త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఒక్కరోజులోనే 2.20 లక్షలు దాటిన ‘మీసేవ’ లావాదేవీలు

Minister Sridhar Babu | తెలంగాణ ప్రభుత్వ డిజిటల్‌ సేవల వేదిక ‘మీసేవ’ మరో అరుదైన రికార్డును నెల‌కొల్పింది. ఒక్కరోజులోనే 2,20,172 లావాదేవీలు నమోదై చరిత్రలోనే అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై ప్రజలకు అందిస్తున్న మీసేవకు ఇంతటి స్పందన రావడం ప్రజల్లో డిజిటల్‌ సేవలపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

P

Telangana | Published On Aug 1, 2026, 5.18 pm IST

ఒక్కరోజులోనే 2.20 లక్షలు దాటిన ‘మీసేవ’ లావాదేవీలు
Advertisement
  • రికార్డు స్థాయిలో కార్యకలాపాలు..
  • దేశంలోనే నంబర్‌వన్‌ ఆన్‌లైన్‌ ప్రభుత్వ సేవల వేదికగా మీసేవ
  • హ‌ర్షం వ్య‌క్తం చేసిన మంత్రి శ్రీధర్‌బాబు

Minister Sridhar Babu | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్రభుత్వ డిజిటల్‌ సేవల వేదిక ‘మీసేవ’ మరో అరుదైన రికార్డును నెల‌కొల్పింది. ఒక్కరోజులోనే 2,20,172 లావాదేవీలు నమోదై చరిత్రలోనే అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై ప్రజలకు అందిస్తున్న మీసేవకు ఇంతటి స్పందన రావడం ప్రజల్లో డిజిటల్‌ సేవలపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. జూలై 31న (శుక్రవారం) ఒక్కరోజే రికార్డు స్థాయిలో మీసేవ లావాదేవీలు నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు. సాధారణంగా ప్రతిరోజూ మీసేవ ద్వారా 70 వేల నుంచి 80 వేల వరకు సేవలు అందుతుండగా.. ఒకే రోజు 2.20 లక్షలకు పైగా లావాదేవీలు జరగడం విశేషమన్నారు. మీసేవ డిజిటల్‌ వేదికను మరింత అభివృద్ధి చేయడం, సేవల పరిధిని విస్తరించడం, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీధర్‌బాబు తెలిపారు. ఎలాంటి అంతరాయాలు లేకుండా భారీ సంఖ్యలో లావాదేవీలు విజయవంతంగా పూర్తి కావడంతో మీసేవ దేశంలోనే నంబర్‌వన్‌ ప్రభుత్వ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌గా నిలిచిందని పేర్కొన్నారు.

ఫ్యామిలీ కార్డు సేవలకు స్పందన

రికార్డు స్థాయిలో నమోదైన లావాదేవీల్లో ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ కార్డు దరఖాస్తులు మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత రవాణాశాఖ సేవలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మీసేవ విజయవంతమైన పనితీరు తెలంగాణ ప్రభుత్వ డిజిటల్‌ సేవల వ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రి అన్నారు. సేవల పనితీరును మెరుగుపరచడం, అందుబాటును పెంచడం, కొత్త పౌర సేవలను చేర్చడం, సాంకేతిక మౌలిక వసతులను బలోపేతం చేయడం వంటి చర్యలతోనే ఈ స్థాయి పురోగతి సాధ్యమైందని వివరించారు.

అభినంద‌న‌లు తెలిపిన మంత్రి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించిన కేంద్రాల నిర్వాహకులు, సాంకేతిక బృందాలను మంత్రి శ్రీధర్‌బాబు అభినందించారు. ప్రస్తుతం మీసేవ ద్వారా ఫ్యామిలీ కార్డులు, ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, వివిధ రిజిస్ట్రేషన్‌ సేవలు, ప్రభుత్వ యుటిలిటీ చెల్లింపులు, ఇతర శాఖలకు సంబంధించిన పలు పౌర సేవలు డిజిటల్‌ విధానంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవలను మీసేవలోకి తీసుకురావడం, ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా సేవల వేగం, నాణ్యత, పారదర్శకతను మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

Advertisement
Advertisement