయడమే అని బాలు పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం అని హెచ్చ‌రించారు.

వ‌చ్చే నెల 22న రాష్ట్ర స్థాయి స‌ద‌స్సు..

విద్యా వ్యవస్థలో పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, ప్రణాళిక లోపించాయని, విద్యాసంస్థలకు అవసరమైన నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొంపల్లి నరేష్ నిర్వహణలో వచ్చే నెల 22న హైదరాబాద్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యారంగ పరిరక్షణ అంశాలపై రాష్ట్ర స్థాయి విద్యార్థి సదస్సు నిర్వహిస్తాం. ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి నాయకులు, మేధావులు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలి అని తుంగ బాలు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు ఆవాల హరిబాబు, ఒగ్గు శివకుమార్ కురువ పల్లయ్య, రామ్ నర్సింగ్ గౌడ్ పులి శ్రీకాంత్, కొండ గణేష్, సాయికుమార్, కరుణాకర్, ఉదయ్, నితీష్ కుమార్, మహేందర్, రమేష్ కుమార్, రాజేష్, సాయి ప్రకాష్, నితీష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement