త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYD Traffic | ట్రాఫిక్ నియంత్రణకు 30 కొత్త పెట్రోలింగ్ బైక్‌లు.. ప్రారంభించిన సీపీ స‌జ్జ‌నార్‌

HYD Traffic | నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రహదారి భద్రతను మరింత బలోపేతం చేయడానికి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్‌సీ), హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శనివారం 30 అత్యాధునిక ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లను ప్రారంభించారు. అలాగే ట్రాఫిక్ మార్షల్స్ కార్యక్రమానికి సీఎస్‌ఆర్ నిధుల ద్వారా సహకరించిన 45 కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.

P

Hyderabad | Published On Jul 18, 2026, 9.15 pm IST

HYD Traffic | ట్రాఫిక్ నియంత్రణకు 30 కొత్త పెట్రోలింగ్ బైక్‌లు.. ప్రారంభించిన సీపీ స‌జ్జ‌నార్‌
Advertisement
  • సీఎస్ఆర్ నిధుల‌తో కొనుగోలు
  • ట్రాఫిక్ మార్షల్స్‌కు సహకరించిన 45 సంస్థలకు సన్మానం

HYD Traffic | నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రహదారి భద్రతను మరింత బలోపేతం చేయడానికి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్‌సీ), హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శనివారం 30 అత్యాధునిక ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లను ప్రారంభించారు. అలాగే ట్రాఫిక్ మార్షల్స్ కార్యక్రమానికి సీఎస్‌ఆర్ నిధుల ద్వారా సహకరించిన 45 కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హెచ్‌సీఎస్‌సీ చైర్మన్ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొని బైక్‌లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మాట్లాడుతూ రూ.1.6 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో కొనుగోలు చేసిన 30 కొత్త అవెంజర్ బైక్‌లతో నగరంలో ట్రాఫిక్ మొబైల్ పెట్రోలింగ్ వాహనాల సంఖ్య 80కి చేరిందన్నారు. ఇప్పటికే 50 బైక్‌లు సేవలందిస్తుండగా, కొత్త వాహనాలు ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతం చేస్తాయని చెప్పారు.

సీసీటీవీ నిఘా ఆధారంగా ప్రమాదాలు, వాహనాల బ్రేక్‌డౌన్‌లు జరిగిన వెంటనే ఈ బైక్ బృందాలు సంఘటనా స్థలాలకు చేరుకుని ట్రాఫిక్‌ను త్వరగా పునరుద్ధరిస్తాయని తెలిపారు. ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లపై అక్రమ పార్కింగ్, అడ్డుగా ఉన్న తోపుడు బండ్ల తొలగింపులో కూడా ఇవి కీలకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సుమారు 95 లక్షల వాహనాలు ఉండగా, రోజుకు మరో 1,500 నుంచి 2,000 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని సజ్జనార్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేవలం 2,500 నుంచి 3,000 మంది ట్రాఫిక్ సిబ్బందితో విధులు నిర్వహించడం సవాలుగా మారిందన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు గత ఆరు నెలల్లో హెచ్‌సీఎస్‌సీ ఆధ్వర్యంలో 120 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను రంగంలోకి దించామని చెప్పారు. వీరు విద్యార్థులు, వృద్ధులు, రోగులు రద్దీ కూడళ్లను సురక్షితంగా దాటేందుకు సహాయపడుతున్నారని వివరించారు.

మహిళల భద్రత కోసం ప్రారంభించిన 'స్పందన' సేవలను కూడా సజ్జనార్ ప్రస్తావించారు. ప్రస్తుతం 10 వాహనాలు సేవలందిస్తున్నాయని, భవిష్యత్తులో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ ఆధారిత వాహనాలతో ఈ సేవలను విస్తరించే ప్రణాళిక ఉందన్నారు. నగర భద్రత, ట్రాఫిక్ నిర్వహణ పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్, హెచ్‌సీఎస్‌సీ సెక్రటరీ జనరల్ శేఖర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement