త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMDA | మొక్కల పెంపకం ఒక ఉద్యమంగా మారాలి

HMDA | మహానగరంలో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం చేపట్టిన కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. నెక్లెస్‌ రోడ్‌లో అర్బన్‌ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో, సిటీ టెర్రస్‌ గార్డెనర్స్‌ (సీటీజీ) సహకారంతో నిర్వహిస్తున్న నర్సరీ మేళాలో భాగంగా శనివారం ఇంటింటికీ ఉచితంగా ఐదు మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది.

P

Hyderabad | Published On Aug 1, 2026, 5.55 pm IST

HMDA | మొక్కల పెంపకం ఒక ఉద్యమంగా మారాలి
Advertisement
  • అర్బన్‌ ఫారెస్ట్రీ డైరెక్టర్‌ రోహిత్‌ గోపిడి
  • నెక్లెస్‌ రోడ్‌ నర్సరీ మేళా
  • 800 కుటుంబాలకు 4వేల మొక్కల పంపిణీ

HMDA | త్రినేత్ర‌.న్యూస్ : మహానగరంలో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం చేపట్టిన కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది. నెక్లెస్‌ రోడ్‌లో అర్బన్‌ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో, సిటీ టెర్రస్‌ గార్డెనర్స్‌ (సీటీజీ) సహకారంతో నిర్వహిస్తున్న నర్సరీ మేళాలో భాగంగా శనివారం ఇంటింటికీ ఉచితంగా ఐదు మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో అర్బన్‌ ఫారెస్ట్రీ డైరెక్టర్‌ రోహిత్‌ గోపిడి పాల్గొని నగరవాసులకు మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేగంగా విస్తరిస్తున్న నగర జీవనం, పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం, రసాయన అవశేషాలతో కూడిన ఆహారం, జీవనశైలి వ్యాధుల పెరుగుదల వంటి పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో మొక్కలు పెంచడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ప్రతి ఇంటా పచ్చదనం పెంచడమే లక్ష్యం

ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ఉద్దేశంతో హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం ఈ ఏడాది లక్ష కుటుంబాలకు ఐదు చొప్పున మొక్కలు పంపిణీ చేయాలనే మహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతోందని రోహిత్‌ తెలిపారు. ఆధార్‌ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి మూడు పండ్ల మొక్కలు, రెండు ఔషధ లేదా అలంకరణ మొక్కలను అందిస్తున్నట్లు చెప్పారు. నెక్లెస్‌ రోడ్‌ నర్సరీ మేళాలో భాగంగా శనివారం 800 కుటుంబాలకు మొత్తం 4 వేల మొక్కలను పంపిణీ చేశారు. ఇందులో మామిడి, ఉసిరి, నిమ్మ, గోరింట, నిమ్మగడ్డి, అకలిఫా బ్రౌన్‌, టెకోమా గాడిచౌడి, జమ్మి వంటి మొక్కలు ఉన్నాయి.

హ‌రిత‌న‌గ‌రంగా..

హైదరాబాద్‌ను హరిత నగరంగా, ఆరోగ్యవంతమైన మహానగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా స్వీకరించాలని రోహిత్‌ గోపిడి కోరారు. ఇంటి ఆవరణలో, బాల్కనీల్లో, అందుబాటులో ఉన్న ప్రతి ప్రదేశంలో మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంపై అధికారులు ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌, సోషల్‌ మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయడంతో పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలివచ్చారు. మొక్కలు స్వీకరించిన పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు నగరంలో పచ్చదనం పెరగడంతో పాటు కాలుష్యం తగ్గించేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ చక్రపాణి, ప్రజా సంబంధాల అధికారి (పీఆర్‌ఓ) శ్రీకాంత్‌, సిటీ టెర్రస్‌ గార్డెనర్స్‌ కో-ఫౌండర్‌ సరోజ, హార్టికల్చర్‌ అధికారి జ్ఞాన సుందర్‌, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ సౌమ్య, ప్లాంటేషన్‌ అసిస్టెంట్‌ రాము పాల్గొన్నారు.

Advertisement
Advertisement