త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు.. యాక్సెంచ‌ర్ హెచ్చ‌రిక‌ల‌తో ఐటీ షేర్లు ఢ‌మాల్‌..

Stock Markets | భార‌త స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం న‌ష్టాల్లో ముగిశాయి. అమెరికా ఐటీ దిగ్గ‌జం యాక్సెంచ‌ర్ భ‌విష్య‌త్ అంచ‌నాల‌ను త‌గ్గించ‌డంతోపాటు ఐటీ రంగానికి హెచ్చ‌రిక‌లు చేయ‌డంతో ఐటీ కంపెనీల షేర్ల‌పై తీవ్ర‌మైన ఒత్తిడి నెల‌కొంది. దీంతో ఐటీ షేర్లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. దీని వ‌ల్ల బెంచ్ మార్క్ సూచీలు తీవ్రంగా న‌ష్ట‌పోయాయి.

S

Business | Published On Jun 19, 2026, 4.15 pm IST

Stock Markets | భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు.. యాక్సెంచ‌ర్ హెచ్చ‌రిక‌ల‌తో ఐటీ షేర్లు ఢ‌మాల్‌..
Advertisement

Stock Markets | భార‌త స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం న‌ష్టాల్లో ముగిశాయి. అమెరికా ఐటీ దిగ్గ‌జం యాక్సెంచ‌ర్ భ‌విష్య‌త్ అంచ‌నాల‌ను త‌గ్గించ‌డంతోపాటు ఐటీ రంగానికి హెచ్చ‌రిక‌లు చేయ‌డంతో ఐటీ కంపెనీల షేర్ల‌పై తీవ్ర‌మైన ఒత్తిడి నెల‌కొంది. దీంతో ఐటీ షేర్లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. దీని వ‌ల్ల బెంచ్ మార్క్ సూచీలు తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ 607 పాయింట్లు (0.78 శాతం) త‌గ్గి 76,803 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ 50 సూచీ 155 పాయింట్లు (0.64 శాతం) ప‌త‌నమై 24,013 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఉద‌యం సెష‌న్‌లో సూచీలు భారీ గ్యాప్ డౌన్‌తో ప్రారంభం అయిన‌ప్ప‌టికీ మ‌ధ్యాహ్నం త‌రువాత భారీ కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో ఇంట్రా డే క‌నిష్టాల నుంచి సూచీలు కాస్త రిక‌వ‌ర్ అయిన‌ప్ప‌టికీ క్రితం సెష‌న్ ముగింపుతో పోలిస్తే దిగువ‌నే నిలిచాయి. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లు భారీగా ప‌త‌న‌మ‌వ‌డం సూచీల‌ను కింద‌కు తెచ్చింది.

కుదేలైన ఐటీ రంగ షేర్లు..

నిఫ్టీ ఐటీ సూచీ ఉద‌యం ట్రేడింగ్‌లో 6 శాతానికి పైగా ప‌త‌న‌మై త‌రువాత కాస్త రిక‌వ‌ర్ అయింది. చివ‌రికి 3.65 శాతం న‌ష్టంతో ముగిసింది. ఇత‌ర ప్ర‌ధాన రంగాల్లో ఏ రంగం కూడా 1.2 శాతానికి మంచి ప‌త‌న‌మ‌వ‌లేదు. కానీ ఐటీ రంగ షేర్ల‌లో మాత్రం భారీ అమ్మ‌కాల ఒత్తిడి క‌నిపించింది. ఐటీ రంగంలో వ‌చ్చిన బ‌ల‌హీన‌త మొత్తం మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపించింది. అయితే మ‌ధ్యాహ్నం త‌రువాత ఇత‌ర రంగాల షేర్ల‌లో కొనుగోళ్లు భారీగా పెర‌గ‌డంతో సూచీలు కాస్త రిక‌వ‌ర్ అయి న‌ష్టాల‌ను త‌గ్గించుకున్నాయి. మేటి ఐటీ కంపెనీల షేర్లు అత్య‌ధికంగా అమ్మ‌కాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇన్ఫోసిస్ షేర్లు అన్నింటి క‌న్నా ఎక్కువ‌గా 6.75 శాతం మేర క్షీణించాయి. నిఫ్టీ 50 సూచీలో అత్య‌ధికంగా న‌ష్ట‌పోయిన షేర్‌గా ఇది నిలిచింది. అలాగే టీసీఎస్ షేర్లు 3.55 శాతం ప‌డిపోగా, టెక్ మ‌హీంద్రా 2.63 శాతం, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 2.59 శాతం ప‌త‌న‌మ‌య్యాయి. విప్రో షేర్లు 1.12 శాతం త‌గ్గాయి.

యాక్సెంచ‌ర్ హెచ్చరిక‌ల‌తో..

విస్తృత మార్కెట్ల‌లోనూ అమ్మ‌కాల ఒత్తిడి క‌నిపించింది. మిడ్ క్యాప్ ఐటీ కంపెనీల షేర్లు సైతం ప‌డిపోయాయి. ఎంఫ‌సిస్ షేర్లు 3.17 శాతం మేర ప‌త‌న‌మ‌వ్వ‌గా, బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీలో ప్ర‌ధానంగా న‌ష్ట‌పోయిన షేర్‌గా ఇది నిలిచింది. అలాగే ఎల్‌టీ టెక్నాల‌జీస్ షేర్లు 1.94 శాతం త‌గ్గాయి. ప‌ర్సిస్టెంట్ సిస్ట‌మ్స్ షేర్లు 1.93 శాతం మేర క్షీణించాయి. యాక్సెంచ‌ర్ కంపెనీ తాజా ఫ‌లితాల‌తోపాటు భ‌విష్య‌త్ అంచ‌నాలు ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డంతో మొత్తం ఐటీ రంగంపై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. యాక్సెంచ‌ర్ త‌న ఆర్థిక సంవ‌త్స‌రం రెవెన్యూ వృద్ధి అంచ‌నాల‌ను భారీగా త‌గ్గించింది. ఖాతాదారుల వ్య‌యాలు ఇంకా బ‌ల‌హీనంగానే ఉన్నాయ‌ని, ప‌శ్చిమ ఆసియా ప్రాంతంలో కొన‌సాగుతున్న అంత‌రాయాల కార‌ణంగా ఆదాయంపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతోంద‌ని కంపెనీ తెలిపింది. కొత్త ఆర్డ‌ర్లు కూడా ఆశించిన స్థాయిలో రావ‌డం లేద‌ని, టెక్నాల‌జీ రంగంలో విస్తృత స్థాయి పున‌రుద్ధ‌ర‌ణ త్వ‌ర‌గా క‌నిపించక‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేసింది. దీంతో ఐటీ రంగ షేర్లు కుదేల‌య్యాయి.

స్వ‌ల్పంగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు, బ‌ల‌ప‌డ్డ రూపాయి..

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.76 శాతం పెరిగి బ్యారెల్‌కు 79 డాల‌ర్ల వ‌ద్ద నిల‌వ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.12 శాతం మేర ఎగ‌బాకి బ్యారెల్‌కు 75 డాల‌ర్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఫారెక్స్ మార్కెట్‌లో ఉద‌యం సెష‌న్‌లో రూపాయి విలువ కాస్త తగ్గినా త‌రువాత పుంజుకుని డాల‌ర్‌తో పోలిస్తే 0.01 శాతం బ‌ల‌ప‌డింది. అమెరికా డాల‌ర్‌కు రూపాయి ప్ర‌స్తుతం 94.31 వ‌ద్ద ఉంది. అయితే ఏఐ ప్ర‌భావం వ‌ల్ల ఐటీ రంగంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని, ఆ రంగ షేర్లు ప‌డిపోవ‌డానికి ఇది కూడా ఒక కార‌ణ‌మ‌ని బ్రోక‌రేజీ సంస్థ‌లు విశ్లేషిస్తున్నాయి. ఏఐ వ‌ల్ల అమెరికా మార్కెట్లు సైతం ప‌త‌న‌మ‌వుతున్నాయ‌ని తెలిపాయి. భ‌విష్య‌త్తులో ఐటీ రంగంపై ఏఐ ప్ర‌తికూల ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించాయి.

Advertisement
Advertisement